బోటు ప్రమాద ఘటనలో జగన్ ఏ 1.. అవంతి ఏ 2 : టీడీపీ మహిళా నేత అనురాధ
ఎట్టకేలకు రాయలు వశిష్ట బోట్ ను 38 రోజుల తర్వాత గోదావరి నది నుండి బయటకు తీశారు.గోదావరిలో మునిగిపోయిన రాయల్ వశిష్ట బోటును ధర్మాడి సత్యం బృందం బయటికి తీయడానికి పలుమార్లు ప్రయత్నం చేసి విఫలమైనప్పటికీ చివరకు నిన్న సాయంత్రం బోటు బయటకు తెచ్చారు. దీంతో మరోమారు బోటు ప్రమాద ఘటన ఏపీ లో హాట్ టాపిక్ గా మారింది.
బోటు ప్రమాద ఘటనకు ఏపీ ప్రభుత్వం నైతిక బాధ్యత వహించాలని టిడిపి నేతలు ఇప్పటికే పలుమార్లు పేర్కొన్న విషయం తెలిసిందే. ఇక తాజాగా ఈ అంశంపై టీడీపీ నాయకురాలు పంచుమర్తి అనురాధ మాట్లాడారు. ముఖ్యమంత్రి జగన్ పట్టించుకోకపోవడం వల్లే బోటు వెలికితీత ఆలస్యమయిందని అనురాధ పేర్కొన్నారు. బోటు ప్రమాద ఘటనపై విచారణ ఎంతవరకు వచ్చిందో అర్థం కావడం లేదని, అసలు ప్రభుత్వం విచారణ చేస్తున్నట్లు గా కూడా అనిపించడం లేదని ఆమె విమర్శలు గుప్పించారు.

ఈ ప్రమాద ఘటనపై దర్యాప్తు చేస్తున్న పోలీసులు, ఈ కేసులో ఏ1గా జగన్, ఏ2గా మంత్రి అవంతి శ్రీనివాస్ పేర్లను చేర్చాలని ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు. మృతుల కుటుంబాలను వైసీపీ ప్రభుత్వంలోని పెద్దలు ఇంత వరకు పరామర్శించలేదని పేర్కొన్న టిడిపి నేత అనురాధ అసలు ఎంత మంది చనిపోయారనే విషయంలో ప్రభుత్వానికి స్పష్టత ఉందా? అని ప్రశ్నించారు. బోటు ప్రమాదంలో ఎంత మంది చనిపోయారు? ఎన్ని మృతదేహాలు ఇప్పటివరకు లభ్యమయ్యాయి? ఇంకా లభించాల్సిన మృతదేహాలు ఏమైనా ఉన్నాయా అన్న విషయంలో అధికారులు స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉందని టిడిపి మహిళా నాయకురాలు పంచుమర్తి అనురాధ పేర్కొన్నారు. ఇక బోటు ప్రమాద ఘటనలో మరణించిన కుటుంబాలకు ప్రభుత్వ సహాయం అందించాలని డిమాండ్ చేశారు.












Click it and Unblock the Notifications