నారా లోకేష్లో మ్యాటర్ లేదు..మీటర్ లేదు: చంద్రబాబులో చావుభయం: వల్లభనేని వంశీ
విజయవాడ: తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు కొమ్మినేని పట్టాభిరామ్.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి అసభ్య పదజాలంతో దూషించిన అనంతరం నెలకొన్న పరిణామాలు రాష్ట్ర రాజకీయాలను వేడెక్కించాయి. పట్టాభి చేసిన వ్యాఖ్యలను వ్యతిరేకిస్తూ అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు చేపట్టిన నిరసన ప్రదర్శనలు ఒకవంక.. టీడీపీ నాయకులు పిలుపునిచ్చిన ఆందోళనలు, రాష్ట్ర బంద్ మరోవంక ఉద్రిక్తతలకు దారి తీశాయి.

వైసీపీ నేతల మండిపాటు..
ఈ పరిస్థితులపై వైఎస్ఆర్సీపీ నాయకులు స్పందిస్తున్నారు. తెలుగుదేశానికి, తన పదవికి రాజీనామా చేసిన ఆ పార్టీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్, తిరుపతి లోక్సభ సభ్యుడు డాక్టర్ ఎం గురుమూర్తి, వైఎస్సార్సీపీ రాజ్యసభ సభ్యుడు వీ విజయసాయి రెడ్డి, నరసరావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసులు రెడ్డి తదితరులు ప్రతి విమర్శలకు దిగారు. ప్రత్యారోపణలు చేస్తోన్నారు. చంద్రబాబు డైరెక్షన్లో రాష్ట్రంలో అలజడులకు టీడీపీ నాయకులు తెర తీశారని ధ్వజమెత్తారు.

ఎంతటి నీచానికైనా దిగజారుతారు..
తనకు అధికారం పోయిందనే అక్కసుతో చంద్రబాబు నాయుడు ఇలాంటి కుట్రపూరిత రాజకీయాలకు తెర తీశారని ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్ ఆరోపించారు. తాను అధికారంలో లేకపోతే చంద్రబాబు ఎంతటి నీచానికైనా దిగజారుతాడనే విషయం మరోసారి రుజువైందని అన్నారు. రాష్ట్రం ప్రశాంతంగా ఉండటం చంద్రబాబు ఏ మాత్రం ఇష్టం లేదని, అందుకే కుట్ర పూరితంగా రెచ్చగొడుతున్నారని విమర్శించారు. రాష్ట్రంలో అలజడులకు కారణమౌతున్నారని ఆరోపించారు.

మీటర్ లేదు..మ్యాటర్ లేదు..
నారా లోకేష్ ఓ అప్రయోజకుడని, అలాంటి కొడుకును చూస్తూ చంద్రబాబు బాధను అణచుకోలేకపోతున్నారని వల్లభనేని వంశీ అన్నారు. తన కొడుకును ప్రయోజకుడిని చేయలేక తంటాలు పడుతున్నారని ఎద్దేవా చేశారు. నారా లోకేష్ అనేవాడు నాయకుడు కాలేడని జోస్యం చెప్పారు. నారా లోకేష్లో మీటర్ లేదు..మ్యాటర్ లేదని సెటైర్లు సంధించారు. ఎన్ని జాకీలు, క్రేన్లు పెట్టి లేపాలనుకున్నా అది సాధ్యం కాదని అన్నారు. నారా లోకేష్కు అనుకూలంగా హైదరాబాద్లో కూర్చుని వార్తలు రాయించినంత మాత్రాన అతను నాయకుడు కాలేడని చెప్పారు.

వారసుడిగా ప్రకటించుకోవాలంటే భయం..
ఎన్నికలకు ముందు చంద్రబాబు- కమ్మ సామాజిక వర్గానికి చెందిన పెద్దలందరినీ పిలిపించి.. నారా లోకేష్ను ముఖ్యమంత్రిని చేయాలని బతిమాలుకున్నారని వంశీమోహన్ స్పష్టం చేశారు. తాన స్వయంగా అలాంటి సమావేశాల్లో పాల్గొన్నానని చెప్పారు. అధికారాన్ని కోల్పోయి, ప్రతిపక్షంలో కూర్చున్న తరువాత కూడా చంద్రబాబు అదేరకమైన తాపత్రయం పడుతున్నారని అన్నారు. చంద్రబాబు తన వారసుడిగా నారా లోకేష్ను ప్రకటించుకోవడాన్ని ఎవరూ తప్పు పట్టరని, ఎవరికీ అభ్యంతరం లేదని చెప్పారు.

టీడీపీ ఎలాంటి ప్రయోజనం లేదు..
అది టీడీపీ అంతర్గత విషయమని వ్యాఖ్యానించారు. నారా లోకేష్ను ప్రజలు ఆమోదించలేదని, ఎమ్మెల్యేగా కూడా అతను పనికిరాడంటూ అతణ్ని ప్రజలు చీదరించారని చెప్పారు. నారా లోకేష్ వల్ల టీడీపీకి ఎలాంటి ప్రయోజనం లేదని వంశీమోహన్ అన్నారు. ట్విట్టర్లో నాలుగు లైన్లు రాసుకుంటూ కాలక్షేపం చేసే నారా లోకేష్ను పెట్టుకుని చంద్రబాబు ఏమీ చేయలేక సహనం కోల్పోతున్నారని విమర్శించారు. పైగా చంద్రబాబుకు వయసు మీద పడుతోందని, ఇప్పటికే 74 సంవత్సరాలు వచ్చాయని అన్నారు.

చంద్రబాబులో చావుభయం..
చనిపోయేలోగా తన కొడుకును ముఖ్యమంత్రిని చేయాలని చంద్రబాబు తపించిపోతున్నారని వంశీమోహన్ అన్నారు. ఇంకో అయిదారేళ్లలో తాను చనిపోతాననే భయం పట్టుకుందని, ఆ తరువాత తన సామ్రాజ్యం కుప్పకూలిపోతుందని అనుకుంటున్నారని చెప్పారు. ఆ భయంతోనే రాష్ట్రంలో అలజడులను సృష్టిస్తున్నారని ఆరోపించారు. చంద్రబాబు తదనంతరం నారా లోకేష్ అనే వ్యక్తి.. పాలు, పెరుగు, తోటకూర అమ్ముకుని బతకాల్సిన వాడేనని, ప్రజలు అతణ్ని నాయకుడిగా ఆమోదించరని తేల్చి చెప్పారు.












Click it and Unblock the Notifications