హాయ్ ల్యాండ్ ఎండీకి అగ్రిగోల్డ్ ఉచ్చు.. అర్ధరాత్రి సీఐడీ అటాక్
విజయవాడ : హాయ్ ల్యాండ్ ఎండీ అల్లూరి వెంకటేశ్వరరావును సీఐడీ అధికారులు అరెస్ట్ చేశారు. బుధవారం రాత్రి అదుపులోకి తీసుకున్నారు. హాయ్ ల్యాండ్ తో పాటు అగ్రిగోల్డ్ ప్రాపర్టీ వేలం ప్రక్రియను అడ్డుకునే ప్రయత్నం చేశారనేది అభియోగం. అగ్రిగోల్డ్ ఛైర్మన్ అవ్వా వెంకటరామారావుతో కలిసి వేలం ప్రక్రియను అడ్డుకోవాలని కుట్ర పన్నారని సీఐడీ అధికారులు గుర్తించారు. దీంతో అగ్రిగోల్డ్ కేసులో అల్లూరి వెంకటేశ్వరరావును నిందితుడిగా చేర్చారు. గురువారం కోర్టులో హాజరుపరిచే అవకాశముంది.
అల్లూరి వెంకటేశ్వరరావు హాయ్ ల్యాండ్ ( ఆర్కా లీజర్ అండ్ ఎంటర్టైన్మెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ ) తో పాటు ఇతర పద్దెనిమిది కంపెనీల్లో డైరెక్టర్, అడిషనల్ డైరెక్టర్ లాంటి హోదాల్లో ఉన్నారు. అయితే ఈ కంపెనీలన్నీ కూడా అగ్రిగోల్డ్ గ్రూపులో అంతర్భాగమేనని తెలుస్తోంది. వీటిని డొల్ల కంపెనీలుగా కూడా గుర్తించారు అధికారులు. పధ్నాలుగు కంపెనీలకు సంబంధించి అగ్రిగోల్డ్ కేసుల్లో నిందితులైన అవ్వా వెంకటశేషు నారాయణరావు, అవ్వా సీతారామావు, అవ్వా హేమసుందర వరప్రసాద్, కామిరెడ్డి శ్రీరామచంద్రరావు, సవడం శ్రీనివాస్ తదితరులు డైరెక్టర్లుగా ఉన్నారు.
ఆకర్షణనీయమైన స్కీములతో అగ్రిగోల్డ్ సంస్థ ప్రజలను మోసం చేసింది. వివిధ రూపాల్లో కోట్ల రూపాయల డిపాజిట్లు సేకరించింది. అయితే ఈ సొమ్మునంతా దాదాపు 156 డొల్ల కంపెనీలకు మళ్లించినట్లు గతంలోనే సీఐడీ గుర్తించింది. ఇప్పటికే 26 మందిని నిందితులుగా చేర్చిన సీఐడీ.. తాజాగా అల్లూరి వెంకటేశ్వరరావు అరెస్ట్ చేయడంతో వారి సంఖ్య 27కు చేరింది.