కరోనాలో ఆఖరి స్ధానంలోనే కృష్ణాజిల్లా- ఫలించిన ఐదంచెల వ్యూహం- విమర్శించిన వారే...
ఈ ఏడాది మార్చి నెలలో కరోనా ప్రభావం మొదలయ్యాక అత్యంత ఎక్కువగా ప్రభావితమైన జిల్లాల్లో కృష్ణాజిల్లా కూడా ఒకటి. ఒక్క విజయవాడ నగరంలోనే వందల కేసులు. నగరం నుంచి మిగతా ప్రాంతాలకు తగ్గిపోయిన రాకపోకలు. ఎటు చూసినా కరోనా సూపర్ స్ప్రెడర్లు. అధికారుల మాటను లెక్క చేయని జనం. ఈ పరిస్ధితి నుంచి ప్రస్తుతం రెండు వారాలుగా కృష్ణాజిల్లా కరోనా కేసుల్లో రాష్ట్రంలోనే ఆఖరి స్ధానంలో ఉంటూ వస్తోంది. రెండు నెలల క్రితం కేంద్రం అన్ లాక్ ప్రక్రియ మొదలుపెట్టాక కూడా లాక్ డౌన్ విధించక తప్పని పరిస్ధితుల నుంచి ఇప్పుడు దాదాపుగా కోలుకుని పూర్తి నియంత్రణ సాధించే దిశగా అడుగులేస్తున్న జిల్లా విజయగాథ తెలుసుకోవాల్సిందే.

భయం నుంచి విశ్వాసం దిశగా...
నెల రోజుల క్రితం వరకూ కృష్ణాజిల్లాలో కరోనా దాదాపుగా నియంత్రణలోకి వస్తుందంటే అంతా నవ్వే పరిస్ధితి. ఎందుకంటే అప్పటికే వేల సంఖ్యలో కేసులు నమోదు కావడం, వాటిని నియంత్రించడంలో అధికారులు పడుతున్న అపసోపాలు. ఓ దశలో కలెక్టర్ లాక్డౌన్ ప్రకటించి సీఎం ఆగ్రహంతో రాత్రికి రాత్రే దాన్ని వెనక్కి తీసుకున్న పరిస్ధితి. అయితే ఆ తర్వాత అధికారులు వ్యూహం మార్చారు. నిశిత పరిశీలన మొదలుపెట్టారు. ముఖ్యంగా సీరో సర్వైలెన్స్ సర్వే మొదలుపెట్టాక పరిస్ధితి ఒక్కసారిగా మారిపోయింది. వాటి ఫలితాలను ఆధారంగా చేసుకుని తీసుకున్న చర్యలు పూర్తి ఫలితాన్నిచ్చాయి.

ఐదంచెల వ్యూహంతో కట్టడి...
కరోనా కట్టడి కోసం ప్రస్తుతం రాష్ట్రంలోని అన్ని జిల్లాలో ఏదో ఒక వ్యూహం అమలు చేస్తూనే ఉన్నాయి. అయినా ఇప్పటికీ తూర్పుగోదావరి వంటి చోట్ల ఎంత ప్రయత్నించినా పరిస్ధితి అదుపులోకి రావడం లేదు. ప్రతి రోజూ వెయ్యికి పైగా కేసులతో తూర్పుగోదావరి వంటి జిల్లాల్లో కల్లోలం కొనసాగుతూనే ఉంది. కానీ తూర్పుగోదావరికి ఒక జిల్లా అవతల ఉన్న కృష్ణాజిల్లాలో మాత్రం పరిస్ధితి దాదాపుగా అదుపులోకి వచ్చేసింది. దీని వెనుక అధికారులు అమలు చేసిన పంచముఖ వ్యూహం దాగుంది. ఇందులో నిశిత పరిశీలన, విస్తృత అవగాహన, రెడ్ జోన్ల తగ్గింపు, వ్యాధి నిరోధకత తెలుసుకోవడం, నిబంధనలు కచ్చితంగా పాటించడం వంటి అంశాలు కీలకమయ్యాయి. ఈ ఐదు అంశాలపై జిల్లా యంత్రాంగం సీరియస్గా దృష్టిపెట్టడంతో ఇవాళ జిల్లాలో ప్రజలు స్వేచ్ఛగా రోడ్లపై తిరుగుతున్నారు.

పనికొచ్చిన సీరో సర్వే...
కరోనా ప్రభావం మొదలైన తర్వాత జనంలో పెరిగిన వ్యాధి నిరోధకతను తెలుసుకునేందుకు ప్రభుత్వం ప్రయోగాత్మకంగా నాలుగు జిల్లాల్లో సీరో సర్వైలెన్స్ సర్వే నిర్వహించింది. ఇందులో తూర్పుగోదావరి, అనంతపురం, నెల్లూరుతో పాటు కృష్ణాజిల్లా కూడా ఉంది. మిగతా చోట్ల పరిస్ధితి ఎలా ఉన్నా.. కృష్ణాజిల్లాలో మాత్రం అధికారులు వీటి ఫలితాలను అద్బుతంగా వాడుకున్నారు. వీటి ద్వారా వ్యాధి నిరోధకత ఎక్కువగా ఏయే ప్రాంతాల్లో ఉంది, మిగతా ప్రాంతాల్లో తీసుకోవాల్సిన చర్యలేంటన్న అంశంపై సీరియస్గా దృష్టిపెట్టారు. దీంతో మిగతా ప్రాంతాల్లోనూ పరిస్ధితి క్రమంగా అదుపులోకి రావడం మొదలుపెట్టింది. సీరో సర్వేలో అత్యధిక వ్యాధినిరోధకత నమోదైన జిల్లాగానూ కృష్ణాజిల్లా నమోదు కావడం కూడా వారికి కలిసొచ్చింది.
Recommended Video

రాజధానిలో జగన్ సర్కారు చర్యలు...
కరోనా కేసులు మొదలైన తొలినాళ్లలో రాజధానిని అమరావతి నుంచి విశాఖకు తరలించేందుకు రాజధాని ప్రాంతంలో ఎక్కువ కేసులు చూపిస్తున్నారని, విశాఖలో కేసులు దాచి పెడుతున్నారని విపక్షాలు తీవ్ర ఆరోపణలు చేశాయి. దీన్ని ప్రభుత్వం సీరియస్గా తీసుకుంది. ఓ జిల్లాలో కేసులు ఎక్కువగా ఉండి మరో జిల్లాలో తక్కువగా ఉంటే రాజధాని తరలిస్తారా అంటూ ఎదురుదాడి చేస్తూనే క్షేత్రస్ధాయిలో చర్యలు కట్టుదిట్టం చేసింది. ముఖ్యంగా రాజధాని ప్రాంతంలో ప్రభుత్వానికి చెడ్డపేరు రాకుండా అప్పటికే జరుగుతున్న టెస్టుల సంఖ్యను భారీగా పెంచింది. వీటి ఫలితాలను వెంటవెంటనే రాబట్టడం ద్వారా కరోనా కట్టడి చర్యలను తీవ్రతవరం చేసింది. ఇది కూడా కృష్ణాజిల్లాలో కేసుల సంఖ్యను భారీగా తగ్గేలా చేసింది. దీంతో సహజంగానే విపక్షాల నోళ్లు కూడా మూతపడ్డాయి.












Click it and Unblock the Notifications