విశాఖ ఏజెన్సీ గ్రామాల్లో గంజాయి గుప్పు: టన్నులు..టన్నులు సీజ్!
విశాఖపట్నం: విశాఖపట్నం ఏజెన్సీలో మరోసారి గంజాయి గుప్పు మంది. గంజాయి ఘాటు నషాళానికి అంటుకుంటోంది. ఛత్తీస్గఢ్ నుంచి అక్రమంగా ఏజెన్సీ ప్రాంతాలకు చేరిన టన్నుల కొద్దీ గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇంత పెద్ద ఎత్తున గంజాయి వెలుగు చూడటం- చివరికి పోలీసులను కూడా నివ్వెరపరుస్తోంది. విశాఖపట్నం జిల్లాలోని నర్సీపట్నం వద్ద పోలీసులు పెద్ద ఎత్తున గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.
స్వాధీనం చేసుకున్న గంజాయి సుమారు మూడు టన్నుల బరువు ఉంటుందని తెలిపారు. మార్కెట్లో దీని విలువ సుమారు రెండు కోట్ల రూపాయల పైగానే ఉంటుందని అన్నారు.
పెద్ద ఎత్తున గంజాయిని అక్రమంగా విశాఖపట్నం ఏజెన్సీ ప్రాంతాలకు చేరుతున్నట్లు పోలీసులకు పక్కా సమాచారం అందింది. దీనితో వారు ఛత్తీస్గఢ్ నుంచి రాష్ట్రంలో ప్రవేశించే అన్ని వాహనాల సోదా చేపట్టారు. ఛత్తీస్గఢ్ రిజిస్ట్రేషన్ నంబర్ ఉన్న సీజీ04 జేసీ 63 నంబర్ గల వాహనాన్ని తనిఖీ చేయగా- గంజాయి వెలుగులోకి వచ్చింది.
ఈ ఘటనలో ముగ్గురిని అరెస్టు చేశారు. గంజాయితో పాటు దాన్ని తరలిస్తున్న వాహనాన్ని పోలీసులు సీజ్ చేశారు. ఒడిశాలోని మల్కన్గిరి నుంచి ఈ గంజాయిని ఛత్తీస్గఢ్కు తరలిస్తున్నారని వాహన సిబ్బంది వెల్లడించినట్లు చెప్పారు.