సీఎం జగన్కు చిరంజీవి, నాగార్జున కృతజ్ఞతలు .. సినీ పరిశ్రమ కోసం ఏపీ సర్కార్ నిర్ణయమే కారణం
ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి మెగాస్టార్ చిరంజీవి, అక్కినేని నాగార్జున ల తో పాటుగా పలువురు సినీ ప్రముఖులు కృతజ్ఞతలు తెలిపారు. ఏపీ సర్కార్ తీసుకున్న నిర్ణయంపై హర్షం వ్యక్తం చేశారు. సినీ పరిశ్రమకు అండగా నిలుస్తున్న ఏపీ ప్రభుత్వం తాజాగా తీసుకున్న నిర్ణయాన్ని అందరూ స్వాగతించారు.

కరోనా కారణంగా కోలుకోని సినీ పరిశ్రమ
కరోనా మహమ్మారి కారణంగా సినీ పరిశ్రమ తీవ్రంగా కుదేలైంది . గతేడాది కరోనా మహమ్మారి కారణంగా విధించిన లాక్ డౌన్ నాటినుండి నేటి వరకు సినీ పరిశ్రమ కోలుకోలేదు. మధ్యలో కరోనా కేసులు తగ్గుదల నేపథ్యంలో లాక్డౌన్ నుండి సడలింపులు ఇచ్చినప్పటికీ సినిమా పరిశ్రమలో మాత్రం కరోనా వెంటాడుతూనే ఉంది. ఇక థియేటర్ల మాట సరేసరి . ఇప్పటివరకు థియేటర్లు పూర్తిస్థాయిలో నడిచిన దాఖలాలు కూడా లేవు.

సినీ పరిశ్రమకు ఊతం ఇచ్చేందుకు జగన్ సర్కార్ నిర్ణయం
ఈ సమయంలో కరోనాతో భారీగా దెబ్బతిన్న, తీవ్రంగా కుదేలైన సినీపరిశ్రమకు ఊతం ఇచ్చేందుకు ఏపీ సర్కార్ నిర్ణయం తీసుకుంది.
జగన్ సర్కార్ తీసుకున్న నిర్ణయం లో భాగంగా సినిమా థియేటర్ లకు సంబంధించి విద్యుత్ చార్జీలు, వడ్డీ రాయితీలను మరికొంత కాలం పొడిగిస్తూ ప్రభుత్వం తన నిర్ణయాన్ని ప్రకటించింది. ఏప్రిల్ , మే, జూన్ నెలల్లో విద్యుత్ ఫిక్స్ డ్ ఛార్జీలకు మినహాయింపునిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులను జారీ చేసింది. ఈ నిర్ణయంతో సినిమా థియేటర్ల యజమానులకు భారీ ఊరట లభించనుందని సినీ వర్గాలు భావిస్తున్నాయి.

జగన్ సాయం తో వేలాది కుటుంబాలకు ఊరట దొరికిందన్న చిరంజీవి
ఈ నేపథ్యంలోనే సినీ పరిశ్రమను ఆదుకోవడానికి సీఎం జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయానికి కృతజ్ఞతలు తెలిపారు సినీ ప్రముఖులు. ట్విట్టర్ వేదికగా స్పందించిన చిరంజీవి సినీ కళాకారులను ఆదుకున్న ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డికి కృతజ్ఞతలు అంటూ పేర్కొన్నారు. కరోనా విపత్కర సమయంలో సినీ పరిశ్రమను ఆదుకోవడానికి ఆయన తీసుకున్న చొరవను మెగాస్టార్ చిరంజీవి ప్రశంసించారు. ఏపీ సీఎం జగన్ సాయంతో వేలాది కుటుంబాలకు ఊరట లభించింది అంటూ చిరంజీవి ట్వీట్ చేశారు.

సీఎం జగన్ కు అక్కినేని నాగార్జున కృతజ్ఞతలు
ఇక సీఎం జగన్మోహన్ రెడ్డి నిర్ణయాన్ని స్వాగతిస్తూ, ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు నాగార్జున. ట్విట్టర్ వేదికగా స్పందించిన నాగార్జున విద్యుత్ చార్జీలకు రాయితీ ఇచ్చి కరోనా మహమ్మారి విజృంభిస్తున్న విపత్కర సమయంలో సినిమా హాల్స్ యజమానులకు భారీ ఊరట ఇచ్చారని, ఏపీ సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి కి కృతజ్ఞతలు అంటూ ట్వీట్ చేశారు .












Click it and Unblock the Notifications