కేసీఆర్ సర్కార్కు షర్మిల పార్టీ నేతల ఫస్ట్ అల్టిమేటం: రోడ్డెక్కి..నిరసనలు
హైదరాబాద్: ఖమ్మం జిల్లాలో దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహాన్ని ధ్వంసం చేసిన ఘటనపై వైఎస్ షర్మిల పార్టీ నేతలు ఆందోళనకు దిగారు. హైదరాబాద్ పంజగుట్టలోని వైఎస్సార్ విగ్రహం వద్ద నిరసన ప్రదర్శనలు చేపట్టారు. అక్కడే బైఠాయించారు. విగ్రహాన్ని ధ్వంసం చేసిన వారిపై వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలంటూ కేసీఆర్ ప్రభుత్వానికి డిమాండ్ చేశారు. నిందితులను శిక్షించకపోతే.. అన్ని జిల్లాల్లోనూ నిరసన ప్రదర్శనలను నిర్వహిస్తామని హెచ్చరించారు.
ఖమ్మం జిల్లాలోని రఘునాథపాలెం మండలం శివాయిగూడెంలో వైఎస్సార్ విగ్రహాన్ని గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేసిన విషయం తెలిసిందే. 2013లో అప్పటి ఉమ్మడి రాష్ట్రంలో తన పాదయాత్ర సందర్భంగా వైఎస్ షర్మిల స్వయంగా ఆవిష్కరించిన విగ్రహం అది. ఈ విగ్రహాన్ని దుండగులు నేలమట్టం చేయడం పట్ల షర్మిల పార్టీ నేతల్లో ఆగ్రహావేశాలు వ్యక్తమౌతోన్నాయి. ఆ పార్టీ నేతలు కొండా రాఘవ రెడ్డి, ఇందిరా శోభన్ వంటి పలువురు నేతలు పంజగుట్ట వైఎస్సార్ విగ్రహం వద్ద నిరసన వ్యక్తం చేశారు.
దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ను అభిమానించే కుటుంబాలు తెలంగాణలో లక్షల్లో ఉన్నాయని, ఆయన కుమార్తె రాజకీయ పార్టీ పెట్టడాన్ని తట్టుకోలేక ఇలా విగ్రహాలపై తమ అక్కసును ప్రదర్శిస్తోన్నారని వారు అన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించాలని, ఇలాంటి దుశ్చర్యలను మానుకోవాలని అన్నారు. మరోసారి వైఎస్సార్ విగ్రహాల జోలికి వెళ్తే.. తాము ఊరుకోబోమని చెప్పారు. షర్మిల పార్టీ పెట్టబోతోండటం పట్ల టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ అభద్రతాభావంతో ఉన్నాయని ఇందిరా శోభన్ అన్నారు.
ప్రజాస్వామ్యంలో ఎవ్వరైనా పార్టీ పెట్టుకోవచ్చని, ఆ హక్కు ఎవరికైనా ఉందని చెప్పారు. కొత్తగా ఆవిర్భవించబోతోన్న పార్టీని చూసి మూడు పార్టీలు భయపడుతున్నాయని ఎద్దేవా చేశారు. వైఎస్సార్ విగ్రహాలను ధ్వంసం చేయడం ద్వారా తమ భయాన్ని ఆయా పార్టీలు బయటపెట్టుకున్నట్టయిందని వ్యాఖ్యానించారు. తెలంగాణ పోలీసులు.. అత్యుత్తమంగా పనిచేస్తోన్నారని, ఇలాంటి సంఘటనలతో వారికి చెడ్డపేరు వస్తుందని అన్నారు. నిందితులను వెంటనే అరెస్ట్ చేయాలని తాను డీజీపీని కోరుతున్నానని కొండా రాఘవరెడ్డి అన్నారు.