రాజధాని తరలింపుపై సంచలన సంకేతం?: అమరావతి శ్రీవారి ఆలయ నిర్మాణానికి రూ.100 కోట్ల బడ్జెట్ కట్?
Recommended Video
తిరుపతి: రాజధాని అమరావతిని వేరే ప్రాంతానికి తరలిస్తారనే వార్తలు కొద్దిరోజులుగా రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైన వేళ.. దీనికి అనుకూలంగా రాష్ట్ర ప్రభుత్వం మరో సంకేతం ఇచ్చినట్టే కనిపిస్తోంది. రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాంతం పరిధిలో చేపట్టిన భవనాలు, ఇతర కట్టడాల నిర్మాణాన్ని ఇప్పటికే నిలిపివేసిన సర్కార్.. తాజాగా మరో సంచలన నిర్ణయాన్ని తీసుకుంది. రాజధాని పరిధిలోని తుళ్లూరు మండలం వెంకటాయపాలెం సమీపంలో నిర్మాణంలో ఉన్న తిరుమల శ్రీవారి ఆలయానికి బడ్జెట్ మొత్తాన్ని కుదించాలని యోచిస్తున్నట్లు సమాచారం. దీనిపై తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి సమావేశంలో కీలక నిర్ణయం తీసుకోవచ్చని తెలుస్తోంది. దీనికి సంబంధించిన అజెండాను టీటీడీ అధికారులు రూపొందిస్తున్నట్లు చెబుతున్నారు. రాజధాని అమరావతిని తరలింపు ప్రక్రియలో భాగంగానే వెంకటాయపాలెంలో శ్రీవారి నమూనా ఆలయ నిర్మాణానికి అవసరమైన నిధులను కుదించారనే వార్తలు గుప్పుమంటున్నాయి.

రూ.126 కోట్లతో నమూనా ఆలయం
తిరుమలలో వెలసిన శ్రీనివాసుడి నమూనా ఆలయాన్ని రాజధాని అమరావతి ప్రాంతంలో నిర్మించడానికి ఇదివరకు తెలుగుదేశం ప్రభుత్వం చర్యలు తీసుకున్న విషయం తెలిసిందే. దీనికోసం తుళ్లూరు మండలంలోని వెంకటాయపాలెం వద్ద 25 ఎకరాల స్థలాన్ని అప్పటి ప్రభుత్వం కేటాయించింది. ఈ ఆలయ నిర్మాణానికి తిరుమల తిరుపతి దేవస్థానం 126 కోట్ల రూపాయల బడ్జెట్ ను కేటాయించింది. ఈ మొత్తాన్ని మంజూరు చేస్తూ తెలుగుదేశం పార్టీ నాయకుడు పుట్టా సుధాకర్ యాదవ్ ఛైర్మన్ గా కొనసాగిన గత పాలక మండలి తీర్మానాన్ని సైతం ఆమోదించింది. ఆలయ నిర్మాణానికి ఈ ఏడాది జనవరి 31వ తేదీన అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శంకుస్థాపన చేశారు. ప్రస్తుతం ఆలయ నిర్మాణ పనులు చురుగ్గా సాగుతున్నాయి. ఇప్పటిదాకా సుమారు ఏడెనిమిది కోట్ల రూపాయల మేర విలువ చేసే పనులు పూర్తయినట్లు చెబుతున్నారు.

నిర్మాణ వ్యయం కోతకు కారణం.. రాజధాని తరలింపేనా?
తాజాగా రాజధాని అమరావతిని వేరే ప్రాంతానికి తరలించే దిశగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సారథ్యంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అడుగులు వేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. కృష్ణానదికి సంభవించిన వరదల వల్ల అమరావతి పరిధిలోని పలు గ్రామాలు, తీర ప్రాంతాలు నీట మునిగాయి. భవిష్యత్తులోనూ కృష్ణానదికి వరదలు సంభవించడమంటూ జరిగితే.. రాజధాని అమరావతి నీట మునుగుతుందనే అభిప్రాయాలు రావడంతో.. ప్రభుత్వం తరలించే దిశగా చర్యలు చేపట్టే అవకాశాలు ఉన్నట్లు మంత్రులు సైతం వ్యాఖ్యానించారు. ఈ అనుమానాలకు బలం కలిగించేలా.. శ్రీవారి ఆలయ నిర్మాణానికి అయ్యే బడ్జెట్ లో టీటీడీ పాలక మండలి భారీగా కోత పెట్టింది. రాజధానే లేనప్పుడు.. ఇక తిరుమలేశుడి ఆలయాన్ని అంత పెద్ద ఎత్తున నిర్మించాల్సిన అవసరం లేదని టీటీడీ భావిస్తున్నట్లు చెబుతున్నారు. రాజధానిని తరలించాల్సిన పరిస్థితే ఏర్పడితే.. అక్కడ ఏడుకొండలవాడి నమూనా ఆలయాన్ని కొత్తగా నిర్మించవచ్చనే అభిప్రాయం వ్యక్తమౌతోంది.

బడ్జెట్ లో భారీ కోత..
రాజధాని ప్రాంతంలోని వెంకటాయ పాలెం వద్ద టీటీడీ నిర్మించి తలపెట్టిన తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి వారి నమూనా ఆలయ నిర్మాణానికి కేటాయించిన 126 కోట్ల రూపాయల బడ్జెట్ లో వంద కోట్ల రూపాయల మేర కోత పెట్టే అవకాశాలు ఉన్నట్లు కనిపిస్తోంది. నమూనా ఆలయ నిర్మాణ వ్యయాన్ని కేవలం 30 కోట్ల రూపాయలకే పరిమితం చేయొచ్చని చెబుతున్నారు. వెంకటాయపాలెం వద్ద కేటాయించిన 25 ఎకరాల్లో శ్రీవారి ప్రధాన ఆలయం ఆనంద నిలయంతో పాటు పద్మావతి అమ్మవారి ఆలయం, ఉపాలయాలు, ఉత్సవ మండపాలు, రథ మండపాలు, పుష్కరిణి, దర్శనానికి వచ్చే శ్రీవారి భక్తులకు వసతి సదుపాయాలు, అన్నదాన సత్రాలు నిర్మించాలని అప్పట్లో టీటీడీ ప్రణాళికలు సిద్ధం చేసింది. తాజాగా తీసుకున్న నిర్ణయం ప్రకారం.. శ్రీవారి ఆలయాన్ని ఆనంద నిలయం నిర్మాణం వరకే పరిమితం చేయవచ్చు. మిగిలిన కట్టడాలను నిలిపివేసేలా సంచలన నిర్ణయాన్ని టీటీడీ తీసుకోవచ్చని తెలుస్తోంది. టీటీడీ కొత్త పాలక మండలిని ఏర్పాటు చేసిన తరువాత.. ఏర్పాటయ్యే తొలి సమావేశంలోనే దీనికి సంబంధించిన ప్రతిపాదనలపై ఆమోదం లభించవచ్చని సమాచారం.












Click it and Unblock the Notifications