దున్నపోతు మీద వాన పడ్డట్టే-రైతులు చనిపోతున్నా పట్టించుకోవట్లేదు-కేసీఆర్పై షర్మిల విమర్శల దాడి
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్పై వైఎస్ షర్మిల విమర్శల దాడి కొనసాగుతోంది. రైతు సమస్యల విషయంలో కేసీఆర్ దున్నపోతు మీద వానపడ్డట్టే వ్యవహరిస్తున్నారని విమర్శించారు. వరి ధాన్యం వానకు తడిసి మొలకలొస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవట్లేదని మండిపడ్డారు.
'వడ్లు వానకు తడిసి మొలకలస్తున్నాయని, రైతులు దండాలు పెట్టినా .. రోడ్లు ఎక్కినా, సర్కారు కొంటలేదని.. ఇక చావే దిక్కని రైతు ఆత్మహత్యలకు ప్రయత్నిస్తున్నా .. కేసీఆర్ సారుకు దున్నపోతు మీద వాన పడ్డట్టే ఉంటది..' అని షర్మిల ఫైర్ అయ్యారు.
ఇటీవల రైతు సమస్యలపై వైఎస్ షర్మిల ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీస్తున్నారు. క్షేత్రస్థాయిలో రైతుల వద్దకు వెళ్లి వారి సమస్యలను తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. రెండు రోజుల క్రితం పరిగి నియోజకవర్గంలో ఐకేపీ ఆధ్వర్యంలో జరుగుతున్న పంట కొనుగోళ్లను పరిశీలించారు. రాష్ట్రంలో రైతులు అన్ని విధాలా దగా పడుతున్నారని... ప్రతీ గింజను కొటామని చెప్తున్నటికీ ఆ పరిస్థితి కనిపించట్లేదని ఆ సందర్భంగా విమర్శించారు.

పండించిన పంటను అమ్ముకునే పరిస్థితి లేక చేజేతులా రైతులే తగలబెడుతుంటే... తలకాయ ఎక్కడ పెట్టుకోవాలో కేసీఆర్ ఆలోచించుకోవాలని విమర్శించారు. కేసీఆర్ ముమ్మాటికీ రైతు వ్యతిరేకి అని... రైతు ద్రోహి అని విమర్శించారు. గతంలో కేసీఆర్ సర్కార్ రైతులకు సంకెళ్లు వేసిందని గుర్తుచేశారు. ధాన్యం కొనుగోలు చేసిన 48 గంటల్లో రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేస్తామని చెప్పిన ప్రభుత్వం... ఆ మాట నిలబెట్టుకోవట్లేదన్నారు.
కాగా,దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి రోజైన జులై 8న వైఎస్ షర్మిల సొంత రాజకీయ పార్టీని స్థాపించబోతున్నారు. 'వైఎస్సార్ తెలంగాణ పార్టీ (YSRTP)' పేరుతో ఇప్పటికే పార్టీ పేరును రిజిస్టర్ చేయించారు. పార్టీ పేరుపై తనకు ఎలాంటి అభ్యంతరం లేదని వైఎస్ సతీమణి విజయలక్ష్మి రాసిన లేఖను వైఎస్సార్ టీపీ ఈసీకి సమర్పించింది. పార్టీలో కార్యకర్తలకే పెద్ద పీఠ వేస్తామని... కార్యకర్తలే రేపటి ప్రజా నాయకులని కొద్ది రోజుల క్రితం ఆమె వ్యాఖ్యానించారు. దొరల పాలనలో తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేరట్లేదని... రాజన్న రాజ్యం తీసుకొస్తానని ఆమె చెబుతున్నారు.












Click it and Unblock the Notifications