తేల్చేసిన పవన్ కల్యాణ్... మూడు రాజధానులపై మరోసారి కుండ బద్దలు...
ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం మూడు రాజధానుల బిల్లు పైనే సర్వత్రా చర్చ జరుగుతోంది. అధికార పార్టీ నేతల నుంచి దీనిపై హర్షాతిరేకాలు వ్యక్తమవుతుండగా ప్రతిపక్షాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. తాజాగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ దీనిపై స్పందించారు. రాష్ట్రంలో కరోనా విజృంభిస్తున్న తరుణంలో మూడు రాజధానుల ఏర్పాటుపై ఫోకస్ పెట్టడం అవసరమా అన్నట్లుగా ఆయన వ్యాఖ్యానించారు. అమరావతి రైతులకు అండగా నిలబడుతామని స్పష్టం చేశారు.

కరోనా పరిస్థితుల్లో ఇది సరికాదన్న పవన్...
ప్రస్తుతం రాష్ట్రంలో రోజుకు 10 వేలకు పైగా కేసులు నమోదవుతున్న తరుణంలో ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని భయాందోళనల్లో ఉన్నారని పవన్ అన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో మూడు రాజధానులపై ఏర్పాటుపై కాకుండా.. కరోనా నుంచి ప్రజలను రక్షించడంపై దృష్టి సారిస్తే మంచిదని హితవు పలికారు. . రెండు బిల్లులు గవర్నర్ ఆమోదం పొందిన నేపథ్యంలో ఉత్పన్నమయ్యే రైతుల పరిస్థితిపై జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీలో చర్చించి భవిష్యత్ కార్యాచరణ చేపడతామన్నారు.

జగన్ కూడా అమరావతికి మద్దతు పలికారు...
'గుజరాత్ రాజధాని గాంధీనగర్ను, చత్తీస్ గఢ్ రాజధాని రాయ్పూర్ను మూడున్నర వేల ఎకరాల్లోనే నిర్మించారు. ఏపీలో అమరావతిని కూడా అదే రీతిలో కట్టాలని నిపుణులు చెప్పినా, టీడీపీ ప్రభుత్వం అదేమీ పట్టించుకోలేదు. రైతుల వద్ద నుంచి 33 వేల ఎకరాలు సమీకరించింది. ఆ నిర్ణయాన్ని నాడు ప్రతిపక్ష నేతగా ఉన్న జగన్ కూడా సమర్థించారు. అమరావతిలో అద్భుత రాజధాని నిర్మించాలంటే 33 వేల ఎకరాలు కావాల్సిందేనన్నారు.' అని పవన్ గుర్తుచేశారు.

అమరావతి రైతుల పక్షాన పోరాడుతాం...
33 వేల ఎకరాల్లో రాజధాని నిర్మాణం చేపట్టాలన్న టీడీపీ ప్రభుత్వ నిర్ణయాన్ని అప్పట్లో జనసేన వ్యతిరేకించిందని పవన్ గుర్తుచేశారు. ఆ నిర్ణయాన్ని వ్యతిరేకించింది తమ పార్టీ ఒక్కటే అన్నారు. ఆ భారీ రాజధానిని భవిష్యత్ ప్రభుత్వాలు ముందుకు తీసుకెళ్లకపోతే భూములిచ్చిన రైతుల పరిస్థితి ఏంటని ఆనాడే ప్రశ్నించామన్నారు. తాజాగా సీఆర్డీఏ రద్దు,మూడు రాజధానుల బిల్లులకు గవర్నర్ ఆమోదం నేపథ్యంలో రైతుల పక్షాన పోరాడేందుకు జనసేన సిద్దంగా ఉందన్నారు. నాడు టీడీపీ ప్రభుత్వం రాజధానిని మూడున్నర వేల ఎకరాలకు పరిమితం చేసి ఉంటే రైతులకు ఇవాళ ఈ పరిస్థితి వచ్చేది కాదన్నారు.
Recommended Video

విపక్షాలు ఒక్క తాటి పైకి వస్తాయా..?
మూడు రాజధానుల బిల్లును ప్రతిపక్ష టీడీపీ వ్యతిరేకిస్తోంది. బీజేపీ కూడా అమరావతి రాజధానికే కట్టుబడి ఉన్నామని చెప్తున్నప్పటికీ... భిన్న స్వరాలు వినిపిస్తూనే ఉన్నాయి. ఇక మొదటి నుంచి రాజధాని తరలింపును వ్యతిరేకిస్తున్న జనసేన... ఇప్పుడు కూడా అదే వైఖరితో ఉన్నామని స్పష్టం చేసింది. అయితే అప్పటి టీడీపీ ప్రభుత్వ నిర్ణయాన్ని కూడా తప్పు పట్టడం ద్వారా... తాను చంద్రబాబు మనిషినన్న వైసీపీ విమర్శలకు పవన్ చెక్ పెట్టదలుచుకున్నట్లు స్పష్టమవుతోంది. ఏదేమైనా మూడు రాజధానుల ఏర్పాటుపై ప్రభుత్వం పట్టుదలతో ఉంది. ప్రతిపక్షాలు మాత్రం దీన్ని అడ్డుకునే కార్యాచరణకు సిద్దమవుతున్నాయి. ఈ క్రమంలో అన్ని విపక్ష పార్టీలు ఒక్క తాటి పైకి వచ్చినా ఆశ్చర్యం లేకపోవచ్చు. ఈ నేపథ్యంలో మున్ముందు పరిణామాలపై ఆసక్తి నెలకొంది.












Click it and Unblock the Notifications