జగన్! ప్రజల ప్రాణాలంటే లెక్కలేదా?: ‘కరోనా-పారాసిటమాల్’పై చంద్రబాబు ఫైర్
హైదరాబాద్: ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనావైరస్ పట్ల ఏపీలోని వైఎస్ జగన్ సర్కారు అత్యంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ధ్వజమెత్తారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో సోమవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.

పారాసిటమాల్ చాలా?
సీఎం జగన్ తన మొండి వైఖరి, వితండవాదం వీడి రాష్ట్రంలోని 5 కోట్ల మంది ప్రజల కోసం ఆలోచించాలని చంద్రబాబు సూచించారు. కరోనావైరస్ ప్రభావంపై రాబోయే రెండు మూడు వారాలు చాలా కీలకమని అన్నారు. దేశంలో కరోనా వ్యాప్తి చెందితే అదుపుచేయడం కష్టమని నిపుణులు హెచ్చరిస్తున్నారని చంద్రబాబు గుర్తు చేశారు.
కరోనాకు పారాసిటమాల్, బ్లీచింగ్ పౌడర్ చాలని జగన్ అనడాన్ని జాతీయ మీడియా కూడా తప్పుబట్టిందని చెప్పారు. కరోనావైరస్ విషయంలో 4 వారాలపాటు ఎలాంటి సమస్య ఉండదని సీఎస్ అంటున్నారని, సీఎస్కు దీనిపై అవగాహన ఉందా? అని చంద్రబాబు ప్రశ్నించారు.

ప్రజల ఆరోగ్యంతో ఆటలా?
కరోనా బారిన పడకుండా ప్రజలు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని, కరోనావైరస్ పూర్తిగా లేదని ప్రకటించేవరకు ప్రజలు జాగ్రత్తలు పాటించాలని చంద్రబాబు సూచించారు. కరోనా నివారణ కోసం చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని చంద్రబాబు డిమాండ్ చేశారు. ప్రజల ఆరోగ్యంతో ఆడుకుంటారా? అని నిలదీశారు.

ప్రజల ప్రాణాలంటే లెక్కేలేదు..
ఇతర దేశాలు, రాష్ట్రాల నుంచి వచ్చినవారి గురించి జాగ్రత్తలు తీసుకుంటున్నారా? అని ప్రశ్నించారు. స్థానిక ఎన్నికలకు వెళ్లాలని సీఎం జగన్ ఇంకా ఎలా ఆలోచిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల్లో గెలిచాం అనిపించుకోవాలనే తపన తప్ప.. ప్రజల ప్రాణాలంటే సీఎం జగన్మోహన్ రెడ్డికి లెక్కలేదని మండిపడ్డారు
చంద్రబాబు. రెండు నెలలు వాయిదా వేస్తే ఏమవుతుంది? అని ప్రశ్నించారు. మహారాష్ట్ర, పశ్చిమబెంగాల్లో అన్ని ఎన్నికలను రద్దు చేస్తున్నారని చంద్రబాబు తెలిపారు.

ఆ విషయం జగన్కు తెలుసా?
6,777 మంది విదేశీయులు వచ్చారని, వారి అడ్రస్ లు ఉన్నాయా? అని నిలదీశారు. సుప్రీంకోర్టు కూడా రోజువారీ కేసుల సంఖ్యను తగ్గించుకుంటోందని తెలిపారు. విదేశాల నుంచి వచ్చిన వారిని 14 రోజులు పరీక్షించాలని మీకు తెలుసా? అని జగన్మోహన్ రెడ్డిని నిలదీశారు. కరోనా నియంత్రణకు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు.












Click it and Unblock the Notifications