తిరుపతి: ‘మహిళను బెల్టుతో కొట్టిన ఎస్సై’ ఘటనపై ఎస్పీ సీరియస్ -రంగంలోకి ఏఎస్పీ సుప్రజ -సస్పెండ్ డిమాండ్
టెంపుల్ సిటీ తిరుపతిలో ఓ మహిళపై పోలీస్ స్టేషన్ లోనే ఎస్సై బెల్టుతో దాడిచేసిన ఘటనను ఉన్నతాధికారులు సీరియస్ గా తీసుకున్నారు. తిరుపతి అర్బన్ ఎస్పీ రమేశ్ రెడ్డి ఆదేశాల మేరకు ఎంఆర్ పల్లి స్టేషన్ ఎస్సై ప్రకాశ్ కుమార్ పై దర్యాప్తు ప్రారంభమైంది. ఈ ఘటనపై దర్యాప్తు బాధ్యతను ఏఎస్పీ సుప్రజకు అప్పిగించారు. కేసుపై ఆమె మీడియాతో మాట్లాడారు..

అసలేం జరిగిందంటే..
తిరుపతి రూరల్ మండలంలోని ఉప్పరపల్లికి చెందిన వనితా వాణి ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్నారు. శనివారం ఆమె ఇంటి ఆవరణలోకి కొన్ని గేదెలు దూసుకొచ్చి గార్డెన్ ను ధ్వంసం చేయగా, ఆమె గేటు మూసేశారు. కాసేపటికి గేదెల యజమానులు అక్కడికొచ్చి ఆమెతో గొడవకు దిగారు. ఈక్రమంలో ఆమె 100కు డయల్ చేయగా, పోలీసులు వచ్చేలోపే గేదెల యజమానులు పరారయ్యారు. అదే రోజు రాత్రి దీనిపై ఫిర్యాదు చేసేందుకుగానూ ఎంఆర్ పల్లి స్టేషన్ కు వెళ్లగా ఎస్సై ప్రకాశ్ కుమార్ అకారణంగా బెల్టుతో కొట్టారని వనితా రాణి ఆరోపించారు. స్టేషన్ ముందే ధర్నా చేపట్టగా ఉన్నతాధికారులు జోక్యం చేసుకున్నారు..

చెప్పులతో లోనికొచ్చిందని..
బాధితురాలి కథనం ప్రకారం.. శనివారం రాత్రి ఆమె ఎంఆర్ పల్లి స్టేషన్ కు వెళ్లే సమయానికి అక్కడ పూజల కోసం ఎస్సై ప్రకాశ్ రెడీ అవుతున్నారు. నీళ్లతో శుభ్రంగా కడిగిఉంచిన స్టేషన్ లోకి బాధితురాలు చెప్పులతో రావడాన్ని ఎస్సై సహించలేకపోయారు. ఎందుకొచ్చావంటూ బాధితురాని దుర్భాషలాడారు. ఇదేంటని ప్రశ్నించినందుకు బెట్లుతో ఆమెను కొట్టారు. స్టేషన్ ముందు ధర్నాకు దిగిన ఆమెతో సీఐ సురేంద్రనాథ్రెడ్డి మాట్లాడి, దర్యాప్తు జరిపిస్తామని సర్దిచెప్పారు. మహిళపై ఎస్సై దాడి చేసిన వార్త మీడియాలో ప్రముఖంగా రావడంతో ఎస్పీ రమేశ్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. దీనిపై..

ఏఎస్పీ సుప్రజ ఏమన్నారంటే..
ఎంఆర్ పల్లి స్టేషన్ లో ఎస్సై ప్రకాశ్ కుమార్ బెల్ట్తో తనపై దాడి చేశాడని ఓ మహిళ చేసిన ఫిర్యాదుపై తిరుపతి అర్బన్ ఏఎస్సీ సుప్రజ స్పందించారు. విచారణలో గనుక బెల్ట్తో కొట్టినట్లు తేలితే ఎస్సైపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని ఏఎస్పీ చెప్పారు. ఈ ఘటనపై బాధితురాలితోనూ మాట్లాడానని ఆమె తెలిపారు. 24 గంటల్లోనే ఈ వ్యవహారాన్ని తేల్చుతామన్నారు. మరోవైపు..
Recommended Video

ఎస్సైని సస్పెండ్ చేయాలి..
ఫిర్యాదు చేసేందుకు స్టేషన్ కు వచ్చిన మహిళపై ఎస్సై దాడికి పాల్పడటం దారుణమని, సదరు ఎస్సైని వెంటనే సస్పెండ్ చేయాలంటూ టీడీపీ నేతలు డిమాండ్ చేశారు. తెలుగు మహిళ అధ్యక్షురాలు వంగలపూడి అనిత, తిరుపతి పార్లమెంటరీ పార్టీ అధ్యక్షుడు నరసింహ యాదవ్, మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మలు ఎంఆర్ పల్లి స్టేషన్ కు వెళ్లి ఏఎస్పీ సుప్రజతో మాట్లాడారు. లోక్ సభ ఉప ఎన్నిక వేళ ఈ కేసు సున్నితంగా మారే అవకాశాలుండటంతో పోలీసులు జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు.












Click it and Unblock the Notifications