కేటీఆర్ వ్యాఖ్యలకు వైఎస్ షర్మిల్ కౌంటర్: ‘మునుగోడు’లో మద్దతు ఎవరికీ లేదు!
హైదరాబాద్: తెలంగాణ మంత్రి కేటీఆర్ వ్యాఖ్యలకు వైయస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కౌంటర్ ఇచ్చారు. మునుగోడు ఉపఎన్నికలో టీఆర్ఎస్ పార్టీని గెలిపిస్తే.. ఆ నియోజకవర్గాన్ని దత్తత తీసుకుంటానంటూ కేటీఆర్ ఇటీవల ప్రచారంలో వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై షర్మిల తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చారు.

కేటీఆర్ వ్యాఖ్యలకు వైఎస్ షర్మిల కౌంటర్
టీఆర్ఎస్ అధికారంలో ఉన్నా.. రాష్ట్రంలో నియోజకవర్గం అభివృద్ధి చెందాలంటే దత్తత తీసుకోవాలా? అని వైఎస్ షర్మిల నిలదీశారు. మునుగోడు ప్రాంతం ఏమన్నా పక్క రాష్ట్రంలో లేదా పక్క దేశంలో ఉందా? అంటూ ఎద్దేవా చేశారు. కేటీఆర్ మాట్లాడేటప్పుడు ఆలోచించి మాట్లాడాలని హితవు పలికారు.

మునుగోడులో ఎవరికీ మద్దతు లేదన్న షర్మిల
మునుగోడులో తన మద్దతు కావాలని కొందరు తనను అడిగారని.. కానీ, తాను ఎవరికీ మద్దతు ఇవ్వనని తెలిపినట్లు వైఎస్ షర్మిల స్పష్టం చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టులో పెద్ద కుంభకోణం జరిగిందని ఆరోపించారు. వైఎస్సార్ ఉన్నప్పుడు ఆ ప్రాజెక్టును ప్రాణహిత-చేవెళ్ల పేరుతో ప్రాజెక్టును పూర్తి చేయాలని అనుకున్నారని చెప్పారు. కానీ, కేసీఆర్ దాన్ని మూడింతలు పెంచారని విమర్శించారు. గతంలో జరిగిన ఇతర స్కాంలతో పోలిస్తే కాళేశ్వరం ఇంకా పెద్ద స్కాం అని ఆరోపించారు. ఈ అవినీతిపై తాము తప్ప ఎవరూ నోరు మెదపడం లేదన్నారు షర్మిల.

కేసీఆర్కు వాటా.. అందుకే మేగాకు ప్రాజెక్టులన్న షర్మిల
ఈ అవినీతిపై ప్రతిపక్ష నేతలు ప్రభుత్వాన్ని ఎందుకు ప్రశ్నిచడం లేదని నిలదీశారు. బండి సంజయ్, రేవంత్ రెడ్డికి బాధ్యత లేకుండా డబ్బు కోసం దేనికైనా అమ్ముడుపోతారా? అని నిలదీశారు. ప్రతిపక్ష పార్టీలకు దమ్ముంటే ప్రశ్నించాలని షర్మిల సవాల్ విసిరారు. ప్రతి ప్రాజెక్టును మేగా కృష్ణారెడ్డికే ఎందుకు ఇస్తున్నారని షర్మిల ప్రశ్నించారు. కేసీఆర్కు వాటా ఉంది కాబట్టే మేగాకే ప్రాజెక్టులు దక్కుతున్నాయని ఆమె ఆరోపించారు. తమకు తెలిసిన సమాచారంతో ఈడీ, సీబీఐ, కాగ్కు నివేదిక ఇచ్చామని తెలిపారు. కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ, పసుపు బోర్డు హామీ ఏమైందని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.












Click it and Unblock the Notifications