జగన్జీ! భక్తులు శాపనార్థాలు పెడుతున్నారు: కనకదర్గమ్మ సన్నిధిలో అలాంటి నినాదాలు: సోము ఫైర్
విజయవాడ: విజయదశమి పర్వదినాన్ని పురస్కరించుకుని ఇంద్రకీలాద్రి పోటెత్తింది. కనక దుర్గమ్మ అమ్మవారిని దర్శించుకోవడానికి వేలాదిమంది భక్తులు ఇంద్రకీలాద్రికి చేరుకున్నారు. సుదూర ప్రాంతాల నుంచి అమ్మవారి సన్నిధికి చేరుకుంటున్నారు. విజయదశమి నాడు కనకదుర్గమ్మను దర్శించుకుని దీక్షను విరమించే భవానీ మాలధారణ చేసిన భక్తులు కూడా వందల సంఖ్యలో ఒకేసారి ఆలయానికి చేరుకున్నారు. ఫలితంగా- శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం క్రిక్కిరిసిపోయింది.

గంటల కొద్దీ క్యూ లైన్లలో..
భక్తుల సంఖ్యకు అనుగుణంగా దేవస్థానం అధికారులు ఏర్పాట్లను చేయడంలో విఫలం అయ్యారు. ఆహారం, నీటి వసతిని కల్పించినప్పటికీ.. క్యూ లైన్ల నిర్వహణ అధ్వాన్నంగా మారింది. గంటల కొద్దీ క్యూలైన్లలో వేచి ఉండాల్సిన పరిస్థితిని ఎదుర్కొన్నారు. అరకొర సౌకర్యాలను దేవస్థానం అధికారుల దృష్టికి తీసకెళ్లినప్పటికీ.. ఎలాంటి స్పందన రాలేదనే ఆరోపణలు ఉన్నాయి. విజయదశమి నాడు అమ్మవారిని దర్శించడానికి వచ్చిన ప్రముఖుల సేవలో దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానం అధికారులు నిమగ్నం అయ్యారు.
ప్రముఖుల సేవలో..
సాధారణ భక్తులు, దర్శనం టికెట్లను కొనుగోలు చేసిన వారిని పట్టించుకోకుండా.. ప్రముఖులకు అమ్మవారి దర్శన భాగ్యాన్ని కల్పించడానికి ప్రాధాన్యత ఇవ్వడం పట్ల తీవ్ర అసహనం వ్యక్తమైంది. క్యూలైన్లలో గంటల కొద్దీ వేచి ఉన్న భక్తులు ఒక్కసారిగా ఆగ్రహోదగ్రులయ్యారు. అధికారులపై నిప్పులు చెరిగారు. తాము ఆరు గంటల పాటు క్యూలైన్లలోనే వేచి ఉన్నామని, ఇప్పటిదాకా అమ్మవారిని దర్శించే భాగ్యం కలగలేదని మండిపడ్డారు.
టికెట్లు కొన్నా ఫలితం లేదా..
తాము దర్శనం టికెట్లను కొనుగోలు చేసినప్పటికీ.. అవి వృధా అయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. టికెట్లు ఉన్నా దేవస్థానం అధికారులు పట్టించుకోవట్లేదని, దర్శనానికి అనుమతి ఇవ్వట్లేదని ఆరోపించారు. ప్రముఖులకు దర్శనాలను కలగిస్తుండటం వల్ల తమ క్యూలైన్లను గంటలపాటుగా నిలిపివేశారని ధ్వజమెత్తారు. ప్రభుత్వానికి, అధికార యంత్రాంగానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తు నినాదాలు చేశారు. తాము కొనుగోలు చేసిన టికెట్లను చూపిస్తూ తమ నిరసనలను తెలియజేశారు.

బీజేపీ ధ్వజం..
ఈ పరిస్థితిని భారతీయ జనతా పార్టీ అందిపుచ్చుకుంది. భక్తుల ఆందోళనకు మద్దతు పలికింది. భక్తుల తరఫున ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. వేలాదిమంది భక్తులు ఇంద్రకీలాద్రికి చేరుకుంటారనే విషయం తెలిసినప్పటికీ.. అధికారులు మాత్రం దానికి అనుగుణంగా ఏర్పాట్లను ఎందుకు చేయలేకపోయారని నిలదీసింది. భక్తులకు కనీస సౌకర్యాలను కల్పించడంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని బీజేపీ నేతలు ఆరోపిస్తోన్నారు.
కనీస సదుపాయాలను కల్పించలేని సర్కార్..
పవిత్ర ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మవారి నామస్మరణ కాకుండా ప్రభుత్వానికి, అధికార యంత్రాంగానికి వ్యతిరేకంగా భక్తుల నోటివెంట నినాదాలు వినాల్సి రావడం దురదృష్టకరమని బీజేపీ రాష్ట్రశాఖ అధ్యక్షుడు సోము వీర్రాజు వ్యాఖ్యానించారు. విజయదశమి నాడు రాష్ట్రం నలుమూలల నుంచే కాకుండా చుట్టుపక్కల రాష్ట్రాల నుంచి కూడా పెద్దఎత్తున భక్తులు, భవానీలు అమ్మవారిని దర్శించడానికి వస్తారని, అలాంటి భక్తులకు కనీస సదుపాయాలను ప్రభుత్వం కల్పించలేకపోయిందని విమర్శించారు.
Recommended Video

చరమగీతం పాడాలంటూ
అమ్మవారి దర్శనానికి వచ్చిన భక్తులకు కనీస ఏర్పాట్లను కూడా కల్పించడంలో జగన్ ప్రభుత్వం విఫలమైందని అన్నారు. జగన్ సర్కార్ చేతగానితనానికి ఇది నిదర్శనమని అని ధ్వజమెత్తారు సోము వీర్రాజు. కరోనా వైరస్ నిబంధనలు, ప్రొటోకాల్స్ పేరిట సామాన్య భక్తులను ఇప్పటికే తిరుమల శ్రీవారి దర్శనానికి ప్రభుత్వం దూరం చేసిందని ఆరోపించారు. వ్యాక్సినేషన్ కార్యక్రమం కొనసాగుతున్నప్పటికీ.. కోవిడ్ ప్రొటోకాల్స్ పేరుతో దేవుడికి భక్తులను విడదీస్తోందని అన్నారు. జగన్ సర్కార్కు చరమగీతం పాడాల్సిన సమయం ఆసన్నమైందని చెప్పారు.












Click it and Unblock the Notifications