వైసీపీ పాలనలో నామినేషన్ల దాఖలు పెద్ద సమస్య.. బెదిరింపులు, పది రకాల కేసులు : సోము వీర్రాజు ఫైర్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల పోరు అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధానికి తెరతీసింది. పంచాయతీ ఎన్నికల్లో నామినేషన్లు దాఖలు చేయడానికి అధికార పార్టీ నేతలు అడ్డుపడుతున్నారని బెదిరింపులకు పాల్పడుతున్నారని ఇప్పటికే ప్రతిపక్ష పార్టీలు విమర్శలు గుప్పిస్తున్నాయి. ఇదే సమయంలో ఏపీ బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ఏపీ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు.
వైసిపి పాలనలో నామినేషన్ వేయడం పెద్ద సమస్యగా మారిందని రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు సోము వీర్రాజు మండిపడ్డారు.

నామినేషన్లు వెయ్యటానికి వచ్చే వారిపై కేసులు
పంచాయతీ ఎన్నికల్లో ప్రభుత్వం దశావతారాలు అమలు చేస్తోందని విరుచుకుపడిన సోము వీర్రాజు నామినేషన్లు వేయకుండా అడ్డుపడుతున్నారని , తప్పుడు కేసులు బనాయిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు .పోటీ చేయడానికి ముందుకు వస్తే కేసులు పెడతారా అంటూ ప్రశ్నించిన సోము వీర్రాజు ఎన్నికల కమిషన్ ఎన్నికల నిర్వహణకు నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత ప్రభుత్వ యంత్రాంగం సహకరించి తీరాలని స్పష్టం చేశారు.
ఎన్నికల్లో గెలుపొందే అవకాశం ఉన్న తమ మద్దతు దారులపై తప్పుడు కేసులు బనాయిస్తూ ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆయన తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.

బలవంతపు ఏకగ్రీవాల కోసం వైసీపీ బెదిరింపుల పర్వం
విజయవాడ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడిన సోము వీర్రాజు పంచాయతీ ఎన్నికల్లో కచ్చితంగా గెలుస్తారు అని చెప్పుకుంటున్న వైసిపి నాయకులు, ఈ అడ్డదారులు ఎందుకు తొక్కుతున్నారు అంటూ ప్రశ్నించారు. ఈ పాట్లన్నీ ఎందుకు పడుతున్నారు అని నిలదీశారు. ఎన్నికల్లో ఏకగ్రీవం సహజంగా జరగాలి కానీ బలవంతంగా చేయించకూడదని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసిపి ప్రభుత్వ హయాంలో నామినేషన్ వేయడం ఒక పెద్ద అంశంగా మారిపోయిందని నామినేషన్లు వేసే వారిని దాచేస్తున్నారని , కిడ్నాప్ లకు పాల్పడుతున్నారని సోము వీర్రాజు విమర్శలు గుప్పించారు.

వైసీపీ ప్రభుత్వం లో 10 రకాలైన కేసులు పెట్టడానికి ఓ చిట్టా.. అధికారులకు ఆదేశాలు .. అందుకే ఇదంతా ..
వైసీపీ ప్రభుత్వం లో 10 రకాలైన కేసులు పెట్టడానికి ఓ చిట్టా తయారుచేసి అధికారులకు పంపిణీ చేశారని పేర్కొన్న సోము వీర్రాజు అన్యాయంగా ఎస్సీ, ఎస్టీ కేసులు పెడుతున్నారన్నారు . అంతేకాదు రౌడీషీట్లు తెరుస్తారని, అక్రమ వైద్యం పేరుతో తప్పుడు కేసులు బనాయిస్తున్నారని విమర్శలు గుప్పించారు. వైసిపి అక్రమాలపై అధికారులకు ఫిర్యాదు చేసినా, స్వయంగా ఎస్పీకి కంప్లైంట్ చేసిన పట్టించుకోవడం లేదని సోము వీర్రాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక ఈ విషయాన్ని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి దృష్టికి కూడా తీసుకు వెళ్ళామని చెప్పిన సోము వీర్రాజు దమ్ముంటే నిజమైన ఎన్నికలు జరపాలని వైసీపీ ప్రభుత్వానికి సవాల్ విసిరారు.












Click it and Unblock the Notifications