నిమ్మగడ్డ విచక్షణాధికారాలకు చెక్: మంత్రి పెద్దిరెడ్డికి ఏపీ హైకోర్టు గ్రీన్ సిగ్నల్
అమరావతి: రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్కు ఏపీ హైకోర్టులో మరో ఎదురుదెబ్బ తగిలింది. పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డిని మీడియాతో మాట్లాడకుండా ఆయన విధించిన ఆంక్షలను హైకోర్టు కొట్టి వేసింది. మీడియా ప్రతినిధులతో మాట్లాడటానికి అవకాశాన్ని కల్పించింది. ఈ మేరకు హైకోర్టు డివిజన్ బెంచ్.. కొద్దిసేపటి కిందటే ఆదేశాలను జారీ చేసింది.
ఈ సారి నిమ్మగడ్డ టార్గెట్ ఆయనే? గవర్నర్తో భేటీ కానున్న నిమ్మగడ్డ: తొలిదశ పోలింగ్ వేళ
పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి.. నిమ్మగడ్డ రమేష్ కుమార్పై ఘాటు వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. వరుసగా విలేకరుల సమావేశాలను నిర్వహిస్తూ వచ్చిన ఆయన ఎస్ఈసీపై నిప్పులు చెరిగారు. ఆయన చేసిన వ్యాఖ్యల పట్ల అభ్యంతరాన్ని వ్యక్తం చేసిన నిమ్మగడ్డ రమేష్ కుమార్.. తన విచక్షణాధికారాలను ప్రయోగించారు. పంచాయతీ ఎన్నికల తుది విడత పోలింగ్ జరిగే 21వ తేదీ వరకు పెద్దిరెడ్డి గృహ నిర్బంధంలో ఉండాలని, మీడియాతో మాట్లాడకూడదంటూ ఆదేశాలను జారీ చేశారు.
దీనిపై పెద్దిరెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. నిమ్మగడ్డ ఆదేశాలను సవాల్ చేస్తూ పిటీషన్ను దాఖలు చేశారు. తొలుత- ఈ పిటీషన్పై హైకోర్టు సింగిల్ బెంచ్ విచారించింది. మంత్రి స్థాయి వ్యక్తిని కొన్ని రోజుల పాటు గృహ నిర్బంధంలో ఉంచడాన్ని తప్పు పట్టింది. ఆయన బయట తిరగడానికి అనుమతి ఇచ్చింది. అదే సమయంలో - మీడియాతో మాట్లాడకూడదనే ఆంక్షలను కొనసాగించాలని సింగిల్ బెంచ్ ఆదేశించింది.
సింగిల్ బెంచ్ ఆదేశాలపైనా పెద్దిరెడ్డి సవాల్ చేశారు. డివిజన్ బెంచ్కు అప్పీల్కు వెళ్లారు. సోమవారం దీన్ని విచారణకు స్వీకరించిన హైకోర్టు డివిజన్ బెంచ్.. తాజాగా తన ఆదేశాలను వెలువడించింది. మీడియా ప్రతినిధులతో మాట్లాడటానికి, విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేయడానికి అవకాశం ఇచ్చింది. సింగిల్ బెంచ్ తీర్పును కొట్టేసింది. దీనిపై మంత్రి పెద్దిరెడ్డి హర్షం వ్యక్తం చేస్తున్నారని తెలుస్తోంది. ఈ మధ్యాహ్నం ఆయన విలేకరుల సమావేశాన్ని నిర్వహించబోతోన్నట్లు సమాచారం.