వైఎస్ షర్మిలపై పోటీకి అభ్యర్ధి ఫిక్స్ - సీఎం కేసీఆర్ వ్యూహాత్మక ఎత్తుగడ..!!
YS Shramila Contest: ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో వైఎస్ షర్మిల సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్ గా మారారు. తెలంగాణలో ఇప్పటి వరకు చెప్పుకోదగిన స్థాయిలో పట్టు సాధించలేకపోయిన షర్మిల ఇప్పుడు రూటు మార్చారు. నేరుగా ముఖ్యమంత్రి కేసీఆర్ ను లక్ష్యంగా చేసుకున్నారు. బీజేపీ మద్దతు షర్మిలకు ఉందంటూ టీఆర్ఎస్ కౌంటర్ ఎటాక్ చేస్తోంది. షర్మిల తాను వెనకడుగు వేసే ప్రసక్తే లేదని తేల్చి చెబుతున్నారు. వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే నియోజకవర్గాన్ని ఇప్పటికే షర్మిల ప్రకటించారు. షర్మిల అసెంబ్లీలో ఎలా అడుగు పెడతారో చూస్తామని టీఆర్ఎస్ నేతలు అంటున్నారు. ఇందుకోసం వ్యూహాత్మకంగా షర్మిల పైన అభ్యర్ధి ఎవరనేది దాదాపు తేల్చేసారు. ఇప్పుడు ఇది తెలంగాణ రాజకీయాల్లో మరింత ఆసక్తి కరంగా మారుతోంది.
పాలేరు నుంచి అసెంబ్లీ బరిలో షర్మిల
వైఎస్ షర్మిల తొలి సారి ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయనున్నారు. తెలంగాణలో వైఎస్సార్టీపీ అధినేత్రిగా ఇప్పటికే తన పోటీకి సంబంధించి ప్రకటన చేసారు. ఖమ్మం జిల్లా పాలేరు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేయనున్నట్లు వెల్లడించారు. ఇప్పటికే పాలేరులో స్థానికంగా ఒక టీం షర్మిలకు మద్దతుగా పని చేస్తోంది. ఖమ్మం జిల్లాలో పాదయాత్ర సమయంలో షర్మిల ఈ నిర్ణయం తీసుకున్నారు. ఢిల్లీ కేంద్రంగా పని చేసే ఒక సర్వే సంస్థ సూచన మేరకు ఈ నియోజకవర్గం ఎంపిక చేసుకున్నారు. అదే సమయంలో పాలేరులో సామాజిక సమీకరణాలు...గతంలో గెలిచిన వారి నేపథ్యం పరిశీలించిన తరువాత తొలి సారి అసెంబ్లీకి పోటీ చేస్తున్న తనకు పాలేరు కలిసి వస్తుందని షర్మిల భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. షర్మిల పాలేరు నుంచి మాత్రమే పోటీ చేస్తారా..లేక, మరో నియోజకవర్గం కూడా ఎంపిక చేసుకుంటారా అనేది ఎన్నికల సమయం లోనే స్పష్టత రానుంది.
షర్మిలకు పోటీగా అభ్యర్ధి రెడీ..
షర్మిల పాలేరు నుంచి పోటీ చేస్తానని ప్రకటించటంతో..టీఆర్ఎస్ వ్యూహాత్మకంగా అక్కడ అభ్యర్ధిని ఖరారు చేయాలని డిసైడ్ అయింది. పాలేరులో నాలుగు మండలాలు ఉన్నాయి. 2014 ఎన్నికల్లో టీఆర్ఎస్ హవాలోనూ కాంగ్రెస్ మాజీ మంత్రి రాంరెడ్డి వెంకటరెడ్డి గెలుపొందారు. 2016లో ఆయన అనారోగ్యంతో మరణించారు. ఆ సమయంలో జరిగిన ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ నుంచి పోటీ చేసిన మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు భారీ మెజార్టీతో విజయం సాధించారు. 2018 ఎన్నికల్లో తిరిగి కాంగ్రెస్ అభ్యర్ధి కందాల ఉపేందర్ రెడ్డి టీఆర్ఎస్ అభ్యర్ధి తుమ్మల పైన విజయం సాధించారు. అయితే, వచ్చే ఎన్నికల్లో తుమ్మలకు అకవాశం దక్కుతుందా అనేది కొంత కాలంగా ఆయన రాజకీయ అడుగులతో సందేహం మొదలైంది. ఈ సారి తెలంగాణలో అటు బీజేపీ ఇటు కాంగ్రెస్ తో ప్రధాన పోటీగా భావిస్తున్న టీఆర్ఎస్ కమ్యూనిస్టు పార్టీల తో పొత్తు కుదుర్చుకుంది. అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఈ పొత్తు కొనసాగుతోంది. అందులో భాగంగా పాలేరు సీటును సీపీఎంకు కేటాయించే విధంగా ఆలోచన చేస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఇందు కోసం పాలేరు కు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం పేరు పార్టీలో ప్రచారంలో ఉంది.
టీఆర్ఎస్ + వామపక్షాలు కలిస్తే గెలుపు ఖాయమంటూ
పాలేరు నియోజకవర్గంలో వామపక్షాలకు స్థిరమైన ఓట్ బ్యాంక్ ఉంది. ఖమ్మం ఎంపీగా పని చేసిన తమ్మినేని పాలేరు నియెజకవర్గంలో 2009 లో పోటీ చేసిన సమయంలో 58,889 ఓట్లు వచ్చాయి. అదే విధంగా 2014,2016 ఎన్నికల్లో ఇదే స్థాయిలో ఓట్లు పోలయ్యాయి. పాలేరు లో 2016 లో తుమ్మల టీఆర్ఎస్ నుంచి పోటీ చేయగా.. ఆయనకు 94 వేలకు పైగా ఓట్లు దక్కాయి. 2018 ఎన్నికల్లో 81,738 ఓట్లు వచ్చినా.. కాంగ్రెస్ అభ్యర్ధి చేతిలో 7,669 ఓట్ల తేడాతో ఓడిపోయారు. దీంతో, అక్కడ కాంగ్రెస్ - ఒక సామాజిక వర్గం ప్రాబల్యం ఎక్కువగా ఉన్నా.. టీఆర్ఎస్ - సీపీఎం కలిస్తే విజయం ఖాయమని నిర్దారణకు వచ్చారు. దీంతో, టీఆర్ఎస్ నుంచి పరిస్థితులు అనుకూలిస్తే తుమ్మల నాగేశ్వర రావు.. లేదా మిత్రపక్షానికి కేటాయిస్తే సీపీఎం నుంచి తమ్మినేని వీరభద్రం పాలేరు నుంచి షర్మిల పైన పోటీ చేయటం ఖాయంగా కనిపిస్తోంది. అయితే, షర్మిలకు తెలంగాణలో ఏ మేర ఓటింగ్ ఉందనేది క్లారిటీ లేదు. దీంతో, ఇప్పుడు ఈ నియోజకవర్గంలో ఎన్నిక తెలంగాణలోని ఆసక్తి కర నియోజకవర్గాల్లో ఒకటిగా మారబోతోంది.