టీడీపీ నేతలకేనా కరోనా నిబంధనలు? అధికార పార్టీకి వర్తించవా?: అచ్చెన్నాయుడు ఫైర్
విజయవాడ: తెలుగుదేశం నేతలు కాల్వ శ్రీనివాసులు, బీటెక్ రవి, లింగారెడ్డ, రాంగోపాల్ రెడ్డిపై కేసులు నమోదు చేయడాన్ని ఖండించారు ఆ పార్టీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు. టీడీపీ నేతలు కాలు బయటపెడుతుంటే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతల గుండెళ్లో రైళ్లు పరుగెడుతున్నాయని అన్నారు.
వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతల పాదయాత్రలు, నామినేటెడ్ పదవులు ప్రమాణస్వీకారాలకు అడ్డు రాని కరోనా నిబంధనలు.. పెట్రోల్, డీజిల్ ధరలపై శాంతియుతంగా నిరసన తెలిపిన వారికే వర్తింపజేయడం దుర్మార్గమని అన్నారు.

ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై నిరసన తెలిపితే అక్రమ కేసులు నమోదు చేయడం రాచరికాన్ని తలపిస్తోందని అచ్చెన్నాయుడు మండిపడ్డారు. రాష్ట్రంలో ఎమర్జెన్సీని మించిన నియంతృత్వం.. హిట్లర్, గడాఫీలను మించిన అరాచకం నడుస్తోందని అచ్చెన్నాయుడు తీవ్ర విమర్శలు చేశారు.
కరోనా నిబంధనలు ఉల్లంఘించిన నేతల చిట్టాను తాము బయటపెడితే వారిపై కేసులు నమోదు చేసే ధైర్యం డీజీపీకి ఉందా? అని అచ్చెన్నాయుడు ప్రశ్నించారు. కరోనా ప్రారంభం తర్వాత ముఖ్యమంత్రి నిర్వహించిన బహిరంగ సభలకు సంబంధించి ఎన్ని కేసులు నమోదు చేశారని నిలదీశారు.
మరోవైపు, టీడీపీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా తమ పార్టీ నేతలపై కేసులు పెట్టడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయంపై ఏపీ డీజీపీకి లేఖ రాశారు. టీడీపీ నేతలపై అక్రమ కేసులు పెడుతున్నారని మండిపడ్డారు. చింతమనేని ప్రభాకర్ అరెస్ట్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదలపై నిరసన తెలపడం నేరమా? అని ప్రశ్నించారు. ఏపీలో ఆటవిక పాలన కొనసాగుతోందని చంద్రబాబు ధ్వజమెత్తారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం అపహాస్యమవుతోందని, ఏపీలో వైసీపీ ప్రేరేపిత పోలీసు రాజ్యం కనిపిస్తోందన్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏవైనా అసమ్మతులు ఉంటే వేధిస్తారా? అంటూ మండిపడ్డారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా తీవ్రత కొనసాగుతోంది. గత 24 గంటల వ్యవధిలో 41,173 శాంపిల్స్ టెస్ట్ చేశారు. వీరిలో 878 మందికి వైరస్ సోకింది. మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 2,01,3001కి చేరింది. కొత్తగా 13 మంది వైరస్ కారణంగా ప్రాణాలు కోల్పోయారు. రాష్ట్రంలో మొత్తం కరోనా మృతుల సంఖ్య 13,838కి చేరింది. కొత్తగా 24 గంటల వ్యవధిలో1,182 మంది వైరస్ కారణంగా కోలుకున్నారు. కోలుకున్నవారితో కలిపి రాష్ట్రంలో మొత్తం రికవరీల సంఖ్య 1984301కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 14,862 యాక్టివ్ కేసులున్నాయి. ఇవాళ్టి వరకు రాష్ట్రంలో 2,65,76,995 శాంపిల్స్ టెస్ట్ చేసినట్లు వైద్యారోగ్య శాఖ తెలిపింది. కోవిడ్ వల్ల కొత్తగా కృష్ణా జిల్లాలో నలుగురు, చిత్తూర్ జిల్లాలో ముగ్గురు, నెల్లూరు జిల్లాలో ఇద్దరు, తూర్పు గోదావరి, గుంటూరు, కడప, ప్రకాశం జిల్లాల్లో ఒక్కొక్క రు చొప్పున ప్రాణాలు కోల్పోయారు. చిత్తూరు జిల్లాలో ప్రమాదకరంగా 255 కొత్త కేసులు వెలుగుచూశాయి.












Click it and Unblock the Notifications