ఆంధ్రా కాంట్రాక్టర్లకు తెలంగాణ సొమ్ము ధారాదత్తం చేస్తున్న కేసీఆర్: మండిపడ్డ వైఎస్ షర్మిల
తెలంగాణ సీఎం కేసీఆర్ పై వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధినేత వైఎస్ షర్మిల తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రజా ప్రస్థానం పాదయాత్రను కొనసాగిస్తున్న వైఎస్ షర్మిల ప్రస్తుతం అచ్చంపేటలో ప్రజల సమస్యలు తెలుసుకుంటూ ముందుకు సాగిన షర్మిల ఇదే సమయంలో తెలంగాణ సీఎం కేసీఆర్ ను టార్గెట్ చేసి తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.

తెలంగాణా ఏర్పడిన తర్వాత బాగుపడింది వాళ్ళే
ఎనిమిది సంవత్సరాలుగా తెలంగాణ సీఎం కేసీఆర్ ఇచ్చిన ప్రతి హామీ అబద్ధమేనని, ప్రతి పథకం మోసపూరితమేనని వైయస్ షర్మిల మండిపడ్డారు. ఆయన ఒక అబద్ధపు ముఖ్యమంత్రి అంటూ వైఎస్ షర్మిల ఆరోపణలు గుప్పించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కెసిఆర్ కుటుంబం, మంత్రులు, ఎమ్మెల్యేలు తప్ప ప్రజలు ఎవరూ బాగుపడలేదు అని పేర్కొన్న వైయస్ షర్మిల, కమీషన్ల పేరుతో రాష్ట్రాన్ని దోచుకు తింటున్నారు అంటూ విమర్శలు గుప్పించారు. ప్రజల సంక్షేమం కోసం చేపట్టిన ప్రజాప్రస్థానం పాదయాత్రలో ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా ఈ పోరాటం ఆగదని స్పష్టం చేశారు.
ఆంధ్రా కాంట్రాక్టర్లకు తెలంగాణ సొమ్మును కట్టబెడుతున్నారు
పాదయాత్రకు వివిధ ప్రాంతాల నుంచి తరలివస్తున్న ప్రజలకు, కులమతాలకు, ప్రాంతాలకు అతీతంగా చేరదీస్తున్న ప్రజలకు ప్రత్యేక ధన్యవాదాలు అని వైయస్ షర్మిల పేర్కొన్నారు. కెసిఆర్ అరాచకాలు ప్రశ్నించేందుకే పార్టీ పెట్టామని పేర్కొన్న వైయస్ షర్మిల తెలంగాణ గడ్డపై రాజన్న రాజ్యాన్ని తీసుకొస్తామని వెల్లడించారు. ప్రజలంతా ఉద్యమించి తెలంగాణ తెచ్చుకుంటే.. కెసిఆర్ మాత్రం దళిత ముఖ్యమంత్రి అంటూ దగా చేసి,తానే గద్దెనెక్కి కమీషన్లు దోచుకుని,ఆంధ్రా కాంట్రాక్టర్లకు తెలంగాణ సొమ్మును కట్టబెడుతున్నారని విమర్శించారు. తెలంగాణ ఉద్యమ ఫలాలు ప్రజలకు అందించడానికి, వైయస్సార్ సంక్షేమ పాలన మళ్లీ తీసుకురావడానికి తమవంతుగా ప్రయత్నం చేస్తున్నామని వైయస్ షర్మిల పేర్కొన్నారు.

కేసీఆర్ ఒక మాటకారి.. మోసకారి
అంతేకాదు కేసీఆర్ ఒక మాటకారి, మోసకారి అంటూ ఆగ్రహం వ్యక్తం చేసిన వైయస్ షర్మిల, కెసిఆర్ కు హామీలు ఇవ్వడం తప్ప ఆచరణ చేతకాదు అని విమర్శించారు. ప్రశ్నించాల్సిన కాంగ్రెస్, బీజేపీ పార్టీలు కేసీఆర్ కు అమ్ముడు పోయాయి అని టార్గెట్ చేశారు. ప్రజల తరఫున ప్రశ్నించేందుకే వైయస్సార్ తెలంగాణ పార్టీ ఆవిర్భవించిందని వైయస్ షర్మిల స్పష్టం చేశారు. కేసీఆర్ ప్రజలను అడుగడుగున మోసం చేస్తున్నారని, నిరుద్యోగులను, మహిళలను, దళితులను కెసిఆర్ దగా చేస్తున్నారని మండిపడ్డారు.

దళిత సీఎం నుండి దళిత బంధు వరకు అన్నీ మోసాలే
దళిత ముఖ్యమంత్రి నుండి దళిత బంధు వరకు అన్నీ మోసాలేనని వైయస్ షర్మిల టార్గెట్ చేశారు. కేసీఆర్ అబద్దాలకోరు ముఖ్యమంత్రి అని మండిపడ్డారు. ఇక బీజేపీ మత పిచ్చి ఉన్న పార్టీ అని, కాంగ్రెస్ పార్టీ నుండి గెలిచిన వాళ్లంతా టిఆర్ఎస్ పార్టీకి వలస వెళ్ళారని విమర్శించారు. మత ఘర్షణలు సృష్టించి ఆ మంటల్లో చలి కాచుకునే పార్టీ బీజేపీ అని నిప్పులు చెరిగారు వైయస్ షర్మిల. పులి కడుపున పులే పుడుతుంది అని పేర్కొన్న వైయస్ షర్మిల, తాను రాజశేఖర్ రెడ్డి బిడ్డగా సంక్షేమ పాలన అందించడం కోసమే వచ్చానని పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications