విజయవాడకు గుడ్న్యూస్- తగ్గుతున్న కరోనా- రాష్ట్రంలో చివరి స్ధానంలో కృష్ణాజిల్లా...
విజయవాడ : ఏపీలో ఇప్పటికీ రోజుకు 8 వేలకు పైగా కొత్త కరోనా కేసులు నమోదవుతున్నాయి. దాదాపు 80 నుంచి 90 మంది ప్రాణాలు కోల్పోతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో కరోనా విజృంభణ కొనసాగుతున్నా విజయవాడలో మాత్రం కరోనా తిరోగమనం దిశగా సాగుతోంది. గత పది రోజులుగా కృష్ణాజిల్లా రాష్ట్రంలో కరోనా కేసుల్లో చివరి స్ధానంలో నిలవడంతో అధికారులతో పాటు జనం కూడా ఊపిరి పీల్చుకుంటున్నారు. విజయవాడపైనా దీని ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. గతంలో రెడ్జోన్లతో కనిపించిన నగరంలో ఇప్పుడు చాలా చోట్ల సాధారణ పరిస్ధితులు కనిపిస్తున్నాయి.

కరోనాను జయిస్తున్న కృష్ణాజిల్లా...
రాష్ట్రంలో కరోనా ప్రభావం మొదలయ్యాక అత్యంత ఎక్కువగా ఇబ్బందులు ఎధుర్కొన్న జిల్లాల్లో కృష్ణాజిల్లా ఒకటి. నెల రోజుల క్రితం కూడా రోజుకు 800 కేసుల వరకూ నమోదయ్యేవి. ఓ దశలో పొరుగున ఉన్న గుంటూరు జిల్లాతో పాటు కర్నూలుతోనూ పోటీ పడిన కృష్ణా జిల్లాలో అధికారులు చేపట్టిన కరోనా నియంత్రణ చర్యలు సత్ఫలితాలు ఇస్తున్నాయి. దీంతో వరుసగా పది రోజుల నుంచి రాష్ట్రంలో
కరోనా కేసుల్లో కృష్ణా జిల్లా చివరి స్ధానంలో కొనసాగుతోంది. తాజాగా నిన్న విడుదల చేసిన బులిటెన్లోనూ జిల్లాలో కేవలం 263 కేసులు మాత్రమే నమోదయ్యాయి. రాష్ట్ర్లంలోని చిత్తూరు జల్లాలో అత్యధికంగా 981 కేసులు నమోదైతే చివరి స్ధానంలో ఉన్న కృష్ణాజిల్లా 250 కేసులకు అటు ఇటుగా ఉంటడం అధికారులతో పాటు సాధారణ ప్రజలకు సంతోషాన్నిస్తోంది.

ఊపిరి పీల్చుకుంటున్న బెజవాడ...
ఒకప్పుడు కరోనా ప్రారంభం కాగానే జిల్లాలో కేసులకు విజయవాడ కేంద్ర బిందువుగా నిలిచింది. విజయవాడలోనే రోజుకు వందలాది కేసులు నమోదయ్యేవి. ఇక్కడ కరోనా సోకిన వారు జిల్లాలో అన్ని ప్రాంతాలకు రాకపోకలు సాగిస్తూ వైరస్ వ్యాప్తి చేశారన్న అరోపణలు కూడా వచ్చాయి. కానీ వీటిని కేస్ స్టడీగా తీసుకుని మరీ అధికారులు సాగించిన యజ్ఞం ఇప్పుడు సత్ఫలితాలు ఇస్తోంది. దీంతో విజయవాడలోనూ కేసుల తీవ్రత తగ్గిపోయింది. నగరంలో ఒకప్పుడు కనిపించిన రెడ్ జోన్ల సంఖ్య కూడా భారీగా తగ్గింది. ప్రస్తుతం రోజుకు వంద కేసుల్లోపే నమోదవుతుండటం, అవి కూడా రోగుల ప్రైమరీ కాంటాక్టుల నుంచి కావడం వంటి అంశాలు అధికారులకు ఊరట నిస్తున్నాయి. దీంతో నగరంలో రాకపోకలపై నియంత్రణకు కూడా పూర్తిగా సడలించారు.

ఫలిస్తున్న కౌంటర్ వ్యూహం..
ప్రస్తుత రాజధాని పరిధిలోకి వచ్చే కృష్ణాజిల్లాలో ఆరంభంలో వరుసగా భారీ కేసులు నమోదు కావడంతో ఓ దశలో వాటికి కేంద్ర బిందువుగా నిలిచిన విజయవాడకు జిల్లాలో ఇతర ప్రాంతాల నుంచి రాకపోకలు నిలిపేశారు. పక్కా వ్యూహంతో పొరుగున అత్యధిక కేసులు నమోదవుతున్న గుంటూరు జిల్లాకు సంబంధాలను తెంచేశారు. కృష్ణానదిపై ఉన్న వారధితో పాటు ప్రకాశం బ్యారేజ్పైనా రాకపోకలు నియంత్రించారు. హైదరాబాద్ హైవేపై ఉన్న గరికపాడు చెక్పోస్టు వద్ద కూడా ఈ-పాస్ నియంత్రణలు కట్టుదిట్టం చేశారు. దీంతో సహజంగానే కృష్ణాజిల్లాలో కరోనా వ్యాప్తి తగ్గింది. దీని ప్రభావం గత పది రోజులుగా స్పష్టంగా కనిపిస్తోంది.

కరోనా పరీక్షల్లోనూ టాప్..
విజయవాడ, కృష్ణాజిల్లాకు ఉన్న ప్రాధాన్యాన్ని దృష్టిలో ఉంచుకుని నగరంలో తొలుత రోజుకు వెయ్యి పరీక్షల నుంచి ప్రారంభించి ఇప్పుడు వేలల్లో పరీక్షలు నిర్వహించే పరిస్ధితికి తీసుకొచ్చారు. కోవిడ్ కేర్, కోవిడ్ ఆస్పత్రులతో పాటు సంజీవని బస్సుల్లోనూ విరివిగా పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఇంత భారీ ఎత్తున పరీక్షలు నిర్వహిస్తున్న జిల్లా కూడా మరొకటి లేదు. దీంతో సహజంగానే కేసులు ఎక్కువగా బయట పడటం, వారిని ఓ పద్ధతి ప్రకారం ఆస్పత్రులకు తరలించడం, ఆ తర్వాత ఇళ్లకు పంపినా వాలంటీర్ల సాయంతో ఇతరులతో కాంటాక్ట్ కాకుండా చూడటం వంటి చర్యలతో పరిస్ధితిని దాదాపుగా అదుపులోకి తీసుకొచ్చారు. దీంతో ఇప్పుడు జనం ఊపిరి పీల్చుకునే పరిస్ధితి వచ్చింది.












Click it and Unblock the Notifications