రోజానే నయం.. లోకేశ్ ను డైరెక్ట్గా తిడుతుంది: ఈ కేశినేని ఏంట్రా బాబు.. మళ్లీ మధ్యలో బుద్ద.. !!
అమరావతి: తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు, విజయవాడ లోక్సభ సభ్యుడు కేశినేని నాని మరోసారి తన ట్విట్టర్కు పని చెప్పారు. ఆదివారం ఉదయమే ఆయన ఓ వివాదాస్పద ట్వీట్ చేశారు. ఈ ట్వీట్.. అచ్చంగా మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కుమారుడు, మాజీ మంత్రి నారా లోకేష్ను ఉద్దేశించి చేసినదేనని తెలుస్తోంది. మరికొందరు తెలుగుదేశం పార్టీ నాయకులు మాత్రం నారా లోకేష్ను రక్షించే ప్రయత్నం చేస్తున్నారు. కేశినేని నాని చేసిన ట్వీట్లు నారా లోకేష్ను ఉద్దేశించినవి కావని, పార్టీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్నపై ఆయన తన అక్కసును వెల్లబోసుకున్నారని అంటున్నారు. ఏదేమైనప్పటికీ- కేశినేని నాని చేసిన ట్వీట్ మాత్రం తెలుగుదేశం పార్టీలో నిప్పు రాజేసింది.
ఏముందా ట్వీట్లో..
`నాలుగు ఓట్లు సంపాదించలేనివాడు..నాలుగు పదవులు సంపాదిస్తున్నాడు..నాలుగు పదాలు చదవలేనివాడు, నాలుగు వాక్యాలు రాయలేనివాడు ట్వీట్ చేస్తున్నాడు. దౌర్భాగ్యం!` ఇదీ కేశినేని నాని చేసిన ట్వీట్. ఆదివారం ఉదయం తెల్లారుతూనే ఆయన ఈ ట్వీట్ చేశారు. ఇందులో ఆయన రాసిన ప్రతి అక్షరమూ నారా లోకేష్ను ఉద్దేశించి చేసినవేనని అంటున్నారు. నారా లోకేష్ ఆ నాలుగు ఓట్లు సంపాదించలేకపోవడం వల్లే మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గం నుంచి పోటీ చేసి, దారుణంగా ఓడిపోయాడని సాక్ష్యంగా చూపిస్తున్నారు.
నాలుగు పదవులు కూడా లోకేష్వేనా?
ప్రస్తుతం నారా లోకేష్ ఎమ్మెల్సీగా కొనసాగుతున్నారు. దీనికితోడు- చంద్రబాబు హయాంలో మంత్రి పదవిలో పనిచేశారు. అలాగే- పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా వ్యవహరిస్తున్నారు. వాటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని కేశినేని నాని.. లోకేష్ను ఉద్దేశించి నాలుగు పదవులు సంపాదిస్తున్నాడని పరోక్షంగా చురకలు అంటించారని విశ్లేషిస్తున్నారు రాజకీయ పండితులు. కొద్దిరోజులుగా నారా లోకేష్ సోషల్ మీడియాలో చురుగ్గా ఉంటున్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంపై ట్విట్టర్ వేదికగా విమర్శలు చేస్తున్నారు. వైఎస్ జగన్ తీసుకునే ప్రతి నిర్ణయాన్నీ ఆయన తప్పు పడుతున్నారు. అసెంబ్లీ సమావేశాలు, బడ్జెట్ ప్రతిపాదనలపైనా ట్వీట్లు చేశారు. తెలంగాణ ప్రభుత్వం నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి వైఎస్ జగన్ హాజరు కావడాన్నీ తప్పు పట్టారు. వాటన్నింటినీ దృష్టిలో ఉంచుకున్న కేశినేని నాని- `నాలుగు పదాలు చదవలేని వాడు, నాలుగు వాక్యాలు రాయలేని వాడు ట్వీట్ చేస్తున్నాడు..` అని ట్వీట్ ద్వారా ధ్వజమెత్తారని అంటున్నారు.
నాలుగు పదాలు చదవలేని వారెవరబ్బా?
తాను పోటీ చేసిన మంగళగిరి అసెంబ్లీ నియోజకవర్గం పేరును సరిగ్గా ఉచ్ఛరించలేకపోతున్నారనే ఆరోపణలు, విమర్శలు నారా లోకేష్పై ఉన్నాయి. మంగళగిరిని నారా లోకేష్ మందలగిరిగా పిలుస్తారని ఇప్పటికే సోషల్ మీడియాలో సెటైర్లు ఓ రేంజ్లో పడ్డాయి. నాలుగు పదాలు చదవలేని వాడు అనే పదాన్ని లోకేష్ను దృష్టిలో పెట్టుకునే కేశినేని నాని రాసి ఉంటారని విశ్లేషిస్తున్నారు. నిజానికి- కొంతకాలంగా.. ఖచ్చితంగా చెప్పాలంటే- రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ఘోరంగా ఓడిపోయినప్పటి నుంచీ కేశినేని పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. వీలైన ప్రతీసారీ పార్టీని ఇబ్బంది పెట్టేలా వ్యాఖ్యానిస్తున్నారు. దీనికోసం ఆయన సోషల్ మీడియాను ఆశ్రయించారు. పార్టీ నాయకత్వంపై అసంతృప్తిగా ఉంటున్నారు. నర్మగర్భంగా విమర్శిస్తూ వస్తున్నారు. భారతీయ జనతాపార్టీలో చేరతారనే వార్తలు వినిపించినప్పటికీ.. ఆయన దాన్ని తోసిపుచ్చారు. తాను పార్టీ మారట్లేదని తేటతెల్లం చేశారు. అయినప్పటికీ- పార్టీ నాయకత్వాన్ని దృష్టిలో ఉంచుకుని చురకలు అంటిస్తున్నారు.
ఆ వెంటనే మరో ట్వీట్..
నాలుగు ఓట్లకు సంబంధించిన ట్వీట్ సృష్టించిన ప్రకంపనలు తగ్గకముందే- మరోదాన్ని సంధించారాయన. `నిన్నటి దాకా చంద్రబాబు కాళ్ళు..రేపటి నుండి విజయసాయిరెడ్డి కాళ్ళు..కాళ్ళు కాళ్లే, వ్యక్తులు మాత్రమే తేడా!!!` అంటూ ట్వీట్ వేశారు. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నన్ని రోజులూ చంద్రబాబుతో కలిసి తిరిగిన ఓ నాయకుడు తాజాగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత విజయసాయి రెడ్డి వెంట తిరుగే ప్రయత్నం చేస్తున్నారని అంటూ విమర్శించారు. ఆ నాయకుడెవరనేది ఆయన చూచాయగా చెప్పుకొచ్చారే తప్ప బహిర్గతం చేయలేదు. ఈ ట్వీట్ను ఉద్దేశించి చేసిన నాయకుడు తెలుగుదేశం పార్టీ నేతే అనేది ఇక్కడ స్పష్టమైంది.