నవ్వులపాలైన తెలుగువారు! బీహార్ ఆఫ్ సౌత్: జగన్ ఏడాది పాలనపై చంద్రబాబు రిపోర్ట్
అమరావతి: ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏడాది పాలనపై మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. జగన్ చేతకాని పాలనతో దేశ విదేశాల్లో తెలుగువారు నవ్వులపాలయ్యారని విమర్శించారు.

చేతగాని పాలకులతో నవ్వులపాలే..
‘వాటాల కోసం బెదిరించి పెట్టుబడిదారులను తరిమేశారు. దావోస్ సదస్సులో గతంలో ప్రధాన ఆకర్షణగా ఉన్న ఏపిని, వేధింపులకు వేదికగా చేశారు. పాలకులు బాధ్యతగాప్రవర్తిస్తేనే ప్రజలకు మేలు. ఇలాంటి చేతగాని పాలకులైతే రాష్ట్రం నవ్వుల పాలే' అని చంద్రబాబు మండిపడ్డారు.

వైసీపీ అరాచకాలతో..
‘రివర్స్ టెండరింగ్, పీపీఏల రద్దు, 3 రాజధానులు, కౌన్సిల్ రద్దు.. చర్యలతో రివర్స్ పాలన, తుగ్లక్ 2.0 అన్నారు. గతంలో ఎవరైనా పెట్టుబడులు పెట్టడానికి వస్తే ఏపీని చూపించేవారు. ఇప్పుడు వైసీపీ అరాచకాలతో దేశానికే పెట్టుబడులు రాని దుస్థితి ' అని చంద్రబాబు దుయ్యబట్టారు.

బీహార్ ఆఫ్ సౌత్.. గవర్నమెంట్ టెర్రరిజం..
‘5 ఏళ్ల తెలుగుదేశం పాలనలో ఏపీ 667 అవార్డులను సాధించింది. అలాంటిది ఈ రోజు చేతగాని పాలన కారణంగా దేశ విదేశాల్లో తెలుగువారు నవ్వులపాలు అయ్యారు. వైసీపీ నేతల దౌర్జన్యాలను చూసి "బీహార్ ఆఫ్ సౌత్" అని, "గవర్నమెంట్ టెర్రరిజం" అని అంటున్నారు' అని చంద్రబాబు తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
టీడీపీ హయాంలో ఇలా..
‘విభజన తర్వాత రూ.16,000 కోట్ల లోటు బడ్జెట్ లో కూడా ఆంధ్రప్రదేశ్, తెలుగుదేశం పాలనలో తలెత్తుకునేలా ఎదిగింది. 5ఏళ్లు వరుసగా డబుల్ డిజిట్ గ్రోత్ సాధించింది. పెట్టుబడుల గమ్యస్థానం అయ్యింది. అనేక రంగాలలో దేశంలో నెంబర్ 1 గా మారింది' అని చంద్రబాబు వ్యాఖ్యానించారు.
తుగ్లక్ నిర్ణయాలతో పెట్టుబడిదారులు పారిపోయే..
‘పీపీఏ ఒప్పందాలు రద్దు చేసి అంతర్జాతీయ పెట్టుబడిదారులు రాష్ట్రం వైపు చూడాలంటేనే భయపడేలా చేసారు.లూలూ,అదానీ లాంటి సంస్థలను బెదిరించి వెనక్కి పంపి యువత భవిత పై కొట్టారు. ప్రిజనరీ దెబ్బకి జాతీయ స్థాయిలో రాష్ట్ర పరువు గంగలో కలిసిపోయింది.మూడు ముక్కల రాజధాని లాంటి తుగ్లక్ నిర్ణయాలతో పెట్టుబడిదారులు పారిపోయేలా చేసారు' అంటూ టీడీపీ నేత నారా లోకేష్ ధ్వజమెత్తారు.












Click it and Unblock the Notifications