తిరుమలలో పౌర్ణమి గరుడ సేవ- తేదీ, సమయం ఇదే
తిరుపతి: ప్రఖ్యాత పుణ్యక్షేత్రం తిరుమలలో భక్తుల రద్దీ తగ్గింది. 12 కంపార్ట్మెంట్లల్లో భక్తులు స్వామివారం దర్శనం కోసం వేచి ఉంటోన్నారు. సర్వ దర్శనం టోకెన్లు ఉన్న భక్తులు శ్రీవారిని దర్శించుకోవడానికి 12 నుంచి 14 గంటల సమయం పడుతోంది. శనివారం 78,115 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. వారిలో 38,243 మంది భక్తులు తలనీలాలను సమర్పించుకున్నారు.
హుండీ ద్వారా 4.19 కోట్ల రూపాయల ఆదాయం తిరుమల తిరుపతి దేవస్థానానికి అందింది. ఇక ఆగస్టులో స్వామివారి విశేష ఉత్సవాల సందర్భంగా భక్తుల తాకిడి మరింత పెరుగుతుందని టీటీడీ అధికారులు అంచనా వేస్తోన్నారు. దీనికి అనుగుణంగా చర్యలు తీసుకుంటోన్నారు. ఆగస్టులో శ్రీవారికి విశేష ఉత్సవాలను నిర్వహించనున్న విషయం తెలిసిందే.

ఆగస్టు 1వ తేదీన పౌర్ణమి గరుడ సేవతో ఈ ఉత్సవాలు ఆరంభమౌతాయి. పౌర్ణమి గరుడ సేవ సందర్భంగా ఉత్సవ మూర్తులను తిరుమాడ వీధుల్లో ఊరేగిస్తారు. కన్నుల పండువగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. 31వ తేదీన హయగ్రీవ జయంతి, తిరుమల శ్రీవారు శ్రీ విఖనసాచార్య స్వామి సన్నిధికి వేంచేపుతో ముగుస్తాయి.
1వ తేదీన అంటే మంగళవారం సాయంత్రం శ్రీవారు గరుడ వాహనంపై విహరిస్తారు. భక్తులను కటాక్షిస్తారు. సాయంత్రం 6 గంటలకు పౌర్ణమి గరుడ సేవ ఉత్సవాలు ఆరంభమౌతాయి. రాత్రి 8 గంటల వరకు కొనసాగుతాయి. సర్వాలంకార భూషితుడైన శ్రీమలయప్ప స్వామివార గరుడ వాహనంపై తిరుమాడ వీధులలో విహరిస్తూ భక్తులకు దర్శనం ఇస్తారు.
గరుడ వాహన సందర్శనం.. సర్వపాప ప్రాయశ్చిత్తమని పురాణాలు చెబుతున్నాయి. పౌరాణిక నేపథ్యంలో 108 వైష్ణవ దివ్యదేశాలలోనూ గరుడ సేవ అత్యంత ప్రాముఖ్యత ఉంది. గరుడ వాహనం ద్వారా స్వామివారు దాసానుదాస ప్రపత్తికి తాను దాసుడని తెలియజేస్తారు. తిరుమాడ వీధుల్లో ఏర్పాటు చేసిన గ్యాలరీల్లో కూర్చుని భక్తులు స్వామివారి ఊరేగింపును తిలకించవచ్చు.












Click it and Unblock the Notifications