ఇక నారా లోకేష్ వంతు: ఈ సాయంత్రం తిరుపతిలో పాదయాత్ర: యూత్ టార్గెట్
తిరుపతి: పోలింగ్ గడువు సమీపిస్తోన్న కొద్దీ తిరుపతి లోక్సభ ఉప ఎన్నకి వేడి పతాక స్థాయికి చేరుకుంటోంది. అన్ని ప్రధాన పార్టీలు ఈ ఎన్నికను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న ప్రస్తుత పరిస్థితులలో ప్రచారం వాడివేడిగా సాగుతోంది. ఆయా పార్టీలకు చెందిన స్టార్ క్యాంపెయినర్లు ప్రచార బరిలో దిగబోతున్నారు. తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి నారా లోకేష్.. ఇంకొన్ని గంటల్లో తిరుపతి ఉప ఎన్నిక ప్రచార కార్యక్రమాల్లో పాల్గొనబోతున్నారు.
తెలుగు యువత చైతన్య యాత్ర పేరుతో దీన్ని నిర్వహించనున్నారు. ఈ సాయంత్రం 4 గంటలకు తిరుపతిలోని జ్యోతిరావు ఫులే విగ్రహం వద్ద ఈ యాత్ర ఆరంభమౌతుంది. అనంతరం బహిరంగ సభను ఉద్దేశించి నారా లోకేష్ ప్రసంగిస్తారు. ఈ పాదయాత్రను తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడు శ్రీరామ్ చినబాబు పర్యవేక్షిస్తున్నారు. దీనికి సంబంధించిన పోస్టర్ను ఆవిష్కరించారు. యువతను పార్టీ వైపు ఆకర్షితులను చేసేలా తొలివిడత ప్రచార కార్యక్రమాలను రూపొందించుకున్నారు.

అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనుసరిస్తోన్న విధానాలను మరింత లోతుగా జనంలోకి తీసుకెళ్లడానికి, పనబాక లక్ష్మీ విజయం సాధించడానికి యువత ఓట్లు కీలకంగా భావిస్తోంది టీడీపీ. తెలుగు యువత చైతన్య యాత్ర అనంతరం నారా లోకేష్.. అసెంబ్లీ నియోజకవర్గాలపై దృష్టి కేంద్రీకరిస్తారు. లోక్సభ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో పర్యటిస్తారు. శ్రీకాళహస్తి, సత్యవేడు, సూళ్లూరుపేట, వెంకటగిరి, సర్వేపల్లి, గూడూరుల్లో ఆయన విస్తృతంగా పర్యటిస్తారు.
ఇంటింటి ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటారు. రోడ్ షోలను నిర్వహిస్తారు. దీనికి సంబంధించిన షెడ్యూల్ను చిత్తూరు, నెల్లూరు జిల్లాల తెలుగుదేశం పార్టీ నాయకులు ఖరారు చేశారు. తిరుపతి ఉప ఎన్నికలో పోటీ చేస్తోన్న బీజేపీ అభ్యర్థిని, రిటైర్డ్ ఐఎఎస్ అధికారి రత్నప్రభకు మద్దతుగా ఆ పార్టీ మిత్రపక్షం జనసేన ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటోంది. ఇందులో భాగంగా ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ కూడా శనివారం బహిరంగ సభలో పాల్గొన్నారు.












Click it and Unblock the Notifications