రాజధానిపై అసలు బీజేపీ స్టాండ్ ఏంటి..? సోము వీర్రాజు లేటెస్ట్ కామెంట్స్..
ఏపీ రాజధాని విషయంలో ఆయా పార్టీల వైఖరి ఇప్పటికే స్పష్టమైపోయింది. అధికార వైసీపీ రాజధానిని తరలించాలనే యోచనలో ఉండగా.. టీడీపీ,జనసేనలు దాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఇక వామపక్ష పార్టీల్లో సీపీఎం జగన్ సర్కార్ ఆలోచనను ఇప్పటికే తప్పు పట్టింది. మరోవైపు సీపీఐ దీనిపై అఖిలపక్షానికి డిమాండ్ చేసింది. ఇలా అన్ని పార్టీలు రాజధానిపై స్పష్టమైన వైఖరితో ఉండగా.. ఒక్క బీజేపీలో మాత్రమే తీవ్ర భిన్నాభిప్రాయాలు వినిపిస్తున్నాయి. పార్టీ స్టాండ్ అంటూ ఒకటి లేకుండా నేతలు ఎవరికి తోచిన రీతిలో వారు స్పందిస్తున్నారు. తాజాగా బీజేపీ నేత సోము వీర్రాజు అమరావతిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

అదొక భ్రమ మాత్రమే :
అమరావతి అనేది వట్టి భ్రమ అని.. ఏపీ ప్రజలు ఆ భ్రమలో పడవద్దని సోము వీర్రాజు విజ్ఞప్తి చేశారు. అమరావతి అనే భ్రమను సృష్టించి.. చంద్రబాబు ప్రజలను గందరగోళపరుస్తున్నారని విమర్శించారు. అమరావతి రైతుల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరించాలన్నారు. రాష్ట్రంలో ప్రతీ జిల్లాను రాజధాని తరహాలో అభివృద్ది చేయాలన్నారు. రాయలసీమలో పరిశ్రమలు,కోస్తాలో పోర్టులు ఏర్పాటు చేయాలన్నారు.

సుజనా వాదన మరోలా..
సోము వీర్రాజు వాదన అలా ఉంటే బీజేపీ నేత,రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరి వాదన మరోలా ఉంది. రాజధానిని అమరావతి నుంచి ఒక అంగుళం కూడా కదలనిచ్చేది లేదని ఆయన వైసీపీ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఆనాడు ప్రతిపక్ష హోదాలో ఉండి అమరావతిలో రాజధానిని స్వాగతించిన జగన్మోహన్ రెడ్డి.. ఇప్పుడెందుకు రాజధానిని మార్చుతున్నారని ఆయన ప్రశ్నించారు. అంతేకాదు,రాజధాని నిర్మాణమంటే ఒక కారు వదిలేసి మరో కారు కొన్నంత ఈజీ కాదని చురకలంటించారు.

జీవీఎల్ ఏమన్నారు..
రాజధాని కేంద్రం పరిధిలోకి రాని అంశమని చెప్పిన జీవీఎల్.. రాష్ట్ర ప్రభుత్వం దీన్ని కేంద్రం దృష్టికి తీసుకొచ్చి సలహాలు కోరితే సూచనలు మాత్రమే ఇస్తుందన్నారు. అసలు రాజధానిపై ప్రభుత్వానికే స్పష్టత లేదన్నారు. తాను చెప్పేది కేంద్ర నిర్ణయమని,సుజనా చౌదరి వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతమని చెప్పారు.

అధ్యక్షుడు కన్నా వాదన..:
ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ రాజధానిని అమరావతి నుంచి తరలించవద్దని డిమాండ్ చేస్తున్నారు. అమరావతి కోసం ధర్నా చేస్తున్న రైతులతో కలిసి ఒకరోజు దీక్ష కూడా చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. టీడీపీ ప్రభుత్వం రాజధాని పేరుతో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసిందని ఆరోపించారు. ఇక జగన్ ప్రభుత్వం మూడు రాజధానుల పేరుతో అమరావతిని అమ్మాలని చూస్తోందన్నారు. ఎన్నికల్లో పెట్టుబడి పెట్టి అధికారంలోకి వచ్చి దోపిడీ చేస్తున్నారని మండిపడ్డారు.

ఎవరి వాదన వారిదే..
బీజేపీ నేతల నుంచి వినిపిస్తున్న భిన్నాభిప్రాయాలు రాజధాని విషయంలో ఆ పార్టీకి స్పష్టమైన వైఖరంటూ లేదన్న విమర్శలకు కారణమవుతున్నాయి. ఎవరికి తోచిన రీతిలో వారు రాజధానిపై ప్రకటనలు ఇస్తున్నారు. దీంతో రాజధాని విషయంలో బీజేపీ చిత్తశుద్దిపై ప్రజలకు అనుమానం కలిగే అవకాశం లేకపోలేదు. ఇప్పటికే రాష్ట్రంలో అంతగా నిలదొక్కుకోలేకపోయిన బీజేపీకి.. ఇలాంటి వైఖరి మరింత నష్టం చేస్తుందన్న వాదన వినిపిస్తోంది.












Click it and Unblock the Notifications