జగన్ మంత్రి వర్గంలో చోటెవరికి..! ఆ నలుగురికి మాత్రం బెర్తులు పక్కా అంటున్న నేతులు..!!
ఏపిలో ఎన్నికల ఉత్కంఠతకు తెరపడింది. ఇప్పుడు పదవుల పందారంలో ఉంటామా.. ఉండమా.. అనే ఉత్కంఠతకు తెర లేచింది. అదికార పార్టీ ఎమ్మెల్యేలను ఎవ్వరిని కదిలించినా మంత్రివర్గంలో చోటు గురించి ప్రస్థావన వస్తోంది. ఆంధ్రప్రదేశ్లో కొలువు దీరిన కొత్త ప్రభుత్వానికి మంత్రి వర్గ విస్తరణ సవాల్ గా మారింది. ఏ ప్రజాప్రతినిధి కదిలించినా జగన్ కేబినెట్లో చోటు దక్కించుకునే ఆ నాయకుడెవనే అంశంపైనే చర్చ నడుస్తోంది. మంత్రి పదువులు ఆశిస్తున్న ఆశావహులు, సీనియర్లు జగన్ కలిసి ఒక్క అవకాశం కల్పించమని వేడుకుంటున్నారు. పార్టీకి చేసిన సేవను ప్రముఖంగా ప్రస్తావిస్తున్నారు. అయితే.. వారందరికీ జగన్ మాత్రం చిరునవ్వుతోనే సమాధానం చెబుతున్నట్టు తెలుస్తోంది.

8న సచివాలయంలోనే..! మంత్రి పదవులు ఎవరిని వరిస్తాయో...!!
ఈ నెల 8న మంత్రివర్గ ఏర్పాటుకు జగన్ కసరత్తు చేస్తున్నారు. ఆ రోజు ఉదయం 11.39గంటలకు కొత్త మంత్రలు సచివాలయంలో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అదే రోజు ఉదయం 8.45గంటలకు జగన్ సచివాలయంలోకి అడుగు పెడతారు. తొలుత పూజలు, ప్రార్థనలు చేసి ఆ తర్వాత సీఎంగా సచివాలయంలో విధులు నిర్వర్తించడం ప్రారంభిస్తారు. ఇది జరిగిన రెండు గంటల తర్వాత మంత్రివర్గ ప్రమాణ స్వీకారం ఉండనుంది. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు చేయాలని సచివాలయ అధికారులను సీఎం ఆదేశించారు. ఒకవేళ వర్షం వచ్చిన ఇబ్బందులు లేకుండా ఉండేలా వేదిక ఏర్పాటు చేయాలని సూచించారు. దీంతో జూన్ 8న మంత్రుల ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి.

మంత్రుల ప్రమాణాలకు ఏర్పాట్లు..! మంత్రి వర్గంలో ఎవరనే దానిపైనే సస్పెన్స్..!!
ఒకవైపు మంత్రలు ప్రమాణానికి ఏర్పాట్లు జరుగుతుండగా.. మరోవైపు ఆ మంత్రులెవరన్నది ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. సీనియర్లు, తొలి నుంచి జగన్ వెంట ఉన్న వారి పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నప్పటికీ.. కేవలం 25 మందికే మంత్రులుగా అవకాశం ఉన్నందున ఎవరికి ఆ పదవులు దక్కుతాయనేది ఆసక్తికరంగా మారింది. ఎన్నికల్లో వైసీపీ ఏకంగా 151 స్థానాల్లో గెలిచింది. వీరిలోంచి కేవలం 25 మందికే మంత్రులుగా అవకాశం దక్కనుంది. ఆశావహుల సంఖ్య ఎక్కువగా ఉండటం, పదవులు తక్కువగా ఉన్న నేపథ్యంలో ఎవరెవరు జగన్ కేబినెట్ చేరతారన్నది ఇప్పుడు ఏపీలో హాట్టాపిక్గా మారింది. తొలుత 14 లేదా 15 మందితోనే జగన్ తన కేబినెట్ ఏర్పాటు చేసే అవకాశం ఉందని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల తర్వాత కేబినెట్ను విస్తరించవచ్చన్న ప్రచారం జరుగుతోంది.

జగన్ కేబినెట్లో ఆ నలుగురు..! తారా స్థాయిలో నడుస్తున్న చర్చ..!!
ఈ చర్చ ఎలా ఉన్నా..నలుగురికి మాత్రం మంత్రి పదవులు దక్కడం ఖాయంగా కనిపిస్తోంది. వారు ఆళ్ల రామకృష్ణారెడ్డి, బాలినేని శ్రీనివాసరెడ్డి, మర్రి రాజశేఖర్, బుగ్గన రాజేంద్రనాథ్రెడ్డి. వీరికి మంత్రి పదవులు ఖాయమే. వీరిలో ఆళ్ల రామకృష్ణారెడ్డికి ఇప్పుడే దక్కుతుందా.. లేదా తర్వాత విస్తరణలో దక్కుతుందా తేలాల్సి ఉంది. బుగ్గన రాజేంద్రనాథ్రెడ్డి 2014, 2019లో కర్నూలు జిల్లా డోన్ నుంచి విజయం సాధించారు. రాష్ట్ర ఆర్థిక పరమైన అంశాలపై మంచి పట్టున్న నేతతోపాటు జగన్కు సన్నిహితుడు. ఆయనకు మంత్రివర్గంలో తీసుకుని ఆర్థిక శాఖ అప్పగించే అవకాశం ఉంది. బాలినేని శ్రీనివాస్రెడ్డిని మంత్రి చేస్తానని జగన్ ఎన్నికల ప్రచారంలోనే మాటిచ్చారు. ఇదే తరహాలో లోకేష్పై పోటీ చేసి గెలిచి మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డికి కూడా మంత్రి పదవి ఇస్తానని జగన్తోపాటు షర్మిల కూడా ఎన్నికల ప్రచారంలో మాటిచ్చారు. జగన్ ఇచ్చిన మాట నిలపుకుంటారని బాలినేని, ఆళ్ల సన్నిహితులు చెబుతున్నారు. ఇక మర్రి రాజశేఖర్ ప్రస్తుతం ఏ సభలో ప్రాతినిధ్యం లేదు. ఆయన్ను ఎమ్మెల్సీని చేసి మంత్రివర్గంలోకి తీసుకుంటానని ఎన్నికలకు ముందు జగన్ మాటిచ్చారు.

రేసులో మరికొందరు..! ఆశల పల్లకిలో అదికార పార్టీ ఎమ్మెల్యేలు..!!
వీరితోపాటు ఉత్తరాంధ్ర నుంచి ధర్మాన ప్రసాదరావు, బొత్స సత్యనారాయణ, ముత్యాల నాయుడు పేర్లు పరిశీలనలో ఉన్నాయి. వీరితోపాటు గాజువాకలో పవన్ను ఓడించిన నాగిరెడ్డికి అవకాశం దక్కవచ్చని చెబుతున్నా.. సామాజిక సమీకరణాల దృష్ట్యాకు ఆయనకు బెర్తు అనుమానమే. ఇక మహిళల కోటాలో రోజా, మేకతోటి సుచరిత ముందు వరుసలో ఉన్నారు. తండ్రి వైఎస్ తరహాలోనే మహిళకు హోంశాఖ కేటాయించాలన్న ఆలోచన జగన్ చేస్తే.. సుచరితకు ఆ పదవి దక్కే అవకాశం ఉందన్న ప్రచారం జరుగుతోంది. చిత్తూరు జిల్లాకు చెందిన భూమన కరుణాకరరెడ్డి, మైనార్టీ కోటాలో అంజాద్భాషా, కృష్ణాజిల్లాకు చెందిన కొడాలి నాని, పేర్ని నాని, కొలుసు పార్థసారథి, మల్లాది విష్ణు, పశ్చిమగోదావరి జిల్లా నుంచి గ్రంథి శ్రీనివాస్, తూర్పుగోదావరి నుంచి పిల్లి సుభాష్చంద్రబోస్, విశ్వరూప్ మంత్రి రేసులో ఉన్నారు.












Click it and Unblock the Notifications