పవన్ కళ్యాణ్కు బీజేపీ క్లాస్, అందులో చంద్రబాబును మించేశాడు: విజయసాయి రెడ్డి తీవ్ర విమర్శలు
అమరావతి: టీడీపీ అధినేత, ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్పై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ విజయసాయి రెడ్డి ట్విట్టర్ వేదికగా తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. చంద్రబాబు తన మనుగడ కోసం ఎంత నీచానికైనా దిగజారుతారని ధ్వజమెత్తారు.

చంద్రబాబు ఎంత నీచానికైనా..
‘బెజవాడ రౌడీలా ప్రవర్తించి పార్టీకి మంచి పేరు తెచ్చావని 40 ఇయర్స్ ఇండస్ట్రీ ఒక ఎమ్మెల్సీని మెచ్చుకుని తన స్వభావాన్ని బయట పెట్టుకున్నాడు. ఇలాంటి వ్యక్తులు రాష్ట్రానికి ఎంత ప్రమాదకారులో ప్రజలకు పూర్తిగా తెలిసిపోయింది. తన మనుగడ కోసం ఎంత నీచానికైనా దిగజారుతాడు' విజయసాయి రెడ్డి తీవ్రంగా విమర్శించాడు.

ఏ గడ్డి కరవడానికైనా..
‘రాజధాని అనే10 లక్షల కోట్ల భారీ రియల్ ఎస్టేట్ వెంచర్ కోసం చంద్రబాబు ఏ గడ్డి కరవడానికైనా సిద్ధమే. విలువలు, సిద్ధాంతాలు లేని వ్యక్తులు వ్యవస్థలన్నిటిని బలితీసుకుంటారు. చంద్రబాబు రాజకీయ జీవితం అంతా ఇలాగే సాగింది. దానికి ఫుల్ స్టాప్ పడిందన్న విషయం తెలుసుకోలేక పోవడం విషాదం' అని విజయసాయి వ్యాఖ్యానించారు.

పవన్ కళ్యాణ్కు బీజేపీ క్లాస్ పీకడంతో..
‘దత్త పుత్రుడు తన అజ్ఞానాన్ని పదేపదే బయట పెట్టుకుంటున్నాడు. రాజధాని మారిస్తే ప్రభుత్వాన్ని కూలుస్తానని ప్రగల్భాలు పలికిన వెంటనే బిజెపి పెద్దలు క్లాస్ పీకినట్టున్నారు. తెలివిలోకి వచ్చి రాజధాని అనేది రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయమని ఒప్పుకున్నాడు. యూ-టర్నుల్లో యజమానిని మించి పోయాడు' అని పవన్ కళ్యాణ్ పై తీవ్రంగా విమర్శించారు. అభివృద్ధి వికేంద్రీకరణ, అన్ని ప్రాంతాల అభివృద్ధి బిల్లు 2020ని సెలెక్ట్ కమిటీకి పంపడమనేది చంద్రబాబు చేసిన కుట్రేనని విజయసాయి రెడ్డి ధ్వజమత్తారు. తన స్వార్థ ప్రయోజనాల కోసం అసెంబ్లీలో ఆమోదం పొందిన బిల్లులను మండలిలో అడ్డుకుంటున్నారని ఎంపీ విజయసాయి రెడ్డి మండిపడ్డారు.

తొలి నుంచీ టీడీపీ కుట్రపూరితమే..
వికేంద్రీకరణపై తొలినుంచి టీడీపీ కుట్రపూరితంగానే వ్యవహరిస్తోందని ఏపీ డిప్యూటీ సీఎం అంజాద్ బాషా ఆరోపించారు. గురువారం అసెంబ్లీలో చర్చ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బిల్లుపై సుదీర్ఘంగా చర్చించిన తర్వాతే మండలికి పంపామని.. మండలిలో బిజినెస్ రూల్స్ ప్రకారం వెళ్లకుండా బిల్లును అడ్డుకోవాలని కొత్త రూల్ 71ని తెచ్చారని అన్నారు. ప్రభుత్వ ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన బిల్లుకు ప్రాధాన్యత ఇవ్వాలని కోరినప్పటికీ.. మండలి ఛైర్మన్ అందుకు విరుద్ధంగా వ్యవహరించారని వ్యాఖ్యానించారు.












Click it and Unblock the Notifications