పవన్ కల్యాణ్, నారా లోకేష్ లకు గోల్డెన్ ఛాన్స్: అందుకుంటారా? వదులుకుంటారా?
విజయవాడ: గన్నవరం శాసనసభ్యుడు వల్లభనేని వంశీ రాజీనామా చేయడం రాజకీయ వాతావరణాన్ని హీటెక్కించింది. వరుసగా రెండుసార్లు ఘన విజయాన్ని సాధించిన వంశీ శాసన సభ సభ్యత్వానికి రాజీనామా చేయడం, రాజకీయాల నుంచే వైదొలగుతున్నట్లు చెప్పుకోవడం కలకలం రేపింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభంజనాన్ని తట్టుకుని గెలిచిన ఆయన.. అయిదేళ్ల సభ్యత్వ కాలాన్ని అయిదు నెలల్లోనే వదులుకున్నారు. ఆయన రాజీనామా వ్యవహారం తెలుగుదేశం పార్టీకి ఓ కుదుపు. వంశీ రాజీనామాతో ఇక అన్ని రాజకీయ పార్టీల దృష్టీ గన్నవరంపై నిలిచినట్టయింది.

నారా లోకేష్ ను బరిలో దింపుతారా?
వంశీ రాజీనామా టీడీపీ సహా నాలుగు పార్టీలకు సవాల్ విసిరినట్టే. ఈ స్థానానికి ఆరు నెలల వ్యవధిలోగా ఉప ఎన్నిక నిర్వహించాల్సిన అవసరం ఉంది. అధికార వైఎస్ఆర్సీపీ, తెలుగుదేశం, జనసేన, బీజేపీ తమ అభ్యర్థులను బరిలో దింపడం ఖాయంగా కనిపిస్తోంది. వైఎస్సార్సీపీ, బీజేపీలను పక్కన పెడితే.. ప్రస్తుతం జనసేన అధినేత పవన్ కల్యాణ్, తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తమ సత్తాను నిరూపించుకోవడానికి మరోసారి అవకాశం దొరికినట్టయింది. ఈ సారి వారిద్దరూ గన్నవరం ఉప ఎన్నికలో హెడ్ టు హెడ్ పోటీకి దిగే అవకాశాలు లేకపోలేదు.

టీడీపీకి కంచుకోట..
చంద్రబాబుకు చెందిన కమ్మ సామాజిక వర్గం బలంగా ఉండే కృష్ణా జిల్లాలో విజయవాడ శివార్లలో ఉండే గన్నవరం నియోజకవర్గం తెలుగుదేశానికి కంచుకోట. మొదట్లో కమ్యూనిస్టులు ఈ స్థానంపై ఆధిపత్యాన్ని చలాయించినప్పటికీ.. క్రమంగా వారు ప్రాభవాన్ని కోల్పోయారు. 2009, 2014 సహా మొన్నటి ఎన్నికల్లో టీడీపీ హ్యాట్రిక్ విజయాన్ని నమోదు చేసింది. 2009లో దాసరి బాలవర్ధన్ రావు ఇక్కడి నుంచి గెలిచారు. 2014, 2019 ఎన్నికల్లో వంశీ విజయం సాధించారు. ప్రస్తుతం దాసరి బాలవర్ధన్ రావు టీడీపీలో లేరు. ఆయన వైఎస్సార్సీపీ తీర్థాన్ని పుచ్చుకున్నారు.

టీడీపీ తరఫున నారా లోకేష్ ఖాయమేనా?
టీడీపీకి బలమైన సామాజిక వర్గం ఓటు బ్యాంకు ఉన్న గన్నవరం నియోజకవర్గం ఉప ఎన్నికలో నారా లోకేష్ ను బరిలో దించే అవకాశాలు లేకపోలేదు. మొన్నటి ఎన్నికల్లో ఆయన మంగళవారం నుంచి పోటీ చేసి, ఓటమి పాలయ్యారు. ఎమ్మెల్సీగా కొనసాగుతున్నారు. వంశీ రాజీనామా వల్ల ఖాళీ అయిన గన్నవరంలో లోకేష్ ను పోటీ చేయించాలనే డిమాండ్ ఊపందుకోవడానికి ఎంతోో సమయం పట్టకపోవచ్చు. దీనిపై తుది నిర్ణయాన్ని తీసుకోవాల్సిందే చంద్రబాబు నాయుడే. మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావుకు కూడా ఉప ఎన్నిక టికెట్ ఇవ్వవచ్చని అంటున్నారు.

పవన్ కల్యాణ్ అగ్ని పరీక్షే
జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు ఈ ఉప ఎన్నిక అగ్నిపరీక్షే. ఎందుకంటే- ఇప్పటికే ఆయన తెలుగుదేశం పార్టీ నుంచి ప్యాకేజీలు తీసుకుంటున్నారనే ఆరోపణలు ఉన్నాయి. అవి నిజం కావు అని నిరూపించుకోవడానికి ఇదో అయాచిత అవకాశం. తెలుగుదేశాన్ని ఢీ కొట్టగలిగేలా ఆయన ఈ ఎన్నికల్లో వ్యవహరించాల్సి ఉంటుంది. ఏ మాత్రం వెనుకంజ వేసినా.. ప్యాకేజీ ఆరోపణలు నిజమేనని తనకు తానుగా నిరూపించుకున్నట్టవుతుందని వైఎస్సార్సీపీ నాయకులు చెబుతున్నారు. ఈ పరిస్థితుల్లో ఆయన పవన్ కల్యాణ్.. పార్టీ అధ్యక్షుడిగా తానే పోటీ చేస్తారా? లేక అభ్యర్థిని నిలబెడతారా? అనేది ఆసక్తికరంగా మారింది.












Click it and Unblock the Notifications