పాలన వికేంద్రీకరణ: కర్నూలులో హైకోర్టు: పార్టీ ఉద్దేశం అదే: బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు..!
అమరావతి: ఏపీ వికేంద్రీకరణ బిల్లు అంశంపై శాసనమండలి వేదికగా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ తన వైఖరి ఏమిటో స్పష్టం చేసింది. వికేంద్రీకరణ చట్టంపై చర్చ సందర్భంగా బీజేపీ సభ్యుడు సోము వీర్రాజు కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీ వికేంద్రీకరణ చట్టాన్ని తాము స్వాగతిస్తున్నామని, కర్నూలులో హైకోర్టును ఏర్పాటు చేయాలనేది తమ పార్టీ సిద్ధాంతమని అన్నారు. ఈ విషయాన్ని తాము ఇదివరకే కర్నూలు డిక్లరేషన్లో పొందుపరిచామని చెప్పారు. ఎన్నికల మేనిఫెస్టోలోనూ దీన్ని ప్రస్తావించామని చెప్పుకొచ్చారు.

వికేంద్రీకరణ జరగాలనే కోరుకుంటున్నాం..
రాష్ట్రంలో పాలన గానీ, అధికారం గానీ, అభివృద్ధి గానీ.. పేరు ఏదైనప్పటికీ దాన్ని వికేంద్రీకరించాలనే తాము కోరుకుంటున్నామని సోము వీర్రాజు స్పష్టం చేశారు. ఈ బిల్లులో ప్రాంతీయ బోర్డుల అంశం ఉందనే విషయాన్ని ఆయన మండలి దృష్టికి తీసుకొచ్చారు. కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేయాలన్న ఆలోచనను తాము కూడా ఇదివరకే చేశామని అన్నారు. తమ ఆలోచన ధోరణికి అనుగుణంగా, అనుకూలంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారని చెప్పారు.

చంద్రబాబు పాలనలో తప్పిదాలు పునరావృతం కాకుడదు..
అయిదేళ్ల చంద్రబాబు నాయుడి పరిపాలనలో ఘోర తప్పిదాలు చోటు చేసుకున్నాయని, అవి పునరావృతం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంపై ఉందని అన్నారు. రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి గానీ, అమరావతి రాజధానిని నిర్మించడానికి గానీ రాష్ట్ర ప్రజలు చంద్రబాబుకు అయిదేళ్ల సమయం ఇచ్చారని, దాన్ని ఆయన వృధా చేశారని అన్నారు. అయిదేళ్ల కాల వ్యవధిలో అమరావతిలో ఒక్క శాశ్వత కట్టడాన్ని కూడా చంద్రబాబు నిర్మించలేకపోయారని సోము వీర్రాజు ధ్వజమెత్తారు.

అన్నీ తాత్కాలికమే..
రాష్ట్ర సచివాలయం, హైకోర్టు భవనాలన్నీ తాత్కాలికంగా కట్టినవేననే విషయాన్ని విస్మరించకూడదని అన్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న తమ ప్రభుత్వం.. నాటి చంద్రబాబు సర్కార్కు అన్ని విధాలుగా సహకరించిందని, అయినప్పటికీ.. వాటిని సద్వినియోగం చేసుకోవడంలో విఫలం అయ్యారని అన్నారు. ఆ తప్పులన్నింటినీ తమ మీద, తమ పార్టీ మీద రుద్దే ప్రయత్నం చేస్తున్నారని సోము వీర్రాజు మండిపడ్డారు.

మోడీ గో బ్యాక్ అంటూ బ్యానర్లు కట్టించి..
సార్వత్రిక ఎన్నికల ప్రచారానికి ప్రధానమంత్రి హోదాలో నరేంద్ర మోడీ రాష్ట్రానికి రానుండగా.. గో బ్యాక్ అంటూ బ్యానర్లు కట్టింది టీడీపీ ప్రభుత్వం కాదా? అంటూ సోము వీర్రాజు నిలదీశారు. రాజధాని నిర్మాణం పేరిట వేలాది ఎకరాలను కొట్టేసిన చంద్రబాబు ప్రభుత్వం.. వాటిని సింగపూర్ సంస్థలకు కట్టబెట్టిందని ధ్వజమెత్తారు. నాడు మోడీ గో బ్యాక్ అంటూ బ్యానర్లు కట్టి, ఇప్పుడు అదే నరేంద్ర మోడీ సహకారాన్ని కోరుతున్నారని ఎద్దేవా చేశారు.

హైదరాబాద్ కేంద్రంగా అభివృద్ధి ఫలితాలేమిటో చూశాం..
రాష్ట్ర విభజనకు ముందు హైదరాబాద్ కేంద్రంగా అభివృద్ధి చోటు చేసుకోవడం వల్ల అటు తెలంగాణ, ఇటు ఏపీలోని వెనుకబడిన ప్రాంతాలు నష్టపోలేదా? అని ప్రశ్నించారు. విభజన తర్వాత కూడా చంద్రబాబు అమరావతిలోనే అభివృద్ధిని కేంద్రీకరించడానికి ప్రయత్నించారని ఆరోపించారు. మరోసారి అలాంటి తప్పును జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రజా ప్రతినిధులుగా తమపై ఉందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఒకేచోట అభివృద్ధిని కేంద్రీకరించకూడదని హితవు పలికారు.












Click it and Unblock the Notifications