బెజవాడ ఇంద్రకీలాద్రిపై అపశృతి...అంతరాలయంవలో పూలు కడుతూ కిందపడి యువకుడి మృతి
విజయవాడ ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి ఉత్సవాల కోసం ఏర్పాట్లు వేగంగా సాగుతున్నాయి. ఇంద్రకీలాద్రిపై కొలువైన కనకదుర్గమ్మకు ఈసారి దసరా సందర్భంగా అంగరంగ వైభవంగా అలంకరిస్తున్నారు. ఈ సందర్భంగా ఆలయంలో జరుగుతున్న ఏర్పాట్లలో ఇవాళ ఓ అపశ్రుతి చోటు చేసుకుంది.
ఇంద్రకీలాద్రి అమ్మవారి అంతరాలయంలో రేపటి నుంచి దసరా మహోత్సవాలు సందర్భంగా పూలు కడుతూ పైనుంచి కింద పడి ఒక యువకుడు మృతి చెందాడు. అంతరాలయం మండపంలో పూలు కడుతుండగా.. కాలు జారి ఈ యువకుడు కింద పడినట్లు తెలుస్తోంది. షామియానా సిబ్బందిలో 36 సంవత్సరాల యువకుడు పూలు కట్టడానికి పైకి ఎక్కి సిపాయి బల్ల కదిలి అమ్మవారి ధ్వజస్తంభం దగ్గర పై నుండి నుంచి కింద పడి మృతి చెందాడు. దీంతో అక్కడ విషాద ఛాయలు నెలకొన్నాయి.

సదరు యువకుడు అమ్మవారి అంతరాలయంలో పూలు కడుతూ కింద పడే సమయంలో క్యూ లైన్ లో ఉన్న ఐరన్ రాడ్లపైన పడడంతో తలపై బలమైన గాయం తగిలినట్లు తెలుస్తోంది. వెంటనే అక్కడే ఉన్న ఆలయ సిబ్బంది ఆ యువకుడ్ని ప్రభుత్వ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే మృతి చెందాడు. దీంతో ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ జరుపుతున్నారు. దసరా ఉత్సవాలు రేపటి నుంచే ప్రారంభమవుతున్న నేపథ్యంలో జరుగుతున్న ప్రత్యేక అలంకరణల్లో కొన్ని రోజులుగా ఈ యువకుడు పాల్గొంటున్నట్లు తెలుస్తోంది.
వాస్తవానికి కరోనా నేపథ్యంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అమ్మవారి ఆలయంలో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. వ్యాక్సిన్లుూ వేయించుకున్న వారినే, అదీ డబుల్ డోస్ తీసుకున్న వారిని రోజుకు 10వేల మంది చొప్పునే అనుమతించాలని దేవస్ధానం ఇప్పటికే నిర్ణయించింది. మూలా నక్షత్రం రోజున మాత్రం మరింత మందిని అనుమతించే అవకాశం ఉంది. ఆన్ లైన్ విధానంలో టికెట్లు బుక్ చేసుకున్న వారికే దర్శనానికి అనుమతించబోతున్నారు. మూలా నక్షత్రం రోజున సీఎం జగన్ రాష్ట్ర ప్రభుత్వం తరఫున అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించబోతున్నారు.












Click it and Unblock the Notifications