నేను విన్నాను..నేను ఉన్నాను అంటే సరిపోదు: నోటికొచ్చిన హామీలతో అధికారం: జగన్పై పవన్ కల్యాణ్
విజయవాడ: జనసేన అధినేత పవన్ కల్యాణ్.. మరోసారి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, అధికార పార్టీ పెద్దలపై ఘాటు విమర్శలు సంధించారు. తప్పుడు హామీలతో ప్రజలను మభ్య పెట్టి మరీ వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చిందని మండిపడ్డారు. అధికారంలోకి వచ్చాక, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాక.. ఆ హామీలను మరిచిపోయారని ధ్వజమెత్తారు. ప్రభుత్వం మెడలు వంచి హామీలను నెరవేర్చుకుంటామని ఆయన ప్రభుత్వాన్ని హెచ్చరించారు.

రెండో విడత జనవాణి..
రెండో విడత జనవాణి కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. విజయవాడ మాకినేని బసవపున్నయ్య ఆడిటోరియంలో ఈ కార్యక్రమం ఏర్పాటైంది. పవన్ కల్యాణ్, జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్, పలువురు పార్టీ నాయకులు ఇందులో పాల్గొన్నారు. స్థానికుల నుంచి ఆయన ఫిర్యాదులను స్వీకరించారు. అధికార పార్టీకి చెందిన కొందరు నాయకులపై వారు పలు ఆరోపణలు చేశారు.

పలు జిల్లాల నుంచి..
తిరుపతి జిల్లా రేణిగుంట మండలం కరకంబాడి పంచాయతీ పరిధిలో తమ భూమిని వైసీపీ ఎంపీటీసీ కబ్జా చేశారని బాధితులు వాపోయారు. కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, ప్రకాశం, తిరుపతి జిల్లాల నుంచి పలువురు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. తాము ఎదుర్కొంటోన్న ఇబ్బందులు, సమస్యలను పవన్ కల్యాణ్ దృష్టికి తీసుకెళ్లారు. కాంట్రాక్ట్ విద్యుత్ ఉద్యోగులు, దివ్యాంగులు పవన్ కల్యాణ్ను కలిసిన వారిలో ఉన్నారు.

నోటికి వచ్చిన హామీలు..
ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ వారిని ఉద్దేశించి మాట్లాడారు. వైఎస్ జగన్.. తన పాదయాత్ర సమయంలో నోటికి వచ్చిన హామీలను ఇచ్చారని, ఇప్పుడు వాటిని నెరవేర్చలేక చేతులెత్తేశాడని ఆరోపించారు. నేను ఉన్నాను..నేను విన్నాను అంటూ ఇష్టానుసారంగా వాగ్దానాు చేశారని విమర్శించారు. మద్యపాన నిషేధం, సీసీఎస్ రద్దు విస్మరించారని చెప్పారు. నవరత్నాలను ప్రజలకు ఇచ్చేశామని వైసీపీ నాయకులు చెప్పుకొంటూ తిరుగుతున్నారని ధ్వజమెత్తారు.

ప్రభుత్వంపై వ్యతిరేకత..
మొదటి విడత జనవాణి సందర్భంగా 427 ఫిర్యాదులు తమకు అందాయంటే.. ప్రభుత్వం పట్ల ఎంత వ్యతిరేకత ఉందో అర్థం చేసుకోవచ్చని అన్నారు. విద్యుత్ ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలను పరిష్కరిస్తామని వైఎస్ జగన్ తన పాదయాత్ర సమయంలో హామీ ఇచ్చారని, ఇప్పుడు నెరవేర్చారా? అని నిలదీశారు. తెలంగాణలో అక్కడి ప్రభుత్వం క్వాలిఫైడ్ ఉద్యోగులకు 33,858 రూపాయల వేతనాన్ని ఇస్తోందని, దాన్ని ఇక్కడ ఎందుకు అమలు చేయట్లేదని ప్రశ్నించారు.

వచ్చేది మా ప్రభుత్వమే..
విద్యుత్ ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల సమస్యపై ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకోస్తామని పవన్ కల్యాణ్ తేల్చి చెప్పారు. ప్రభుత్వం స్పందించకపోతే.. వచ్చే ప్రభుత్వంలో తామే వాటిని పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. దివ్యాంగుల సమస్యలను సైతం ప్రభుత్వం గాలికి వదిలేసిందని ఆరోపించారు. వారిని కూడా ఇబ్బందులకు గురి చేసేలా ప్రభుత్వం దుర్మార్గంగా పరిపాలన సాగిస్తోందని మండిపడ్డారు. భవిష్యత్తులో తామే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని పవన్ కల్యాణ్ ధీమా వ్యక్తం చేశారు.












Click it and Unblock the Notifications