అమరావతి బంద్...రైతుల పిలుపు
ఏపీలో రాజధాని రాజకీయం రూపుమారుతోంది. సీఎం జగన్ చేసిన ప్రకటనపై అనుకూల వర్గాలు అమోదం తెలుపుతుండగా... ప్రాంతాలవారిగా ప్రకటనలు వెలువడుతున్నాయి. జగన్ ప్రకటించిన మూడు ప్రాంతాల్లో రాయలసీమ, వైజాగ్ ప్రాంతాల ప్రజలు సంతోషాన్ని వ్యక్తం చేస్తుండగా... ఇన్నాళ్లు అమరావతినే తమ రాజధానిగా ఊహించుకుని, దాని నిర్మాణం కోసం భూములు ఇచ్చిన రైతులు మాత్రం ఆందోళన బాటపట్టారు. ఉదయం అమరావతిలో ఆందోళన చేసిన రైతులు దాన్ని మరింత తీవ్రం చేయనున్నారు.
ఈ నేపథ్యంలోనే గురువారం అమరావతి బంద్కు పిలుపునిచ్చారు. భవిష్యత్ కార్యచరణపై చర్చించేందుకు రైతులు సమావేశం అయ్యారు. ఈనేపథ్యంలోనే బంద్ నిర్ణయాన్ని ప్రకటించారు. రాజధాని ప్రాంతంలోని మొత్తం 29 గ్రామాల ప్రజలు బంద్లో పాల్గోనాలని వారు పిలుపునిచ్చారు.
మరోవైపు వెలగపూడిలోని సెక్రటేరియట్ వద్ద రిలే నిరాహారా దీక్షలు చేయాలని నిర్ణయించారు. సీఎం తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకుని అమరావతిలోనే రాజధాని కొనసాగించాలని వారు డిమాండ్ చేశారు. రాజకీయాల కోసం తమ జీవితాలతో ఆడుకోవద్దని వారు విజ్ఝప్తి చేశారు. రాజధాని మార్చటం అంటే ప్రధాని నరేంద్రమోడీని అవమాన పర్చినట్టేనని వారు ఆవేదన వ్యక్తం చేశారు.