శ్రీవారి భక్తులకు బిగ్ షాక్: టీటీడీ కీలక నిర్ణయం: ఆ టోకెన్లు తగ్గింపు: ఆర్జిత సేవలపైనా
తిరుపతి: పవిత్ర పుణ్యక్షేత్రం తిరుమలను సందర్శించడానికి దేశం నలుమూలల నుంచీ విచ్చేసే భక్తులకు మరోసారి షాక్ తగిలింది. తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు భక్తుల సంఖ్యను కుదించారు. సర్వదర్శనం టోకెన్ల సంఖ్యను భారీగా తగ్గించారు. దేశవ్యాప్తంగా కరోనా వైరస్ పాజిటివ్ కేసులు భారీగా పెరుగుతోండటాన్ని దృష్టిలో ఉంచుెకుని టీటీడీ అధికారులు ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు. రోజువారీగా జారీ చేసే సర్వదర్శనం టోకెన్ల సంఖ్యను 15 వేలకు కుదించారు. గురువారం నుంచి ఇది అమల్లోకి రానుంది. తదుపరి ఉత్తర్వులు వెలువడేంత వరకూ ఇది కొనసాగుతుంది.
Recommended Video
దేశవ్యాప్తంగా కరోనా వైరస్ పాజిటివ్ కేసులు కొద్దిరోజులుగా భయానకంగా పెరుగుతోన్న విషయం తెలిసిందే. దీన్ని దృష్టిలో ఉంచుకుని భక్తుల సంఖ్యను తగ్గించాలని టీటీడీ అధికారులు నిర్ణయించారు. తొలివిడతలో కరోనా వైరస్ వ్యాప్తి చెందడం ఆరంభమైన తరువాత సుమారు 85 రోజుల పాటు ఏడుకొండలవాడి ఆలయాన్ని మూసివేసిన విషయం తెలిసిందే. అదే పరిస్థితి మళ్లీ తలెత్తకుండా ఉండాలనే ఉద్దేశంతో రోజువారీ సర్వదర్శనం టోకెన్ల సంఖ్యను తగ్గించారు. ఇదివరకు 22 వేల రోజువారీ సర్వదర్శనం టోకెన్లను జారీ చేయగా.. ఇఫ్పుడా సంఖ్యను 15 వేలకు పరిమితం చేశారు. ఉగాది నుంచి పునఃప్రారంభించాల్సి ఉన్న ఆర్జిత సేవలను వాయిదా వేసుకోవచ్చని తెలుస్తోంది.

గురువారం నుంచి తగ్గింపును అమలు చేస్తామని టీటీడీ అదనపు కార్యనిర్వహణాధికారి ధర్మారెడ్డి తెలిపారు. 25 వేలకు పైగా 300 రూపాయల టికెట్లు బుక్ అయ్యాయని, వాటిని ఏం చేయాలనేది త్వరలోనే నిర్ణయిస్తామని అన్నారు. వాటిని క్రమబద్దీకరించడమో లేదా వాయిదా వేయడమో చేస్తామని స్పష్టం చేశారు. ఏప్రిల్ 1వ తేదీ నుంచి రోజూ 45 వేల మంది భక్తులకు మాత్రమే అనుమతి ఇస్తామని పేర్కొన్నారు. సర్వదర్శనం టోకెన్లను జారీ చేయడం ద్వారా 15 వేల మంది.. 300 రూపాయల టికెట్లను బుక్ చేయడం ద్వారా మిగిలిన వారిని అనుమతి ఇస్తామని చెప్పారు.
తిరుమలకు వచ్చే ప్రతి భక్తుడు తప్పనిసరిగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తోన్న కోవిడ్ మార్గదర్శకాలను అనుసరించాల్సి ఉంటుందని ధర్మారెడ్డి స్పష్టం చేశారు. మాస్కులను ధరించడం, చేతులను శుభ్రం చేసుకోవడం, క్యూలైన్లలో భౌతిక దూరాన్ని పాటించడం వంటి కరోనా వైరస్ నివారణ చర్యలను ప్రతి ఒక్కరు అనుసరించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. జ్వరం, దగ్గు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు వంటి సమస్యలను ఎదుర్కొంటోన్న వారు, అనారోగ్యంతో బాధపడుతున్న వారు శ్రీవారి దర్శనానికి రావొద్దని విజ్ఞప్తి చేశారు. పరిస్థితులు అనుకూలించిన తరువాతే రావాలని సూచించారు.












Click it and Unblock the Notifications