ఎవరీ డొక్కా సీతమ్మ! జనసేన ఆహార శిబిరాలు ప్రారంభం..భవన నిర్మాణ కార్మికుల కడుపు నింపిన పవన్
అమరావతి/హైదరాబాద్ : జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మరోసారి తన ఉదార స్వభావాన్ని చాటుకున్నారు. ఆకలితో అలమటిస్తున్న భవన నిర్మాణ కార్మికుల కోసం పవన్ కళ్యాణ్ వినూత్న రీతిలో స్పందించారు. ఇసుక కొరతతో పనులు లేక పస్తులుంటున్న భవన నిర్మాణ కార్మికుల కోసం డొక్కా సీతమ్మగారి స్ఫూర్తితో జనసేన పార్టీ తరఫున డొక్కా సీతమ్మ ఆహార శిబిరాలు ఏర్పాటు చేసారు. పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్. ఈ నెల 15, 16 (అంటే నేడు, రేపు) తేదీల్లో జనసేన నాయకులు, కార్యకర్తలు భవన నిర్మాణ కార్మికుల కోసం డొక్కా సీతమ్మ శిబిరాలను అందుబాటులోకి తెచ్చారు.

భవన కార్మికులకు జనసేన భరోసా.. పస్తులుంటున్న కార్మికుల పట్ల పవన్ కనికరం..
ఆకలితో ఉన్న వారికి పని కల్పించి కడుపు నింపాల్సిన ప్రభుత్వమే భవన నిర్మాణ కార్మికుల ఉపాధి పోగొట్టి వారి కడుపు మాడ్చేసిందని పవన్ అభిప్రాయపడ్డారు. భవిష్యత్తులో భవన నిర్మాణ కార్మికులకు అండగా శిబిరాలు ఏర్పాటు చేస్తాం అని చెప్పాం. అందులో భాగంగా జనసేన నాయకులు, జనసైనికులు వారికి మరింత అండగా నిలబడాల్సిన అవసరం ఉంద జనసేనాని పిలుపునిచ్చారు. ఉపాధి లేక పస్తులుంటున్న కార్మికుల కోసం తమకి చేతనైన సహాయం చేయాలని, తమకి పరిమితమైన వనరులే ఉన్నాయని అందుకోసం అందరూ ముందుకు రావాలని పవన్ పిలుపునిచ్చారు.

ప్రభుత్వ కళ్ళు తెరిపించడమే లక్ష్యం.. కార్మికులకు ఉపాది కల్పించడమే ద్యేయమంటున్న పవన్..
శుక్రవారం మంగళగిరిలో భోజన శిబిరాలు ఏర్పాటు చేయడం వెనుక ముఖ్య ఉద్దేశాన్ని పవన్ కళ్యాణ్ వివరించారు. తమది ఓ రాజకీయ పార్టీ అయినందున, 35 లక్షల మందికి పైగా జీవితాల్ని పోషించే స్థోమత లేనప్పటికి, భవన నిర్మాణ కార్మికులకు మేమున్నాం అన్న భరోసా కల్పించే ప్రత్నం మాత్రం చేస్తామన్నారు. ప్రభుత్వానికి కళ్లు తెరిపించడం కోసం జనసేన శ్రేణులు, నాయకులు మనవంతు సాయంగా భవన నిర్మాణ కార్మికుల కోసం ఆహార సదుపాయాన్ని ఏర్పాటు చేసారని వివరించారు. భవన నిర్మాణ కార్మికులు ఎవ్వరూ కూడా ఆత్మహత్యలకు పాల్పడి వారి కుటుంబాలను అనాధలు చేయొద్దని పవన్ పిలుపునిచ్చారు.

ఎవరీ డొక్కా సీతమ్మ.. ఎందుకు ఉచిత భోజనాలు పెట్టింది..
డొక్కా సీతమ్మ తూర్పుగోదావరి జిల్లా రామచంద్రాపురం తాలుకా మండపేటలో 1841 అక్టోబరులో జన్మించారు. పాత రోజుల్లో స్త్రీలు విద్య నేర్చుకునే అవకాశం లేకపోవడంతో, సీతమ్మ పెద్దబాలశిక్ష వరకు మాత్రమే చదువుకున్నారు. ఇక సీతమ్మ అత్తింట్లో అడుగు పెట్టగానే ఇంటి పేరు కూడా మారిపోయింది. లంక గన్నవరం గోదావరి మార్గం మధ్యలో ఉండటంతో, వచ్చే పోయే ప్రయాణికులు ఎక్కువగా ఉండేవారు. కొందరు ఆకలితో అలమంటించేవారట. అప్పటి నుంచి సీతమ్మ ఆమె భర్త జోగన్న దంపతులు వారి ఆకలి తీర్చేవారు. ఎవరు ఏ సమయంలో వచ్చి భోజనం అడిగినా లేదనరు. ఆదరించి అన్నం పెట్టేవారు. లంక గ్రామాల్లో తరచు వచ్చే అతివృష్టి, అనావృష్టిలతో ఇబ్బందులు పడే ఆ గ్రామాల పేదలను ఆదుకున్నారు, వచ్చిన వారికి లేదనకుండా అన్నం పెట్టేవారు.

బ్రిటిష్ చక్రవర్తి నుంచి పిలుపు.. తిరస్కరించిన సీతమ్మ..
ఓసారి డొక్కా సీతమ్మ గొప్పతన గురించి తెలుసుకున్న బ్రిటీష్ 7వ ఎడ్వర్డ్ చక్రవర్తి పట్టాభిషేకం వార్షికోత్సవానికి రావాలని 1903లో ఆమెకు ఆహ్వానం పంపారట. సీతమ్మ తాను రాలేను.. క్షమించని కోరారట. ఐతే కనీసం ఆవిడ ఫోటోని పక్కన పెట్టుకుని పట్టాభిషేకం చేయించుకుందామనుకున్న చక్రవర్తి అప్పట్టో తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ కు లేఖ రాసారట. తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ ఆమె ఫోటో కోసం వెళితే తిరస్కరించారట. బ్రిటీష్ ప్రభువుల ఆదేశాలని, ఫోటో తీయించుకోకపోతే తన ఉద్యోగం పోతుందని చెప్పడంతో ఆమె ఒప్పుకున్నారట. తర్వాత ఆ బ్రిటిష్ చక్రవర్తి ఓ సోఫాలో సీతమ్మ ఫోటో పెట్టి నమస్కరించి, పట్టాభిషేకం చేసుకున్నారట. ఆవిడకి పంపించిన పత్రం కూడా ఇప్పటికీ ఉందని చెబుతుంటారు. అందుకే ఆమె పేరుతో జనసేన ఇప్పుడు ఆహార శిబిరాలు ఏర్పాటు చేశారు.












Click it and Unblock the Notifications