మూడు రాజధానులు ఏర్పాటు చేస్తే ముగ్గురు సీఎంలు కావాలి .. రాజధాని మహిళల మండిపాటు
ఏపీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ఏపీకి మూడు రాజధానులు అవసరమంటూ సూచనప్రాయంగా చేసిన ప్రకటనపై రాజధాని ప్రాంత రైతులు, మహిళలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గత మూడు రోజులుగా ఆందోళన బాట పట్టిన మహిళలు సీఎం జగన్మోహన్ రెడ్డి తీరుపై మండిపడుతున్నారు. మొన్నటికి మొన్న ముఖ్యమంత్రి మారితే రాజధాని మారాలా ? అని ప్రశ్నించిన మహిళలు, నేడు మరోమారు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.
ఒక్క రాజధానికే దిక్కు లేదు ..33 కడతారా ? .. పెద్దిరెడ్డి వ్యాఖ్యలపై భగ్గుమన్న రాజధాని రైతులు
సీఎం జగన్ మోహన్ రెడ్డి మూడు ప్రాంతాలు అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో మూడు రాజధానులు ఏర్పాటు చేయాలని భావిస్తే, ఇక ఈ మూడు రాజధానులను చూసుకోవడానికి ముగ్గురు సీఎంలు కావాలని మేము కూడా కోరుకుంటున్నామంటూ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు మహిళలు.మూడు రాజధానులు ఏర్పాటు చేస్తే సరైన పాలన కోసం ముగ్గురు సీఎంలు అవసరమని పేర్కొన్నారు. కేవలం ప్రతిపక్షాలను టార్గెట్ చేసుకొని, చంద్రబాబు నాయుడుని లక్ష్యంగా చేసుకొని రాజకీయ శత్రుత్వంలో భాగంగానే సీఎం జగన్ ఇలాంటి నిర్ణయం తీసుకున్నారని ఆరోపిస్తున్నారు.
రాష్ట్ర ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని, ఇప్పటికైనా సీఎం జగన్ ఈ తరహా నిర్ణయాన్ని మార్చుకోవాలని మహిళలు కోరుతున్నారు. లేదంటే మరోమారు రాజధానిలోని 29 గ్రామాలకు ఎన్నికలు పెట్టాలని డిమాండ్ చేస్తున్నారు. అప్పుడు రాజధాని ప్రజల ఆకాంక్షను ఎన్నికల ద్వారా జగన్ కు అర్థమయ్యేలా చెబుతామని మహిళలు అంటున్నారు. ఏది ఏమైనా సీఎం జగన్ తీసుకున్న నిర్ణయం రాజధాని ప్రాంత రైతులకు, మహిళలకు ఏమాత్రం మింగుడు పడడం లేదు. జగన్ తన నిర్ణయాన్ని మార్చుకునే వరకు ఎక్కడ వరకైనా వెళతామని, ఎందాకైనా పోరాటం చేస్తామని మహిళలు చెప్తున్నారు.