తిరుమల గిరుల్లో చర్చి నిర్మాణం పేరుతో ప్రచారం చేసిన యువకుల అరెస్ట్
తిరుపతి: పరమ పవిత్రమైన తిరుమల గిరుల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చర్చిల నిర్మాణానికి అనుమతి ఇచ్చిందంటూ సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేసిన ముగ్గురు యువకులను తిరుపతి పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసులో అణువణువునా హిందుత్వం.. అనే వాట్సప్ గ్రూప్ సభ్యుడిగా ఉన్న అరుణ్ కాటేపల్లితో పాటు కార్తిక్ గరికపాటి, మిక్కిలినేని సాయి అజిత్ చక్రవర్తి అరెస్టు చేసినట్లు తిరుపతి అర్బన్ పోలీస్ సూపరింటెండెంట్ అన్బురాజన్ తెలిపారు. శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఈ ముగ్గురినీ మీడియా ముందు ప్రవేశపెట్టారు. తిరుమల తిరుపతి దేవస్థానం విజిలెన్స్ విభాగం అధికారులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు వారిని కేసు నమోదు చేసినట్లు చెప్పారు.
దమ్ముంటే నిరూపించగలరా? చంద్రబాబు వైసీపీ ఎమ్మెల్యే శ్రీదేవి సవాల్
తిరుమల పుణ్యక్షేత్రంపై తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేసిన వారిపై క్రిమినల్ చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. అరుణ్ కాటేపల్లి హైదరాబాద్ లోని కూకట్ పల్లిలో నివాసం ఉంటున్నాడని అన్బురాజన్ తెలిపారు. ఈ ముగ్గురినీ తిరుపతి శ్రీ వేంకటేశ్వర హైస్కూల్ గ్రౌండ్ లో అరెస్ట్ చేశామని అన్నారు. వారిపై 218/2019/యూ/ఎస్ 500, 505 (2) సెక్షన్ల కింద కేసు నమోదు చేశామని తెలిపారు. ఏడుకొండలపై ఏసు మందిరాలు అనే పేరుతో కొద్దిరోజుల కిందట వాట్సాప్ గ్రూపుల ద్వారా కొన్ని ఫొటోలు విస్తృతంగా ప్రచారంలోకి వచ్చాయి. సోషల్ మీడియాలో అవి వైరల్ గా మారాయి. నిజానికి అది చర్చి నిర్మాణం కాదు. అటవీ విభానికి సంబంధించిన చెక్ పోస్ట్, వాచ్ టవర్.
తిరుపతి శివార్లలోని కరకంబాడి సమీపంలో శేషాచలం అడవుల్లో అటవీ శాఖకు చెందిన వాచ్ టవర్, దాని మీద ఉన్న సోలార్, సీసీటీవీ పైపులను శిలువ ఆకారంలో వచ్చేలా ఫోటో తీసి, దానిపై దుష్ప్రచారం చేసినట్లు టీటీడీ విజిలెన్స్ అధికారులు గుర్తించారు. దీనిపై టీటీడీ విజిలెన్స్ అధికారులు తిరుమల టూటౌన్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.
కోట్లాది మంది హిందువుల మనోభావాలు దెబ్బ తినేలా సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాన్ని చేపట్టిన అరుణ్ కాటేపల్లిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. కేసును నమోదు చేసుకున్న పోలీసులు.. ఈ కేసులో అరుణ్ కాటేవల్లితో పాటు కార్తిక్, అజిత్ సాయి ప్రమేయం కూడా ఉన్నట్లు గుర్తించారు. ముగ్గుర్నీ అరెస్టు చేశారు. వారిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.