రోగులకు మరణశిక్ష: కేంద్రంపై భగ్గు: తెలుగు రాష్ట్రాల్లో ఆసుపత్రులు క్లోజ్: డాక్టర్ల నిరసన
హైదరాబాద్/విజయవాడ: రెండు తెలుగు రాష్ట్రాల్లో డాక్టర్లు రోడ్డెక్కారు. కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా ఆందోళనలకు దిగారు. నిరసన ప్రదర్శనలను నిర్వహిస్తున్నారు. ఫలితంగా ప్రైవేటు ఆసుపత్రులు మూత పడ్డాయి. తెల్లవారు జామున నుంచి సాయంత్రం 6 గంటల వరకు బంద్ను పాటిస్తున్నారు. అత్యవసర సేవలకు మినహాయింపునిచ్చారు. అత్యవసర వైద్య సేవలను కొనసాగిస్తున్నారు. కరోనా ప్రొటోకాల్కు అనుగుణంగా కోవిడ్ డిజిగ్నేటెడ్ ఆసుపత్రుల్లో వైద్య సేవలకు ఆ బంద్ నుంచి మినహాయించారు. కోవిడ్ సెంటర్లలో వైద్య సేవలను కొనసాగిస్తున్నారు.

ఆయుర్వేద డాక్టర్లు.. సర్జరీ చేయడానికి
ఆయుర్వేద డాక్టర్లు కూడా సర్జరీలు చేయడానికి కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ మేరకు కొద్దిరోజుల కిందటే ఉత్తర్వులను జారీ చేసింది. దేశంలో ఆయుర్వేద వైద్యానికి పెరుగుతున్న ఆదరణను దృష్టిలో ఉంచుకుని..ఈ నిర్ణయం తీసుకుంది. ఆయుర్వేదంలో పోస్ట్ గ్రాడ్యుయేట్ లేదా డిగ్రీ చేసిన విద్యార్దులు వివిధ రకాల సాధారణ శస్త్రచికిత్సలను చేయడానికి వీలు కల్పించింది. దీనికోసం ఇండియన్ మెడిసిన్ సెంట్రల్ కౌన్సిల్ నిబంధనలను సవరించింది.

12 గంటల పాటు బంద్..
ప్రభుత్వనిర్ణయం ప్రకారం ఇకపై ఆయుర్వేద వైద్యులు స్కిన్ గ్రాఫ్టింగ్, కంటిశుక్లం శస్త్ర చికిత్స, రూట్ కెనాల్ వంటి సాధారణ ఆపరేష్లన్లను చట్టబద్ధంగా నిర్వహించవచ్చు. దీన్ని నిరసిస్తూ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఇచ్చిన పిలుపు మేరకు దేశవ్యాప్తంగా ప్రైవేటు ఆస్పత్రులు బంద్ను పాటిస్తున్నాయి. తెల్లవారు జామున 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు అత్యవసర మినహా అన్ని వైద్య సేవలు నిలిపివేశాయి. విజయవాడ, హైదరాబాద్లల్లో ప్రైవేటు క్లినిక్లేవీ తెరచుకోలేదు. అవన్నీ మూసివేసి కనిపించాయి. సాయంత్రం 6 గంటల తరువాతే అవి మళ్లీ తెరచుకోనున్నాయి.

కిచిడీ వైద్యం..
ఆయుర్వేద వైద్యులు.. అల్లోపతి శస్త్రచికిత్సను నిర్వహించడం చట్టాలకు వ్యతిరేకమని డాక్టర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రజల ప్రాణాలతో ముడిపడి ఉన్న వైద్యరంగంలో ఇలాంటి మతిలేని చర్యలను తీసుకోవడం సిగ్గుచేటు మండిపడుతున్నారు. ఆయుర్వేద వైద్యాన్ని ఆయుర్వేద వైద్యంగానే కొనసాగింపజేయకుండా.. సాధారణ శస్త్రచికిత్సలను నిర్వహించడానికి ఎందుకు హుటాహుటిన గెజిట్ను జారీ చేయాల్సి వచ్చిందని నిలదీస్తున్నారు.

రోగికి మరణశిక్షగా అభివర్ణన..
ఆయుర్వేదాన్ని అల్లోపతితో ముడిపెట్టడం వల్ల కిచిడీ వైద్యం అవుతోందని భగ్గుమంటున్నారు. ఈ ఉత్తర్వులను వెంటనే ఉపసంహరించుకోవాలని డాక్టర్లు డిమాండ్ చేస్తున్నారు. తమ నిరసనను కేంద్ర ప్రభుత్వానికి తెలియజేయాలనే ఉద్దేశంతో బంద్ను పాటిస్తున్నారు. హైదరాబాద్లో నిలోఫర్ ఆసుపత్రి డాక్టర్లు విధులను బహిష్కరించారు. నిరసన ప్రదర్శనలను చేపట్టారు. ప్లకార్డులను ప్రదర్శించారు. కేంద్రానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. శిక్షణ లేని చికిత్సలను నిర్వహించడం రోగికి మరణశిక్ష విధించినట్టేని మండిపడుతున్నారు.












Click it and Unblock the Notifications