తిరుమలలో పవన్ కల్యాణ్: శ్రీవారి దర్శనం: కాస్సేపట్లో ప్రెస్మీట్: తిరుపతి బరిపై ఉత్కంఠత
తిరుపతి: జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్.. శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ ఉదయం వీఐపీ బ్రేక్ దర్శన్ సందర్భంగా ఆయన వేంకటేశ్వర స్వామివారిని దర్శించారు. శ్రీవారి సేవలో పాల్గొన్నారు. పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్, మరి కొందరు నేతలతో కలిసి ఆయన ఈ తెల్లవారు జామున తిరుమలకు చేరుకున్నారు. పద్మావతి అతిథిగృహంలో బస చేశారు. శ్రీవారిని దర్శించుకున్న అనంతరం మళ్లీ తిరుపతికి బయలుదేరి వెళ్లారు.

తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు ఆయనకు సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు. స్వామివారి దర్శనం అనంతరం ఆయన తీర్థ, ప్రసాదాలను అందజేశారు. ఆశీర్వచనాలను పలికారు. పద్మావతి అతిథిగృహానికి చేరుకున్న ఆయన తిరుపతికి బయలుదేరి వెళ్లారు. తిరుపతి లోక్సభ ఉప ఎన్నికలో జనసేన తరఫున అభ్యర్థిని నిలబెట్టాలనే డిమాండ్ విస్తృతంగా వినిపిస్తోన్న వేళ.. విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఇంకాస్సేపట్లో విలేకరులతో మాట్లాడబోతోన్నారు.

ఆయన నుంచి ఎలాంటి ప్రకటన వెలువడుతుందనే ఉత్కంఠత ప్రస్తుతం అందరిలోనూ నెలకొంది. మిత్రపక్షం భారతీయ జనతా పార్టీని కాదని.. తిరుపతి ఉప ఎన్నిక బరిలో తామే పోటీ చేయాలనే డిమాండ్ రాజకీయ వ్యవహారాల కమిటీలో బలంగా వినిపించిన విషయం తెలిసిందే. ఈ ఉప ఎన్నికలో ఎవరిని పోటీలో దింపాలనే విషయంపై తాము బీజేపీ అగ్ర నాయకులతో సంప్రదింపులు జరుపుతున్నామని, వారం రోజుల్లో ఈ ప్రక్రియ పూర్తవుతుందని ఇదివరకే పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు.












Click it and Unblock the Notifications