అన్న మాటిచ్చాడు- ఆయన్నే అడగండి- పొంగులేటి చేరికపై వైఎస్ షర్మిల క్లారిటీ
వైఎస్ షర్మిల సారథ్యంలోని వైఎస్ఆర్టీపీలో చేరబోతోన్నారంటూ ప్రచారం ఊపందుకుంటోన్న వేళ.. మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస రెడ్డి ఇవ్వాళ తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో ప్రత్యక్షం అయ్యారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తో భేటీ అయ్యారు.
అమరావతి: ఖమ్మం జిల్లాకు చెందిన సీనియర్ నాయకుడు, లోక్ సభ మాజీ సభ్యుడు పొంగులేటి శ్రీనివాస రెడ్డి కొంతకాలంగా రోజూ వార్తల్లో నిలుస్తోన్నారు. అధికార భారత్ రాష్ట్ర సమితికి ఆయన దూరం అయ్యారు. రాజీనామా చేయడానికి సన్నద్ధమౌతోన్నారు. త్వరలోనే ఆయన బీఆర్ఎస్ కు రాజీనామా చేస్తారనే ప్రచారం జరుగుతోంది. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తొలుత భారతీయ జనతా పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నప్పటికీ- అది సాధ్యపడలేదు.

వైటీపీలో చేరిక లాంఛనమే..
వైఎస్ షర్మిల సారథ్యంలోని వైఎస్ఆర్ తెలంగాణ పార్టీలో చేరుతారనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఇప్పటికే అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేసుకున్నారని చెబుతున్నారు. ఇదివరకే ఆయన వైఎస్ షర్మిలతో మంతనాలు సాగించారు. పార్టీలో చేరితే భారీ ఆఫర్ ఇస్తామనే హామీ సైతం షర్మిల ఇచ్చారు. వైఎస్ఆర్టీపీలో పొంగులేటీ శ్రీనివాస్ రెడ్డి చేరిక లాంఛనప్రాయమే కానుంది.

వైఎస్ కుటుంబంతో అనుబంధం..
వైఎస్ కుటుంబంతో పొంగులేటికి అత్యంత సన్నిహత సంబంధాలు ఉన్నాయి. 2014 రాష్ట్ర విభజన అనంతరం జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఖమ్మం లోక్ సభకు పోటీ చేశారు పొంగులేటి. అప్పటి తెలంగాణ రాష్ట్ర సమితి ప్రభంజనాన్ని, ముఖ్యమంత్రి కేసీఆర్ ఛరిష్మాను సైతం తట్టుకుని ఘన విజయాన్ని సాధించారు. తన లోక్ సభ పరిధిలో రెండు అసెంబ్లీ స్థానాల్లో వైఎస్ఆర్సీపీ అభ్యర్థులను కూడా గెలిపించుకోగలిగారు.

జగన్ తో భేటీ..
పొంగులేటి శ్రీనివాస రెడ్డి ఇటీవలే తాడేపల్లిలోని ఏపీ ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయంలో ప్రత్యక్షం అయ్యారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డితో సమావేశం అయ్యారు. వైఎస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ ప్రజా వ్యవహారాల సలహదారు సజ్జల రామకృష్ణారెడ్డి కూడా ఈ భేటీలో పాల్గొన్నట్లు తెలుస్తోంది. వైఎస్ కుటుంబం, వైఎస్ జగన్ తో ఉన్న వ్యక్తిగత అనుబంధంతోనే ఆయనను కలిశారని చెబుతున్నారు.

మాటిచ్చాడు..
తాజాగా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి.. వైఎస్ఆర్టీపీలో చేరికపై వైఎస్ షర్మిల క్లారిటీ ఇచ్చారు. తమ పార్టీలో చేరుతానని పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మాటిచ్చాడని అన్నారు. ఆయన ఎప్పుడు చేరుతారనేది తనకు తెలియదని పేర్కొన్నారు. ఆ విషయం ఆయననే అడగాలని వ్యాఖ్యానించారు. అసెంబ్లీ ఎన్నికల వేడి రాజుకుంటోన్న ప్రస్తుత పరిస్థితుల్లో మార్చి రెండో వారంలో పొంగులేటి చేరిక ఉండొచ్చనే అభిప్రాయాలు వ్యక్తమౌతోన్నాయి. అసెంబ్లీ ఎన్నికలకు తాము సన్నద్ధమౌతున్నామని, చేరికలకు ప్రాధాన్యత ఇస్తామని షర్మిల తెలిపారు.












Click it and Unblock the Notifications