చాగంటి కోటేశ్వరరావుకు టీటీడీలో కీలక పదవి- ఆయనకు మించిన వారెవరు?
తిరుపతి: తిరుమల తిరుపతి దేవస్థానం కీలక నిర్ణయాన్ని తీసుకుంది. ధార్మిక వ్యవహారాలను పర్యవేక్షించడానికి ప్రత్యేకంగా సలహాదారుని నియమించింది. హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఈ మేరకు ఈ నిర్ణయాన్ని తీసుకుంది. టీటీడీకి సంబంధించినంత వరకు ఇది అత్యుత్తమ పదవి. ధార్మిక కార్యక్రమాల సలహదారుగా ప్రఖ్యాత ప్రవచనకర్త బ్రహ్మశ్రీ డాక్టర్ చాగంటి కోటేశ్వరరావును నియమించింది. టీటీడీ ధార్మిక కార్యక్రమాల సలహాదారుగా నియమించడం ఇదే తొలిసారి.
ప్రవచనకర్తగా..
బ్రహ్మశ్రీ డాక్టర్ చాగంటి కోటేశ్వరరావు తెలియని వారుండరు. ఆయన పేరు వినని వారుండరు. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ప్రవచనకర్తగా సుపరిచితులు ఆయన. ప్రవచనకర్తగా హిందూ ధర్మ పరిరక్షణ కోసం చాలాకాలంగా కృషి చేస్తున్నారు. నిజానికి- ఆయన కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి. ఫుడ్ కార్పొరేషన్ లో పని చేస్తోన్నారు. కాకినాడ.. ఆయన స్వస్థలం.
అష్ఠాదశ పురాణాలు..
అష్ఠాదశ పురాణాలను అధ్యయనం చేశారు. తనదైన శైలిలో సామాన్యులకు సైతం అర్ధమయ్యే రీతిలో ప్రవచనాలు చెబుతుంటారు. ఆదిశంకరాచార్య వైభవం, శ్రీకాళహస్తీశ్వర వైభవం, శ్రీకాళహస్తీశ్వర శతకం, శ్రీవేంకటాచల వైభవం, సుందరకాండ..వంటి 163 అంశాల మీద ప్రవచనాలను అలవోకగా వివరించగల శక్తి సామర్థ్యాలు చాగంటి కోటేశ్వరరావు సొంతం. తన పరిధి మేరకు ఆయన హైందవ ధర్మాన్ని వ్యాప్తి చేస్తోన్నారు.
ధార్మిక కార్యకలాపాల విస్తృతం..
దీన్ని దృష్టిలో ఉంచుకుని తిరుమల తిరుపతి దేవస్థానం హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఈ నిర్ణయం తీసుకుంది. తిరుమల ధార్మిక కార్యక్రమాల సలహాదారుగా నియమించింది. ఈ మేరకు ధర్మ ప్రచార పరిషత్ ఈ నిర్ణయాన్ని తీసుకుంది. త్వరలోనే ఆయన బాధ్యతలను స్వీకరిస్తారని టీటీడీ అధికారులు చెబుతున్నారు.
ఎస్వీబీసీ మరింత..
ఈ సమావేశంలో ధార్మిక పరిషత్ పలు కీలక నిర్ణయాలను తీసుకుంది. శ్రీవారిని దర్శించడానికి తిరుమలకు వచ్చే భక్తుల యాత్రానుభవాలను శ్రీవేంకటేశ్వర భక్తిఛానల్ లో ప్రసారం చేయాలని నిర్ణయించింది. అన్ని దేశాల్లోనూ ఎస్వీబీసీ ప్రసారాలు అందుబాటులో ఉండేలా చూడటం, అందులో ప్రసారమౌతోన్న అదివో అల్లదివో వంటి కార్యక్రమాలను మరిన్ని రూపొందించాలని ధార్మిక పరిషత్ నిర్ణయం తీసుకుంది. తెలుగు, కన్నడం, హిందీ ఛానళ్లలో కూడా వాటిని టెలికాస్ట్ చేయాలని తీర్మానించింది.
గ్రామీణస్థాయిలో
హైందవ ధర్మాన్ని ప్రచారం చేయడంలో భాగంగా గ్రామీణ స్థాయిలో యువతను భాగస్వామ్యం చేయాలని, ఇందులో భాగంగా- పండగల సమయంలో భజన, కోలాటాలను నిర్వహించడం- వాటికి అవసరమైన సామాగ్రిని ఉచితంగా అందించాలని నిర్ణయించింది. టీటీడీ ఆధ్వర్యలో నడుస్తోన్న శ్రీవేంకటేశ్వర ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్, బర్డ్, శ్రీ పద్మావతి చిన్నపిల్లల ఆసుపత్రి కార్యకలాపాలను ఎస్వీబీసీలో ప్రసారం చేయాలని తీర్మానించింది.