కరోనా ఉధృతితో టీటీడీ నిర్ణయం, ప్రస్తుతం తిరుమల యాత్ర క్యాన్సిల్ చేసుకునే వారికి గుడ్ న్యూస్ !!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు తిరుమలకు వచ్చే భక్తులకు కీలక సూచనలు చేసింది. తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులు అనారోగ్య సమస్యలతో బాధపడుతుంటే ముఖ్యంగా దగ్గు, జలుబు, జ్వరం వంటి సమస్యలతో బాధపడుతుంటే తిరుమల యాత్రను వాయిదా వేసుకోవడం మంచిదని టీటీడీ సూచించింది . అలాంటి వారికి టీటీడీ గుడ్ న్యూస్ చెప్పింది.
కరోనా కేసుల పెరుగుదలతో టీటీడీ కీలక సూచనలు
చిత్తూరు జిల్లాలో విపరీతంగా కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో తిరుమలకు వచ్చే శ్రీవారి భక్తులు కరోనా నియమాలను పాటించాలని, మాస్కులు ధరించాలని, సామాజిక దూర నిబంధనలను పాటించాలని టిటిడి అధికారులు సూచిస్తున్నారు. అంతేకాదు ఇప్పటికే ఆన్ లైన్ ద్వారా స్వామి దర్శనానికి టికెట్లను బుక్ చేసుకున్న భక్తులు అనారోగ్యంతో బాధపడుతూ ఉంటే తిరుమల యాత్ర క్యాన్సిల్ చేసుకోవడం మంచిదని సూచిస్తున్నారు. అలా క్యాన్సిల్ చేసుకున్న వారికి రానున్న 90 రోజుల వరకు దర్శనానికి అనుమతిస్తామని టీటీడీ ఒక ప్రకటనలో వెల్లడించింది.
అనారోగ్యంతో తిరుమల యాత్ర వాయిదా వేసుకుంటే రానున్న 90 రోజుల వరకు దర్శనానికి అనుమతి
ఏప్రిల్ 21 నుండి 30వ తేదీ వరకు ఆన్లైన్లో 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు బుక్ చేసుకున్న భక్తులు కరోనా కారణంగా దర్శనానికి రాలేని పరిస్థితి ఏర్పడితే వారిని రానున్న 90 రోజుల వరకు దర్శనానికి అనుమతిస్తామని టీటీడీ ఒక ప్రకటనలో పేర్కొంది. ఇప్పటికే కరోనా ఉధృతితో సర్వదర్శనం టైం స్లాట్ టోకెన్ ల కోటాను నిలిపివేసిన తిరుమల తిరుపతి దేవస్థానం, ఇప్పుడు ఆన్లైన్ ద్వారా విడుదల చేసే 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్ల కోటను కూడా తగ్గించే దిశగా ఆలోచిస్తోంది.
కఠిన నిర్ణయాలు తీసుకున్న టీటీడీ .. ఎప్పటికప్పుడు పరిస్థితిపై సమీక్ష
మరోవైపు రాష్ట్రంలో కరోనా పరిస్థితుల నేపథ్యంలో సీఎం జగన్ మోహన్ రెడ్డి కరోనా కట్టడి కోసం హై లెవల్ మీటింగ్ నిర్వహించి కీలక నిర్ణయాలు తీసుకోనున్నట్టు సమాచారం . ఇదే సమయంలో తిరుమల స్వామి దర్శనం విషయంలో ముందు ముందు ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటారనేది వేచి చూడాలి. కరోనా కేసులు పెరుగుతున్న నేపధ్యంలో టీటీడీ మరోమారు కఠిన నిర్ణయాలను తీసుకుంటుంది. ఎప్పటికప్పుడు తిరుమలలో పరిస్థితిని పర్యవేక్షిస్తుంది .