కారణం అదేనా?: గొంతు నులిమి, తాడుతో ఉరి బిగించి వైసీపీ మహిళా నేత హత్య
హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా వడ్డెర సంక్షేమ సంఘం రాష్ట్ర మహిళా నాయకురాలు వరలక్ష్మీ (36) దారుణహత్యకు గురయ్యారు. గొంతు నులిమి, మెడకు తాడుతో ఉరివేసి మరీ అత్యంత దారుణంగా ఆమెను హత్య చేశారు. కలకలం రేపిన ఈ ఘటన వికారాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.
భూ లావాదేవీల నేపథ్యంలో ఆమె హత్య జరిగిందని చెబుతున్నా... హత్య ఎవరు చేశారన్న విషయం మాత్రం మిస్టరీగా మారింది. పోలీసులు, మృతురాలి కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం వరలక్ష్మి తాండూరులో బ్యూటీపార్లర్ నిర్వహిస్తూ వైసీపీ రాష్ట్ర ఆర్గనైజింగ్ కార్యదర్శిగా, మహిళా హక్కుల సంఘం జిల్లా అధ్యక్షురాలిగా కొనసాగుతున్నారు.
ఆమెపై వివిధ పోలీసు స్టేషన్లలో పలు కేసులు నమోదు కావడమే కాకుండా ఆమెపై రౌడీషీట్ కూడా ఉందని పోలీసులు తెలిపారు. కాగా, హైదరాబాద్లో పని ఉందని ఇంట్లో చెప్పిన వరలక్ష్మి గురువారం మధ్యాహ్నం 1.30 గంటలకు తాండూరు నుంచి హైదరాబాద్కు బయలుదేరింది. తిరిగి సాయంత్రం 5.17 గంటలకు ఎంజీబీఎస్ నుంచి బస్సులో బయలుదేరి మొయినాబాద్ వరకు టికెట్ తీసుకుంది.
మొయినాబాద్లో దిగిన తర్వాత వరలక్ష్మి ఎవరెవరిని కలిసిందనేది మిస్టరీగా మారింది. అయితే, వికారాబాద్ మున్సిపల్ పరిధిలోని అనంతగిరిపల్లి శివారులో ఉన్న సాంఘిక సంక్షేమ బాలుర గురుకుల పాఠశాల పక్కన శుక్రవారం ఉదయం వరలక్ష్మి మృతదేహం పడి ఉంది. పశువుల కాపరులు చెప్పడంతో స్థానిక కౌన్సిలర్ భరత్ సమాచారంతో సీఐ రవి ఘటనా స్థలానికి చేరుకున్నారు.
మృతదేహం బోర్లాపడి ఉండడంతో హతురాలికి సంబంధించిన వివరాలు తెలియరాలేదు. మృతదేహానికి పక్కనే పడిఉన్న పర్సు ను పోలీసులు పరిశీలించారు. అందులో ని ఫొటోలు, వివరాల ఆధారంగా వరలక్ష్మిగా గుర్తించారు. ఆమె మెడకు ఉరి బిగించిన తాడు కూడా అలాగే ఉంది. ఉరి వేసిన తాడుతో మృతదేహాన్ని ఈడ్చుకుని రావడంతో మృతురాలి ముఖానికి గాయాలయ్యాయి.
దాంతో ఆమెను ఎక్కడో హత్య చేసి అక్కడికి తీసుకొచ్చారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కాగా, మృతదేహం వద్ద పర్స్ పడి ఉంది. దాంట్లో రూ.10 వేల నగదు, ఫిర్యాదు పత్రం, రౌడీషీటర్ల ఫొటోలు, పలువురి విజిటింగ్ కార్డులు, తాండూరు నుంచి ఎంజీబీఎస్, ఎంజీబీఎస్ నుంచి మొయినాబాద్ వరకు తీసుకున్న బస్సు టికెట్లు లభ్యమయ్యాయి.
పోలీసు జాగిలాలు ఘటనా స్థలం నుంచి సమీపంలో ఉన్న సాంఘిక సంక్షేమ బాలుర గురుకుల పాఠశాలకు.. అక్కడి నుంచి పక్కనే ఉన్న డెయిరీ ఫామ్లోకి వెళ్లి తిరిగి వచ్చింది. . ఎస్పీ రెమా రాజేశ్వరి, ఏఎస్పీ వెంకటస్వామి, డీఎస్పీ స్వామి పరిశీలించారు. ఘటనా స్థలాన్ని జిల్లా ఎస్పీ రెమా రాజేశ్వరి సందర్శించారు.
విచారణకు ము గ్గురు సీఐలతో నా లుగు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశామని, మిస్టరీని 24 గంటల్లో ఛేదించేలా దర్యాప్తును ముమ్మరం చేశామని తెలిపారు. వరలక్ష్మి గురువారం మధ్యాహ్నం హైదరాబాద్కు బస్సులో బయలుదేరి వెళ్లి ఎంజీబీఎస్లో సాయంత్రం దిగినట్లు, వెంటనే తిరిగి బస్సులో మొయినాబాద్కు 5.17 గంటలకు వచ్చినట్లు తెలుస్తోందన్నారు.
వరలక్ష్మి ఫోన్ కాల్డేటాను పరిశీలించి వివరాలు సేకరిస్తున్నట్లు తెలిపారు. నిందితులను పట్టుకునేందుకు 4 పోలీసు బృందాలను ఏర్పాటు చేశామన్నారు. కాల్ డాటాను సేకరించి ఎవరెవరితో మాట్లాడిందని ఆరా తీస్తున్నారు. కొందకరిపై అనుమానం వ్యక్తం చేస్తూ హతురాలి చెల్లెలు నిర్మల పోలీసులకు ఫిర్యాదు చేసిందని ఎస్పీ తెలిపారు.
వరలక్ష్మి గురువారం రాత్రి 8.30 గంటలకు తనతో ఫోన్లో మాట్లాడిందని ఆమె సోదరి తెలిపింది. భూమికి సంబంధించిన పనిపై వెళ్లాలని.. వారి వాహనంలోనే ఉన్నాను.. ఇంటికి వస్తున్నట్లు చెప్పిందని తెలిపింది. పోలీసులు ఘటనా స్థలిలో కొన్ని లేఖలు స్వాధీనం చేసుకున్నారు. కేసు మిస్టరీ ఛేదనలో ఇవి కీలకం కానున్నాయి.
మరోవైపు వరలక్ష్మి హత్యకు సంబంధించి ఆమె కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు టఫ్ అధ్యక్షురాలు విమలక్కపై పోలీసులు కేసు నమోదు చేశారు. వరలక్ష్మి హత్యకు జనార్దన్ రెడ్డి, విజయలక్ష్మి, వైసీపీ నేత ప్రభు, విమలక్క కారణమం టూ మృతురాలి కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చే శారు.
దీనిపై శుక్రవారం సాయంత్రం పోలీసులు కేసు నమోదు చేశారు. విమలక్కను ఏ-4గా నమోదు చేసినట్లు తెలిపారు. మృతురాలు చివరిసారిగా కుటుంబ సభ్యులతో తాను విమలక్క దగ్గర ఉన్నానని చెప్పడంతో ఆమెపై అనుమానంతో ఫిర్యాదు చేశారు.