అవాంఛనీయ ఘటనలు జరిగితే చంద్రబాబుదే బాధ్యత... మంత్రి కన్నబాబు సంచలన వ్యాఖ్యలు..
మూడు రాజధానుల ఏర్పాటును వ్యతిరేకిస్తున్న టీడీపీ అధినేత చంద్రబాబుపై మంత్రి కన్నబాబు విరుచుకుపడ్డారు. హైదరాబాద్లో ఉండి చంద్రబాబు కుట్ర రాజకీయాలకు పాల్పడుతున్నారని... రాష్ట్రంలో అవాంఛనీయ ఘటనలు జరిగితే ఆయనదే బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. గవర్నర్ నిర్ణయాన్ని చంద్రబాబు తప్పు పట్టడం సరికాదని... తక్షణం క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.

వికేంద్రీకరణతోనే అభివృద్ది...
అన్ని ప్రాంతాల అభివృద్ధే ధ్యేయంగా ప్రభుత్వం ముందుకు వెళ్తోందని... కమిటీల నివేదికల ఆధారంగానే మూడు రాజధానులపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని స్పష్టం చేశారు. వికేంద్రీకరణతోనే అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయని చెప్పారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగానే విశాఖలో పరిపాలన రాజధాని, అమరావతిలో శాసన రాజధాని, కర్నూలులో న్యాయ రాజధాని ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు.

చంద్రబాబును అడ్డుకున్నదెవరు...
టీడీపీ హయాంలో చంద్రబాబు రాజధాని కడుతానంటే ఎవరైనా అడ్డుకున్నారా అని కన్నబాబు ప్రశ్నించారు. 2015 నుంచి 2019 వరకు అమరావతిని ఎందుకు అభివృద్ధి చేయలేదని ప్రశ్నించారు. ఐదేళ్ల కాలంలో ప్రజలను మభ్యపెట్టడమే తప్ప చేసిందేమీ లేదన్నారు. రాజధాని అంశంలో కేంద్రం జోక్యం చేసుకోదని... అది రాష్ట్ర పరిధిలోని అంశమని బీజేపీ గతంలోనే చెప్పిందన్నారు. ఒకప్పుడు రాష్ట్రానికి సీబీఐ రావద్దని... కేంద్రానికి జోక్యం చేసుకునే హక్కు లేదన్న చంద్రబాబు... ఇప్పుడు మాత్రం కేంద్రం జోక్యం చేసుకోవాలనడం విడ్డూరంగా ఉందన్నారు.
Recommended Video

చంద్రబాబు క్షమాపణ చెప్పాలి...
ఐదేళ్ల కాలంలో రాజధాని నిర్మాణానికి చంద్రబాబు చేసిందేమీ లేదని... అమరావతి రైతులకు ఆయన వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. టీడీపీ హయాంలో రైతులను బెదిరించి భూములు లాక్కున్నారని ఆరోపించారు. ఓటుకు నోటు కేసుకు భయపడే చంద్రబాబు హైదరాబాద్ నుంచి పారిపోయి వచ్చారని విమర్శించారు. చంద్రబాబు ఏం మాట్లాడినా,ఏం చేసినా తన సొంత ప్రయోజనాలకే తప్ప మరొకటి కాదన్నారు. మూడు రాజధానులను వ్యతిరేకిస్తున్న టీడీపీ ఎమ్మెల్యేలు,ఎంపీలు రాజీనామా చేసి ఎన్నికలకు సిద్దమవాలని సవాల్ విసిరారు.












Click it and Unblock the Notifications