ఆలయాల సందర్శన: గవర్నర్ బండారు దత్తాత్రేయతో డీజీపీ భేటీ: ఏపీ పర్యటనకు హిమాచల్ గవర్నర్
విజయవాడ: హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ ఏపీ పర్యటనకు వచ్చారు. విజయవాడలో బస చేసిన ఆయనను రాష్ట్ర పోలీస్ డైరెక్టర్ జనరల్ గౌతమ్ సవాంగ్ కలిశారు. సుమారు 20 నిమిషాల పాటు ఆయనతో సమావేశం అయ్యారు. బండారు దత్తాత్రేయను ఏపీ డీజీసీ మర్యాదపూరకంగా కలిసినట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా వారి మధ్య కొన్ని కీలక అంశాలు చర్చకు వచ్చినట్లు సమాచారం. రాష్ట్రంలో ఇదివరకు వరుసగా కొనసాగిన విగ్రహాల విధ్వంసం, దేవాలయాలపై దాడుల అంశం ప్రస్తావనకు వచ్చిందని అంటున్నారు.
కొద్దిరోజుల కిందట రాష్ట్రంలో వరుసగా విగ్రహాల విధ్వంసం కొనసాగిన విషయం తెలిసిందే. విజయనగరం జిల్లాలోని ప్రఖ్యాత పుణ్యక్షేత్రం రామతీర్థం, తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో సుబ్రహ్మణ్యస్వామి విగ్రహం ధ్వంసం వంటి సంఘటనలుచోటు చేసుకున్నాయి.

వాటిపై రాజకీయ దుమారం చెలరేగింది. తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ, జనసేన విగ్రహాల విద్వంసంపై ఘాటుగా స్పందించాయి. అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై ఆరోపణలను గుప్పించాయి. తమనిరసన కార్యక్రమాలను మరింత ఉధృతం చేయడానికి బీజేపీ రాష్ట్రశాఖ నాయకులు రథయాత్రను నిర్వహిస్తారనే ప్రచారం సాగుతోంది.

ఈ పరిణామాల మధ్య హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ రాష్ట్ర పర్యటనకు రావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. విజయవాడ కనకదుర్గమ్మ అమ్మవారి ఆలయాన్ని ఆయన సందర్శిస్తారని తెలుస్తోంది. సుదీర్ఘ విరామం అనంతరం బండారు దత్తాత్రేయ ఏపీకి రావడంతో ప్రొటోకాల్ను అనుసరిస్తూ డీజీపీ గౌతమ్ సవాంగ్ ఆయనను కలిశారు. పుష్పగుచ్ఛాన్ని ఇచ్చి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా దత్తాత్రేయ.. హిమాచల్ ప్రదేశ్ సంప్రదాయబద్ధమైన టోపీని డీజీపీకి అందజేశారు.












Click it and Unblock the Notifications