జూమ్ టైగర్లు ఎక్కడ?: టీడీపీకి ప్రత్యామ్నాయంగా బీజేపీ: ప్రతిపక్షం: కారణమేంటో చెప్పిన విష్ణు
అమరావతి: రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీగా భారతీయ జనతా పార్టీ ఎదుగుతోందా? తెలుగుదేశానికి ప్రత్యామ్నాయ పార్టీగా ప్రజలు తమను గుర్తించారా? అనే ప్రశ్నలకు బీజేపీ రాష్ట్రశాఖ ఉపాధ్యక్షుడు సోమగుంట విష్ణువర్ధన్ రెడ్డి అవుననే సమాధానమిస్తున్నారు. తెలుగుదేశం పార్టీపై ప్రజలు విశ్వాసాన్ని కోల్పోయారని, తమను ప్రత్యామ్నాయంగా చూస్తున్నారని చెబుతున్నారు. తెలుగుదేశం పార్టీ అధినేత, 14 సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు నాయుడు రాష్ట్రంలోనే లేకుండా పోయారని ధ్వజమెత్తారు.
తెలంగాణలో తగ్గని ఉధృతి: క్వారంటైన్లు, ఐసొలేషన్లలో వేలాదిమంది: 97 వేలకు పైగా
చంద్రబాబు నాయుడు, తెలుగుదేశం నేతలపై ఆయన ఘాటు విమర్శలను గుప్పించారు. రాష్ట్రంలో నెలకొన్న వరద పరిస్థితులను కేంద్రబిందువుగా చేసుకుని విష్ణువర్ధన్ రెడ్డి విమర్శలు చేశారు. చంద్రబాబు సహా తెలుగుదేశం పార్టీ నేతలు జూమ్ పులులుగా, ట్విట్టర్ టైగర్లుగా మారిపోయారని, ఇక ప్రజలు ఎలా నమ్మకం పెట్టుకుంటారని విమర్శించారు. కృష్ణా, గోదావరి నదులకు సంభవించిన వరదల వల్ల అనేక ప్రాంతాలు నీట మునిగాయని, వేలాదిమంది ప్రజలు నిరాశ్రయులు అయ్యారని అన్నారు.
ఇలాంటి పరిస్థితుల్లోనూ చంద్రబాబు హైదరాబాద్ను వీడట్లేదని ఎద్దేవా చేశారు. చంద్రబాబు, తెలుగుదేశం పార్టీని ప్రజలు నమ్మట్లేదని అన్నారు. ఆ పార్టీకి ప్రత్యామ్నాయంగా తమను భావిస్తున్నారని చెప్పారు. పోలవరంలో వరద ముంపునకు గురైన ప్రాంతాల్లో బీజేపీ రాష్ట్రశాఖ అధ్యక్షుడు సోము వీర్రాజు పర్యటించిన విషయం తెలిసిందే. వరదల వల్ల పంటను నష్టపోయిన రైతులను ఆయన పరామర్శించారు. అన్ని విధాలుగా తాము అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.
రాష్ట్ర రాజకీయాల్లో ప్రధాన పార్టీగా ఉంటోన్న టీడీపీ చేయాల్సిన పనులను తాము చేస్తున్నామని విష్ణువర్ధన్ రెడ్డి అన్నారు. వరదలతో ప్రజలు అల్లాడుతుంటే జూమ్ పులులు, ట్విట్టర్ టైగర్లు వారి మధ్య ఎందుకు లేరని ప్రశ్నించారు. ప్రజల్లో నమ్మకాన్ని పోగొట్టుకోవడం వల్లే వారికి ముఖం చెల్లట్లేదని అన్నారు. బీజేపీ నేతలు అన్ని వేళలా ప్రజలకు అండగా ఉంటున్నారని, సోము వీర్రాజు పర్యటనతో ఇది మరోసారి రుజువైంని చెప్పారు. భవిష్యత్తులో టీడీపీకి ఇక తామే ప్రత్యామ్నాయమనే విషయాన్ని ప్రజలు గ్రహించారని అన్నారు.