తిరుమలలో పోటెత్తిన భక్తులు - ఈవో ధర్మారెడ్డి కీలక ప్రకటన..!!
తిరుమలలో భక్తుల రద్దీ భారీగా పెరిగింది. మూడు రోజుల వరుసల సెలవులతో భక్తులు పోటెత్తారు. శ్రీవారి దర్శనానికి దాదాపు 30 గంటల సమయం పడుతోంది. సాయంత్రం లోగా రద్దీ తగ్గకపోతే, రేపు ఉదయం వరకు క్యూ లైన్లలో ప్రవేశం రద్దు చేసే ఆలోచన చేస్తున్నారు. రద్దీకి అనుగుణంగా తీసుకోవాల్సిన చర్యల పైన ఎప్పటికప్పుడు ఈవో ధర్మారెడ్డి అధికారులకు సూచనలు చేస్తున్నారు. భక్తులకు తాగు నీరు, అన్న ప్రసాదాలు అందిస్తున్నారు. సర్వదర్శనానికి టోకెన్లు లేకుండా వచ్చిన భక్తులతో వైకుంఠం క్యా కాంప్లెక్స్ -2లోని కంపార్టుమెంట్లు, నారాయణగిరి షెడ్లు నిండిపోయాయి.
గోగర్భం జలాశయం వరకు క్యూలైన్ చేరింది. శ్రీవారి దర్శనానికి 30 కంపార్టుమెంటుల్లో భక్తులు వేచి ఉన్నారు. ఇదే సమయంలో టీటీడీ ఈవో ధర్మారెడ్డి కీలక ప్రకటన చేసారు. సుదర్శనం సత్రాల స్థానంలో నూతన అతిధిగృహలను నిర్మిస్తామని ధర్మారెడ్డి వెల్లడించారు. మార్చి మాసంలో 20లక్షల 57వేల మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారని తెలిపారు. ఈ సారి మార్చి నెలలో హుండీ ఆదాయం రికార్డ్ స్థాయికి చేరింది. హుండీ ద్వారా రూ.120.29 కోట్ల ఆదాయం లభించిందని ధర్మారెడ్డి వెల్లడించారు. కోటి 2లక్షల లడ్డులను భక్తులకి విక్రయించామని తెలిపారు. 38 లక్షల 17వేల మంది భక్తులకి అన్నప్రసాద వితరణ చేశామన్నారు. శుక్రవారం శ్రీవారి ఆలయంలో సమయా భావం కారణంగా నిజపాద దర్శనాన్ని పున్నరుద్దరించలేమని టీటీడీ ఈవో ధర్మారెడ్డి వెల్లడించారు.

అరవింద్ నేత్రాలయంలో ఐ బ్యాంకు పెట్టేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. అన్నదానంలో నాణ్యతని పెంచేందుకు ఇక పై టెండర్ల ద్వారా కాకుండా మిల్లర్ల ద్వారా బియ్యాని సేకరిస్తామన్నారు. తిరుమల శ్రీవారి ఆలయంలో గురువారం రాత్రి 7 గంటలకు గరుడ వాహన సేవ ప్రారంభమైంది. సర్వాలంకార భూషితుడైన శ్రీమలయప్ప స్వామివారు గరుడునిపై ఆలయ మాడ వీధుల్లో విహరించి భక్తులను కటాక్షించారు. తిరుమలలోని శేషాచల అడవుల్లో ప్రముఖ తీర్థంగా భాసిల్లుతున్న తుంబురు తీర్థముక్కోటిలో 36,200 మందికి పైగా భక్తులు పాల్గొన్నారు. తుంబురు తీర్థానికి వెళ్ళే భక్తుల సౌకర్యార్థం టీటీడీ పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేసింది. టిటిడి భద్రతా విభాగం, పోలీసులు, అటవీశాఖ సిబ్బంది కలసి పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టారు.












Click it and Unblock the Notifications