TTD: శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్ - రెండు నెలల గదుల కోటా విడుదల..!!
Tirumala: తిరుమల భక్తులకు టీటీడీ కీలక సమాచారం ఇచ్చింది. శ్రీవారి భక్తుల సౌకర్యార్థం టీటీడీ షెడ్యూల్ ప్రకారం తిరుమల శ్రీవారి ఆర్జిత సేవలు, దర్శన టికెట్లు, గదుల కోటాను విడుదల చేస్తోంది. ఇందులో భాగంగా ఆగస్టు, సెప్టెంబరు నెలలకు సంబంధించిన గదుల కోటా విడుదలకు ముహూర్తం ఖరారు చేసింది. తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి మెట్టు మార్గం, అలిపిరిలో అనుమతులపై తాజాగా సమయాలను ఖరారు చేసారు.
గదుల కోటా విడుదల: ప్రతీ నెలా నిర్దేశించిన షెడ్యూల్ మేరకు శ్రీవారి సేవలు..దర్శన..టికెట్ల కోటాను టీటీడీ విడుదల చేస్తోంది. ఇందులో భాగంగా ఆగస్టు, సెప్టెంబరు నెలలకు సంబంధించిన గదుల కోటాను జూన్ 26న ఉదయం 10 గంటలకు ఆన్ లైన్ లో విడుదల చేయనుంది. తిరుమల, తిరుపతి, తలకోన ప్రాంతాల్లోని గదులను భక్తులు బుక్ చేసుకోవచ్చని టీటీడీ ప్రకటించింది.

భక్తులు https://tirupatibalaji.ap.gov.in వెబ్ సైట్ తో పాటుగా టీటీడీ యాప్ ద్వారా బుక్ చేసుకొనే అవకాశం వినియగించుకోవాలని టీటీడీ సూచించింది. ఇప్పటికే సెప్టెంబర్ మాసానికి సంబంధించి ఆర్జిత సేవలు..రూ 300 ప్రత్యేక ప్రవేశ దర్శనం ఆన్ లైన్ కోటాను టీటీడీ విడుదల చేసింది.
కాలిబాట వేళల్లో మార్పులు: తిరుమల కాలిబాలో చిరుతపులి దాడిలో గాయపడిన చిన్నారి కోలుకుంటున్నాడు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాలుడి ఆరోగ్యంపైన ఛైర్మన్ సుబ్బారెడ్డి..ఈవో ధర్మారెడ్డి ఎప్పటికప్పుడు సమాచారం సేకరిస్తున్నారు. దాడి చేసిన పిల్ల చిరుతను టీటీడీ అటవీ శాఖ అధికారులు బంధించారు. మరో పులి సంచరిస్తోందనే సమాచారం ఉండటంతో అధికారులు అప్రమత్తం అయ్యారు.
ఈ కారణంగా రాత్రి 7 గంటల తరువాత అలిపిరి నడక మార్గంలో గాలిగోపురం నుండి 200 మంది భక్తులను ఒక బృందంగా కలిపి పంపేలా ఏర్పాట్లు చేశారు. వీరితోపాటు సెక్యూరిటీ గార్డ్ ఉంటారని, భక్తులు గోవింద నామస్మరణ చేసుకుంటూ ముందుకు సాగనున్నారు. చిన్నపిల్లలను బృందం మధ్యలో ఉంచుకుని, వారి పట్ల అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.
సాక్షాత్కార వైభవోత్సవాలు: శ్రీవారి మెట్టు మార్గంలో సాయంత్రం 6 గంటల వరకు, అలిపిరి మార్గంలో రాత్రి 10 గంటల వరకు భక్తులను అనుమతిస్తారని ఈవో ధర్మారెడ్డి తెలిపారు. సాయంత్రం 6 గంటల తర్వాత ఘాట్ రోడ్లలో వెళ్లే ద్విచక్ర వాహనదారుల భద్రతకు ఎలాంటి చర్యలు తీసుకోవాలనే విషయంపై ఆలోచిస్తున్నట్టు చెప్పారు. శ్రీనివాసమంగాపురం శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో సాలకట్ల సాక్షాత్కార వైభవోత్సవాలు శనివారం వైభవంగా ప్రారంభమయ్యాయి.
ఈ ఉత్సవం మూడు రోజుల పాటు జరుగనుంది. ఇందులో భాగంగా ఉదయం సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి, తోమాలసేవ, కొలువు, పంచాంగ శ్రవణం, సహస్రనామార్చన నిర్వహించారు. ఆలయంలో శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఉత్సవర్లకు వేడుకగా స్నపన తిరుమంజనం నిర్వహించారు.












Click it and Unblock the Notifications