కేటీఆర్ పట్టాభిషేకంపై మరో లీక్: టైమ్ కోసం వెయిటింగ్: తిరుమలలో హైదరాబాద్ మేయర్
తిరుపతి: తెలంగాణ రాష్ట్ర సమితి సీనియర్ నేత, హైదరాబాద్ మేయర్ బొంతు రామ్మోహన్.. మంగళవారం తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ ఉదయం ఆయన వీఐపీ బ్రేక్ దర్శన్లో సందర్భంగా శ్రీవేంకటేశ్వర స్వామివారి సేవలో పాల్గొన్నారు. అంతకుముందు రోజు రాత్రే తిరుమలకు చేరుకున్న ఆయన పద్మావతి అతిథిగృహంలో బస చేశారు. ఉదయం స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు, అర్చకులు ఆయనకు శ్రీవారి తీర్థ, ప్రసాదాలను అందజేశారు. ఆశీర్వచనాలు పలికారు.
దర్శనం అనంతరం ఆలయం వెలుపల ఆయన కొద్దిసేపు విలేకరులతో మాట్లాడారు. తెలంగాణ ముఖ్యమంత్రిగా కేసీఆర్ వైదొలగుతారని, ఆయన స్థానంలో టీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ బాధ్యతలను స్వీకరిస్తారంటూ కొంతకాలంగా వస్తోన్న వార్తలపై స్పందించారు. తొలుత- దేనికైనా టైమ్ రావాలంటూ వ్యాఖ్యానించిన బొంతు రామ్మోహన్.. ఆ సమయం రావడానికి ఎంతో కాలం పట్టకపోవచ్చని చెప్పారు. వేంకటేశ్వర స్వామి కృపా కటాక్షలు, ఆశీస్సులతో కేటీఆర్ ముఖ్యమంత్రి అవుతారని అన్నారు.

Recommended Video
అన్నింటికి సమయం, సందర్భం రావాలని చెప్పారు. సరైన సమయంలోనే కేటీఆర్ ముఖ్యమంత్రిగా బాధ్యతలను స్వీకరిస్తారని వ్యాఖ్యానించారు. ఎప్పుడు? ఎలాంటి నిర్ణయాలను తీసుకోవాలనేది ముఖ్యమంత్రి కేసీఆర్కు తెలుసునని అన్నారు. సరైన సమయంలో ఆయన కీలక నిర్ణయాన్ని తీసుకుంటారని, అది ప్రజామోదంగా ఉంటుందని చెప్పారు. పార్టీ నేతలను సంప్రదించకుండా, ఏకపక్షంగా కేసీఆర్ పదవి నుంచి తప్పుకోరనే తాను భావిస్తున్నానని అన్నారు. పార్టీ నాయకులు, క్యాడర్ అంగీకరం, ఆమోదం ఉంటుందని బొంతు రామ్మోహన్ చెప్పారు.












Click it and Unblock the Notifications