ఏసీఏ పైన పట్టు బిగించిన విజయ సాయిరెడ్డి..!! తమ వారితోనే కార్యవర్గం: భవిష్యత్ హోదా కోసం..!
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఎన్నికలు రాజకీయ పార్టీలను మరిపించే ఎత్తులు..పై ఎత్తులతో సాగితే..ఆంధ్రా క్రికెట్ అసోషియేషన్ ఎన్నికలు ఏకగ్రీవంగా సాగాయి. అయితే అక్కడా రాజకీయ ప్రమేయం.. ఏసీఏలోనూ అధికార పార్టీ ప్రభావం స్పష్టంగా కనిపించాయి. హెచ్ సీఏలో అజారుద్దీన్ ను గెలిపించి.. వివేక్ ను ఓడించటానికి అధికార పార్టీ సహకరించిందనే వాదన ఉంది. ఇక, ఏసీఏలో మాత్రం అటువంటి ఇబ్బందులు రాకుండా వ్యూహాత్మకంగా కావాల్సిన వారితో ఏకగ్రీవంగా కార్యవర్గం ఏర్పాటు చేసుకున్నారు. ఇందులో ప్రధానంగా అధికార పార్టీలో ముఖ్యమంత్రి జగన్ తరువాతి స్థానంలో ఉంటి అటు ఢిల్లీలో ఇటు అమరావతిలో కీలకంగా వ్యవహరిస్తున్న విజయ సాయి రెడ్డి సీన్ లోకి రాకుండానే చక్కబెట్టారనే ప్రచారం క్రికెట్ విశ్లేషకుల్లో జోరుగా సాగుతోంది. ఏసీఏ కార్యవర్గంలో ఇప్పుడు ఎన్నికైన వారంతా ప్రత్యక్షంగా.. పరోక్షంగా విజయ సాయిరెడికి కావాల్సిన వారేనని చెబుతున్నారు. భవిష్యత్ లో ఇక్కడి నుండి బీసీసీఐ లో వచ్చే అవకాశం సద్వినియోగం చేసకోవటానికే పావులు కదుపుతున్నట్లుగా కనిపిస్తోంది.
ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ కార్యవర్గం ఏకగ్రీవం..
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఎన్నికల్లో ఏర్పడిన ఉత్కంఠ పరిస్థితులను చూసిన వారికి ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ ఎన్నికలు ఏకగ్రీవంగా ఎలా సాధ్యమయ్యానే ప్రశ్న మొదలవుతుంది. గతంలోనూ ఏసీఏ అధ్యక్షుడిగా గంగరాజు..కార్యదర్శిగా మాజీ ఎమ్మెల్యే విష్ణు కుమార్ రాజు ఉన్న సమయంలో నూ కొన్ని వివాదాలు చోటు చేసుకున్నాయి. అయితే.. తాజా ఎన్నికల విషయాన్ని పరిశీలిస్తే ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ కార్యవర్గం ఏకగ్రీవంగా ఎన్నికైంది. ఎటువంటి పోటీ లేకుండా ముందు నుండి వ్యూహాత్మకంగా వ్యవహరించి కావాల్సిన వారే పదవులు దక్కించుకున్నారు. అందులో ఇద్దరు కీలక వ్యక్తులు ముఖ్య భూమిక పోషించారు. కొత్త కార్యవర్గ సభ్యులు నెల 23న జరిగిన ఎన్నికల్లో ఈ ఆరుగురు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మొత్తం 13 జిల్లాల్లోని 29 ఓట్లు పోలింగ్ ద్వారా కార్యవర్గాన్ని ఎన్నుకోవాల్సి ఉంటుంది. అయితే, ఎన్నిక ఏకగ్రీవం కావటంతో ఓటింగ్ అవసరం ఏర్పడలేదు.

విజయ సాయిరెడ్డి చక్రం తిప్పారంటూ ప్రచారం..
ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ కొత్త సభ్యులు.. కార్యవర్గం ఏకగ్రీవ ఎన్నిక వెనుక రాజ్యసభ సభ్యుడు విజయ సాయిరెడ్డి ప్రమేయం ఉందనే ప్రచారం సాగుతోంది. విజయ సాయిరెడ్డి కార్యవర్గం ఏర్పాటులో ఎటువంటి విబేధాలను బయటకు రానీయకుండా ప్రశాంతంగా ఎన్నికొనేలా వ్యూహాన్ని అమలు చేసారు. తనకు దగ్గరి వారికి పదవులు దక్కేలా చేయటంలో సక్సెస్ అయ్యారని చెబుతున్నారు. ఏసీఏ అధ్యక్షుడిగా ఎన్నికైన పి.శరత్చంద్రా రెడ్డి ఒక ప్రముఖ ఫార్మా కంపెనీలో కీలకంగా ఉన్నారు. ఆయన సాయిరెడ్డికి బంధువుగా ఏసీఏ వర్గాలు చెబుతున్నాయి. అదే విధంగా ఉపాధ్యక్షుడిగా వీవీఎస్ఎస్కే యాచేంద్ర, కార్యదర్శిగా వి.దుర్గాప్రసాద్, సంయుక్త కార్యదర్శిగా కేఎస్ రామచంద్రరావులు సైతం విజయ సాయిరెడ్డి ఆశీస్సులతోనే ఎన్నికయ్యారని ఎన్నికైన జి.గోపినాథ్రెడ్డి సైతం విజయ సాయిరెడ్డికి బంధువుగా తెలుస్తోంది. కోశాధికారిగా జి.గోపినాథ్రెడ్డికి ఆయన ఆశీస్సులు ఉన్నట్లు ప్రచారం. ఇప్పుడు ఏసీఏ ద్వారా బీసీసీఐలో పదవులు దక్కే అవకాశం ఉంటుంది. ఆ పదవి కోసమే వీరు ఈ కార్యవర్గం ఏర్పాటు మీద ఆసక్తి చూపినట్లుగా చెబుతున్నారు. గోకరాజు రంగరాజు సైతం తన వారసుడి కోసం ప్రయత్నించినా చివరకు ప్రతిపాదన విరమించుకున్నట్లు తెలిసింది. ఏది ఏమైనా హెచ్ సీఏ ఎన్నికకు భిన్నంగా చాలా ప్రశాంతంగా ఏసీఏ ఎన్నిక జరిగిపోయింది.












Click it and Unblock the Notifications