ఎన్నికల వేళ భారీ ట్విస్ట్ - కొత్త పొత్తుతో టీడీపీ: పవన్ నిర్ణయం ఏంటి..!!
ఏపీలో కొత్త పాత్తులు మొదలయ్యాయి. పవన్ ఏం చేస్తారనేది ఆసక్తి కరంగా మారుతోంది.
ఏపీలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు వైసీపీ - టీడీపీకి ప్రతిష్ఠాత్మకంగా మారాయి. వైసీపీ లక్ష్యంగా జనసేన పావులు కదుపుతోంది. ఇదే సమయంలో జరుగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికలను పార్టీలు సెమీ ఫైనల్స్ గా భావిస్తున్నాయి. ఈ ఎన్నికల్లో గెలవటం ద్వారా మానసికంగా పైచేయి సాధించే ప్రయత్నం చేస్తున్నాయి. టీడీపీ - జనసేన పొత్తు ఖాయమని భావిస్తున్న వేళ టీడీపీ కొత్త ట్విస్ట్ ఇచ్చింది. ఈ ఎన్నికల్లో జనసేన వైఖరి పైన స్పష్టత లేదు. దీంతో..టీడీపీ తమ అభ్యర్ధుల గెలుపు కోసం కీలక నిర్ణయం తీసుకుంది.

ఎమ్మెల్సీ ఎన్నికల్లో పరస్పర సహకారం
ఏపీలో కొత్త పాత్తులు మొదలయ్యాయి. ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ గెలవాలనేది టీడీపీ లక్ష్యం. ఇందుకోసం దాదాపు 15 ఏళ్ల తరువాత టీడీపీ మరోసారి వామపక్షాలతో చేతులు కలిపింది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో పరస్పర సహకారానికి రెండు పార్టీలు అంగీకరించాయి. 2009లో ఉమ్మడి రాష్ట్రంలో అప్పుడు టీడీపీ- వామపక్షాలు మహా కూటమిగా కలిసి ఎన్నికల్లో పోటీ చేసాయి. ఆ తరువాత తిరిగి ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికల వేళ పొత్తు తో ముందుకు వెళ్తున్నాయి. ఏపీలో ఈ నెల 13న ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థులను ఓడించి, టీడీపీ, పీడీఎఫ్ అభ్యర్థుల విజయమే లక్ష్యంగా పనిచేయాలని నిర్ణయించారు. తమతో కలిసి వచ్చే వామపక్షాలకు టీడీపీ సహకరిస్తుందని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు స్పష్టం చేసారు. టీడీపీతో ఎన్నికలు- ఓటింగ్ అవగాహన పైన అచ్చెన్నాయుడుతో సహా సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ, పీడీఎఫ్ నేత విఠపు బాలసుబ్రహ్మణ్యం తమ శ్రేణులకు స్పష్టత ఇచ్చారు. అధికారికంగా ప్రకటన చేసారు.

ఓటింగ్ లో అవగాహన..లక్ష్యం ఒక్కటే
పట్టభద్ర ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థులకు మొదటి ప్రాధాన్య ఓటు వేయాలని... పీడీఎఫ్ అభ్యర్థులకు రెండో ప్రాధాన్య ఓటు వేయాలని అచ్చెన్నాయుడు సూచించారు. ఎట్టి పరిస్థితుల్లో వైసీపీ అభ్యర్థులకు ఏ రకమైన ఓటూ వేయరాదని స్పష్టం చేసారు. నిరుద్యోగ, ఉద్యోగ వ్యతిరేక వైసీపీ అభ్యర్థులను ఓడించి, రాష్ట్రాన్ని కాపాడుకుందామని టీడీపీ రాజకీయ తీర్మానం చేసిందని అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. ఉపాధ్యాయులు, పట్టభద్రులు విజ్ఞత ప్రదర్శించి పీడీఎఫ్ అభ్యర్థులకు మొదటి ప్రాధాన్య ఓటు, టీడీపీ అభ్యర్థులకు రెండో ప్రాధాన్య ఓటు వేయాలని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ విజ్ఞప్తి చేశారు.వైసీపీ అభ్యర్థుల్ని ఓడించడం ద్వారా మాత్రమే ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మికవర్గ ప్రజాస్వామిక హక్కుల్ని కాపాడుకోగలమని పీడీఎఫ్ నేత విఠపు బాలసుబ్రహ్మణ్యం పేర్కొన్నారు. తమ అభ్యర్ధులకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని కోరారు. టీడీపీ పట్టభద్రుల అభ్యర్థులకు రెండో ప్రాధాన్య ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు.

పవన్ కల్యాణ్ ఏం చేయబోతున్నారు..
ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఇప్పుడు పొత్తు అవగాహన ఖరారైంది. టీడీపీ-జనసేన పొత్తు ఖాయమని భావిస్తున్న వేళ ఈ నిర్ణయం జరిగింది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో జనసేన వైసీపీకి వ్యతిరేకంగా ఓటు వేయమని స్పష్టత ఇచ్చింది. కానీ, బీజేపీకి వేయాలా..లేదా టీడీపీకి వేయాలా అనేది మాత్రం తన ఓటర్లకు క్లారిటీ ఇవ్వలేదు. జనసేన పొత్తు పైన అధికారంగా తేల్చటం లేదు. ఈ సమయంలో పార్టీకి గెలుపు కీలకంగా భావించిన చంద్రబాబు వ్యూహాత్మకంగా పావులు కదిపారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపు కోసం వామపక్షాలతో ఒప్పందానికి నిర్ణయించారు. ఈ ప్రకటన అచ్చెన్నాయుడుతో చేయించారు. జనసేన మద్దతు దారుల ఓట్లు కూడా సమన్వయం చేసుకుంటామని పార్టీ నేతలు చెబుతున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల వేళ తమ మద్దతు టీడీపీ కోరలేదనేది జనసేన నేతల వాదన. దీంతో..ఇప్పుడు టీడీపీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో వామపక్షాలతో.. అసెంబ్లీ ఎన్నికల్లో తమతో పొత్త దిశగా చేస్తున్న ప్రయత్నాలపై ఇప్పుడు జనసేనాని పవన్ ఏ రకంగా స్పందిస్తారనేది ఆసక్తి కరంగా మారుతోంది.












Click it and Unblock the Notifications